03-03-1988 అవ్యక్త మురళి

03-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

హోలీని ఎలా జరుపుకోవాలి మరియు సదాకాల పరివర్తన ఎలా జరుగుతుంది?

ఈ రోజు సర్వుల భాగ్య విధాత అయిన తండ్రి తమ హోలీహంసలతో జ్ఞాన రత్నాల హోలీని జరుపుకునేందుకు వచ్చారు. జరుపుకోవడం అనగా మిలనం జరుపుకోవడం. అతి స్నేహీలు, సహజయోగులు, సదా బాబా కార్యంలో సహయోగులు, సదా పావన వృత్తితో, పావన దృష్టితో సృష్టిని పరివర్తన చేసే హోలీ (పవిత్రమైన) పిల్లలందరినీ చూసి బాప్ దాదా సదా హర్షిస్తారు. ఈ రోజుల్లో ఎవరైతే మహాత్ములుగా మహిమ చేయబడుతున్నారో, వారు కూడా పావనంగా అవుతారు కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు అత్యంత ఉన్నతమైన పవిత్రులుగా అవుతారు అనగా సంకల్ప మాత్రంగా, స్వప్న మాత్రంగా కూడా అపవిత్రత అనేది మీ వృత్తిని, దృష్టిని పావన స్థితి నుండి కిందికి తీసుకురాలేదు. ప్రతి సంకల్పం అనగా స్మృతి పావనంగా ఉన్న కారణంగా వృత్తి, దృష్టి స్వతహాగానే పావనంగా అవుతాయి. కేవలం మీరు పావనంగా అవ్వడమే కాక ప్రకృతిని కూడా పావనంగా చేస్తారు. అందుకే, పావనమైన ప్రకృతి కారణంగా భవిష్యత్తులో అనేక జన్మలలో శరీరాలు కూడా పావనమైనవే లభిస్తాయి. ఇలాంటి హోలీహంసలుగా అనగా సదా పావన సంకల్పధారి శ్రేష్ఠ ఆత్మలుగా అవుతారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ప్రతి విషయంలో మనల్ని శ్రేష్ఠ జీవితం కలవారిగా తయారుచేస్తారు. ఈ పవిత్రత కూడా ఉన్నతాతి ఉన్నతమైన పవిత్రత, సాధారణ పవిత్రత కాదు. సాధారణ పవిత్ర ఆత్మలు మహాన్ పవిత్ర ఆత్మలైన మీ ముందు ‘మీ పవిత్రత అత్యంత శ్రేష్ఠమైనది’ అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ నమస్కారం చేస్తారు. ఈ రోజుల్లో గృహస్థులు తమను తాము అపవిత్రులుగా భావించడం వల్ల వారు ఏ పవిత్ర ఆత్మలనైతే మహాన్ గా భావిస్తూ తల వంచుతారో, ఆ మహాన్ ఆత్మలుగా పిలవబడుతున్న వారు కూడా శ్రేష్ఠ పావన ఆత్మలైన మీ ముందు ‘మీ పవిత్రతకు, మా పవిత్రతకు చాలా తేడా ఉంది’ అని అంగీకరిస్తారు.

ఈ హోలీ పండుగ పావన ఆత్మలైన మీరు పావనంగా అయ్యే విధికి స్మృతిచిహ్నము. ఎందుకంటే నంబరువారుగా ఉన్న పావన ఆత్మలైన మీరందరూ తండ్రి స్మృతి యొక్క తపన అనే అగ్ని ద్వారా సదా కొరకు అపవిత్రతను కాల్చేస్తారు. అందుకే, ముందుగా కాల్చే హోలీని జరుపుకుంటారు, తర్వాత రంగుల హోలీని అనగా మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. కాల్చడం అనగా నామ-రూపాలను సమాప్తం చేయడము. మామూలుగా కూడా దేనినైనా నామ రూపాలు లేకుండా సమాప్తం చేయాలంటే ఏమి చేస్తారు? కాల్చేస్తారు. అందుకే రావణుడిని కూడా హతమార్చిన తర్వాత కాలుస్తారు. ఇది ఆత్మలైన మీ స్మృతిచిహ్నము. మీరు అపవిత్రతను కాల్చేసారు అనగా పావనంగా, ‘హోలీగా’ అయ్యారు. బ్రాహ్మణులు హోలీని జరుపుకోవడం అనగా హోలీగా (పవిత్రంగా) అవ్వడమని బాప్ దాదా సదా వినిపిస్తూ ఉంటారు. కనుక అపవిత్రతను కేవలం హతమార్చామా లేక కాల్చామా అని చెక్ చేసుకోండి. చనిపోయినవారైతే ఎంతైనా మళ్ళీ బ్రతకవచ్చు కూడా, ఎక్కడో ఒకచోట శ్వాస దాగి ఉంటుంది. కానీ కాల్చడం అనగా నామ రూపాలను సమాప్తం చేయడము. ఎంతవరకు చేరుకున్నామని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వప్నంలో కూడా దాగి ఉన్న అపవిత్రత యొక్క శ్వాస మళ్ళీ బ్రతకకూడదు. ఇటువంటివారినే శ్రేష్ఠ పావన ఆత్మలని అంటారు. సంకల్పాల ద్వారా స్వప్నాలు కూడా పరివర్తన అవుతాయి.

ఈ రోజు వతనంలో బాప్ దాదా, పిల్లలు సమయ ప్రతి సమయం సంకల్పాల ద్వారా లేక లిఖిత పూర్వకంగా బాబాకు చేసిన ప్రతిజ్ఞలను చూస్తూ ఉన్నారు. స్థితిలో మహారథులు కావచ్చు, సేవలో మహారథులు కావచ్చు - ఇరువురు సమయ ప్రతి సమయం చాలా మంచి-మంచి ప్రతిజ్ఞలను చేసారు. మహారథులు కూడా రెండు రకాల వారు ఉన్నారు. ఒక రకం వారు - వరదానాలు ప్రాప్తి లేక వారసత్వ ప్రాప్తి కొరకు చేసే పురుషార్థం ఆధారంగా మహారథులు. రెండవ రకం వారు - ఏదో ఒక సేవ విశేషత ఆధారంగా మహారథులు. ఇరువురు మహారథులుగానే పిలవబడతారు కానీ మొదటి నంబరు వారు, స్థితి ఆధారంగా మహారథులు, వారు సదా మనసు ద్వారా అతీంద్రియ సుఖము, సంతుష్టత, సర్వుల హృదయపూర్వక స్నేహము యొక్క ప్రాప్తి స్వరూపం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. రెండవ నంబరు వారు సేవ విశేషత ఆధారంగా మహారథులు, వారు సేవ విశేషత ఉన్నందుకు ఫల స్వరూపంగా తనువు ద్వారా అనగా బాహ్యంగా సంతుష్టంగా కనిపిస్తారు. సేవ విశేషత కారణంగా సేవ ఆధారంగా మనసు సంతుష్టంగా ఉంటుంది. సేవ విశేషత కారణంగా సర్వుల స్నేహం ఉంటుంది కానీ అది మనస్ఫూర్తిగా లేక హృదయపూర్వకంగా సదా ఉండదు. ఒక్కో సారి బాహ్యంగా, ఒక్కో సారి హృదయపూర్వకంగా ఉంటుంది. కానీ సేవ విశేషత మహారథులుగా చేస్తుంది. లెక్కించేటప్పుడు మహారథుల లైనులో వస్తారు.

కనుక ఈ రోజు బాప్ దాదా మహారథులు మరియు పురుషార్థులు - ఇరువురి ప్రతిజ్ఞలను చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే సమీపములో చాలా ప్రతిజ్ఞలు చేసారు. మరి ఏమి చూసారు? ప్రతిజ్ఞల వల్ల లాభమైతే ఉంటుంది ఎందుకంటే దృఢతతో కూడిన ఫుల్ ‘అటెన్షన్’ ఉంటుంది. పదే-పదే ఆ ప్రతిజ్ఞల స్మృతి సమర్థతను అందిస్తుంది. దీని వలన ఎంతో కొంత పరివర్తన కూడా వస్తుంది. కానీ బీజం అణిగి ఉంటుంది కనుక ఎప్పుడైనా అలాంటి సమయం లేక సమస్య వస్తే, ఆ ‘సమస్య’ లేక ‘కారణం’ అనే నీరు లభించడం వలన అణిగి ఉన్న బీజం నుండి మళ్ళీ ఆకులు రావడం మొదలవుతాయి. ఆ బీజం సదా కొరకు సమాప్తమవ్వదు. కాల్చే హోలీని ఎవరెవరు జరుపుకున్నారు అనేది బాప్ దాదా చూస్తున్నారు. బీజాన్ని కాల్చేస్తే, కాలిపోయిన బీజము ఎప్పుడూ ఫలాన్నివ్వదు. ప్రతిజ్ఞలనైతే అందరూ చేసారు, ఏమని అంటే - గతం గతః చేసి, ఇంతవరకు ఏదైతే జరిగిందో, అది స్వయం పట్ల కావచ్చు లేక ఇతరుల పట్ల కావచ్చు, అంతటినీ సమాప్తం చేసి పరివర్తన తీసుకొస్తాము అని. అందరూ ఇప్పుడిప్పుడే ప్రతిజ్ఞలు చేసారు కదా. ఆత్మిక సంభాషణలో అందరూ ప్రతిజ్ఞలు చేస్తారు కదా. ప్రతి ఒక్కరి రికార్డు బాప్ దాదా వద్ద ఉంది. చాలా మంచి రూపాలలో ప్రతిజ్ఞలు చేస్తారు. కొందరు పాటలు-కవితల ద్వారా, కొందరు చిత్రాల ద్వారా చేస్తారు.

బాప్ దాదా చూస్తున్నారు - ఎంతైతే కోరుకుంటారో, అంత పరివర్తన ఎందుకు జరగడం లేదు? కారణమేమిటి? సదా కాలానికి ఎందుకు సమాప్తమవ్వదు? మరి బాప్ దాదా ఏం చూసారు? స్వయం పట్లనైనా లేక ఇతరుల పట్లనైనా - ‘ఈ బలహీనతను ఇక మళ్ళీ రానివ్వమని’ సంకల్పం చేస్తారు. ఇతరుల విషయంలో ఎలా ఆలోచిస్తారంటే - ఏ ఆత్మతోనైనా లెక్కాచారం సమాప్తమవుతున్న కారణంగా సంకల్పాల్లో, మాటల్లో మరియు కర్మల్లో ఏదైతే సంస్కారాల ఘర్షణ జరుగుతుందో, దానిని పరివర్తన చేసుకుంటామని అనుకుంటారు. కానీ సమయానికి మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది? దానికి కారణమేమిటి? ఇకపై ఈ ఆత్మలో ఉన్న సంస్కారాలను తెలుసుకుని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకుంటూ ఆ ఆత్మకు కూడా శుభ భావన, శుభ కామనలు ఇస్తాము అని అనుకుంటారు. ఇతరుల్లో ఉన్న బలహీనతలను చూసే, వినే లేక గ్రహించే అలవాటు ఏదైతే సహజంగా, చాలాకాలం బట్టి ఉందో, ఆ అలవాటునైతే ఇప్పుడు ఉంచుకోరు. చాలా మంచిది. కానీ ఇప్పుడు ఆ బలహీనత స్థానంలో ఏమి చూస్తారు! ఆ ఆత్మ నుండి ఏమి గ్రహిస్తారు! ఈ విషయం పట్ల పదే-పదే అటెన్షన్ పెట్టరు. ఏం చెయ్యకూడదు అనేది గుర్తుంటుంది కానీ అలాంటి ఆత్మల కోసం ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏం చూడాలి! ఈ విషయాల పట్ల న్యాచురల్ అటెన్షన్ ఉండదు. ఉదాహరణకు ఏ స్థానమైనా ఖాళీగా ఉంటే, ఒకవేళ దానిని మంచి రకంగా ఉపయోగించకపోతే, ఆ ఖాళీ స్థానంలో చెత్త లేక దోమలు మొదలైనవి స్వతహాగానే ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే వాయుమండలంలో మట్టి-ధూళి, దోమలు మొదలైనవి ఉండనే ఉన్నాయి కనుక అవి మళ్ళీ కొద్ది కొద్దిగా చేరుతూ పెరిగిపోతాయి ఎందుకంటే ఆ స్థానం నింపి లేదు (ఖాళీగా ఉంది). కనుక ఎప్పుడు ఏ ఆత్మల సంపర్కంలోకి వచ్చినా సరే, ముందు వారి పట్ల మీరు పరివర్తన చేసుకున్న శ్రేష్ఠ సంకల్పాల స్వరూపం సహజంగా గుర్తుకు రావాలి ఎందుకంటే నాలెడ్జ్ ఫుల్ గా అయితే తప్పకుండా అవుతారు. అందరి గుణాలు, కర్తవ్యాలు, సంస్కారాలు, సేవ, స్వభావ పరివర్తన యొక్క శుభ సంస్కారము లేక స్థానం సదా నిండి ఉంటే అశుద్ధత స్వతహాగానే సమాప్తమైపోతుంది.

ఇంతకుముందు కూడా వినిపించాము కదా - చాలా మంది పిల్లలు స్మృతిలో కూర్చున్నప్పుడు లేక బ్రాహ్మణ జీవితంలో నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసం చేసినప్పుడు, ఆ స్మృతిలో శాంతిని అనుభవం చేస్తారు కానీ సంతోషాన్ని అనుభవం చేయరు. కేవలం శాంతి యొక్క అనుభూతి కలిగితే, అది ఒక్కో సారి తలను బరువుగా చేస్తుంది, ఒక్కో సారి నిద్ర వైపుకు తీసుకువెళ్తుంది. శాంతి స్థితితో పాటు సంతోషం ఉండదు. కనుక ఎక్కడైతే సంతోషం ఉండదో, అక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉండవు, అంతేకాక యోగం చేస్తూ కూడా స్వయంతో సంతుష్టంగా ఉండరు, అలసిపోయినట్లుగా ఉంటారు. సదా ఆలోచించే మూడ్ లో ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. సంతోషం ఎందుకు కలగదు అన్నదానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే కేవలం నేను ఆత్మను, బిందువును, జ్యోతి స్వరూపాన్ని, బాబా కూడా అలాగే ఉన్నారు అని ఆలోచిస్తారు కానీ నేను ఎలాంటి ఆత్మను! ఆత్మనైన నా విశేషత ఏమిటి? ఉదాహరణకు నేను పదమాపదమ భాగ్యశాలి ఆత్మను, నేను ఆది రచనలోని ఆత్మను, నేను బాబా హృదయ సింహాసనాధికారిగా అయ్యే ఆత్మను - ఇలా సంతోషాన్ని కలిగించే విశేషతల గురించి ఆలోచించరు. కేవలం బిందువును, జ్యోతిని, శాంతి స్వరూపాన్ని..... అని ఆలోచిస్తే శూన్యంలోకి వెళ్ళిపోతారు కనుక తల బరువెక్కిపోతుంది. అలాగే స్వయం పట్ల లేక ఇతర ఆత్మల పట్ల పరివర్తన యొక్క దృఢ సంకల్పాన్ని చేసినప్పుడు స్వయం పట్ల లేక ఇతర ఆత్మల పట్ల ఆ శుభ, శ్రేష్ఠ సంకల్పాన్ని మరియు విశేషతను సదా ఇమర్జ్ రూపంలో ఉంచుకుంటే పరివర్తన జరుగుతుంది.

ఎలాగైతే ‘వీరు ఇలాంటి వారే, వీరు ఇలానే ఉంటారు, వీరు ఇలానే చేస్తారు’ అనే సంకల్పం వస్తుందో, దీనికి బదులుగా ‘ఈ విశేషత ప్రమాణంగా వీరు విశేషంగా ఇలా ఉన్నారు’ అని ఆలోచించండి. ఎలాగైతే బలహీనత గురించి ‘ఇలా, అలా’ అనే మాటలు వస్తాయో అలా శ్రేష్ఠత మరియు విశేషత గురించి కూడా ‘ఇలా, అలా’ అనే మాటలను ఎదురుగా తెచ్చుకోండి. స్మృతిని, స్వరూపాన్ని, వృత్తిని, దృష్టిని పరివర్తన చేసుకోండి. ఈ రూపంలో స్వయాన్ని కూడా చూడండి, ఇతరులను కూడా చూడండి. స్థానాన్ని నింపేసారు, ఖాళీగా వదలలేదని దీనినే అంటారు. ఈ విధితో కాల్చే హోలీని జరుపుకోండి. ‘వీరు మారేవారు కానే కాదని నేను చెప్పాను కదా, చూడండి’ అని ఎప్పుడూ కూడా స్వయం పట్ల గాని, ఇతరుల పట్ల గాని ఇలా ఆలోచించకండి. ఆ సమయంలో ‘నేను మారానా?’ అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. స్వ పరివర్తనే ఇతరుల పరివర్తనను కూడా ఎదురుగా తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరు ‘ముందు నేను మారి ఉదాహరణగా అవ్వాలి’ అని ఆలోచించండి. దీనినే కాల్చే హోలీని జరుపుకోవడమని అంటారు. కాల్చకుండా హోలీని జరుపుకోలేరు. ముందు కాల్చాల్సే ఉంటుంది ఎందుకంటే కాల్చేసారంటే స్వచ్ఛంగా అయినట్లు, శ్రేష్ఠంగా, పవిత్రంగా అయినట్లు. ఇలాంటి ఆత్మకు స్వతహాగా బాబా సాంగత్యమనే రంగు సదా అంటుకునే ఉంటుంది. ఇలాంటి ఆత్మ సదా తండ్రితో మరియు సర్వ ఆత్మలతో మంగళ మిలనాన్ని అనగా కళ్యాణకారి శ్రేష్ఠ శుభకరమైన మిలనాన్ని జరుపుకుంటూనే ఉంటుంది. అర్థమయిందా?

ఇలాంటి హోలీని జరుపుకోవాలి కదా. ఎక్కడైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అక్కడ ప్రతి ఘడియ ఉత్సవమనేది ఉండనే ఉంటుంది. కనుక బాగా సంతోషంగా జరుపుకోండి, ఆడండి, తినండి, ఆనందించండి కానీ సదా హోలీగా (పవిత్రంగా) అయి మిలనం జరుపుకుంటూ ఉండండి. అచ్ఛా!

సదా ప్రతి సెకండు బాబా ద్వారా వరదానాల శుభాకాంక్షలను తీసుకునేవారు, సదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ ద్వారా శుభ భావనల శుభాకాంక్షలను తీసుకునేవారు, సదా అతి శ్రేష్ఠమైన పావన ఆత్మలకు, సదా సాంగత్యమనే రంగులో రంగరించబడిన ఆత్మలకు, సదా బాబాతో మిలనాన్ని జరుపుకునే ఆత్మలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వ్యక్తిగత మిలనం సమయంలో వరదానాల రూపంలో ఉచ్చరించబడిన మహావాక్యాలు

1. సదా స్వయాన్ని బాబా స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠ ఆత్మగా అనుభవం చేస్తున్నారా? ఛత్రఛాయనే సురక్ష యొక్క సాధనము. ఈ ఛత్రఛాయ నుండి సంకల్పం ద్వారానైనా ఒకవేళ కాలు బయట పెడితే ఏమవుతుంది? రావణుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు మరియు శోక వాటికలో కూర్చోబెడతాడు. మరి అక్కడికైతే వెళ్ళేది లేదు. సదా బాబా ఛత్రఛాయలో ఉండే, బాబాకు స్నేహీ ఆత్మను అనే అనుభవంలో ఉండండి. ఈ అనుభవంతో సదా శక్తిశాలిగా అయి ముందుకు వెళ్తూ ఉంటారు.

2. సదా స్వయాన్ని బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్న ఆత్మగా అనుభవం చేస్తున్నారా? నయనాలలో ఇమిడి ఉన్న ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? కళ్ళల్లో ఏముంటుంది? బిందువు. చూడగలిగే శక్తి అంతా బిందువులో ఉంటుంది కదా. కనుక నయనాలలో ఇమిడి ఉండడం అనగా సదా బిందు రూపంలో స్థితులై ఉండేవారు - ఈ విధంగా అనుభవమవుతుంది కదా! వీరినే ప్రకాశ రత్నాలని అంటారు. కనుక సదా స్వయాన్ని ఈ స్మృతితో ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. సదా ‘ఆత్మనైన నేను ప్రకాశ రత్నాన్ని’ అనే నషాలో ఉండండి.

Comments