15-11-1999 అవ్యక్త మురళి

             15-11-1999         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాబా సమానంగా అయ్యేటందుకు సహజ పురుషార్ధం - ఆజ్ఞాకారి అవ్వండి.

ఈరోజు బాప్ దాదా తన యొక్క హోలీహంసల మండలిని చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ హోలీహంస. మనస్సులో సదా జ్ఞాన రత్నాలను మననం చేసుకుంటూ ఉంటారు. హోలీహంస పని - వ్యర్ధం యొక్క రాళ్ళను వదలడం మరియు జ్ఞాన రత్నాలను మననం చేయడం. ఒక్కొక్క రత్నం ఎంత విలువైనది! ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానరత్నాల ఖజానా అయిపోయారు. జ్ఞానరత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటున్నారు. 

ఈరోజు బాప్ దాదా పిల్లలలో ఒక విశేష విషయాన్ని పరిశీలిస్తున్నారు. అది ఏమిటి? జ్ఞానం లేదా యోగం యొక్క సహజ ధారణకి సహజమైన సాధనం - బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారి అయ్యి నడవటం. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారి, శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురువు రూపంలో కూడా అంటే మూడు రూపాలలో ఆజ్ఞాకారి అవ్వటం అంటే సహజపురుషార్ధిగా అవ్వటం. ఎందుకంటే మూడు రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయానికి, ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించింది. ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటే ఏవిధమైన శ్రమ లేదా కష్టం అనుభవం అవ్వదు. ప్రతి సమయంలో మనసా సంకల్పానికి, వాణీ మరియు కర్మ ఈ మూడు రకాల ఆజ్ఞ స్పష్టంగా లభించింది. ఇది చేద్దామా, వద్దా? ఇది తప్పా లేక ఒప్పా అని ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. పరమాత్మ యొక్క ఆజ్ఞ సదా శ్రేష్టమైనది. కుమారులు ఎవరైతే వచ్చారో అందరి సంఘటన మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు బాబా వారిగా అవుతూనే బాబాతో ప్రతిజ్ఞ చేసారు కదా? బాబా వారిగా అయిన వెంటనే మొట్టమొదట ఏమి ప్రతిజ్ఞ చేసారు? బాబా తనువు, మనస్సు, ధనం అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవి అని. కుమారుల దగ్గర ధనం ఎక్కువ ఉండదు. అయినా కానీ ఉన్నదంతా నీదే అన్నారు. ఈ ప్రతిజ్ఞ చేసారా? తనువు, మనస్సు, ధనం మరియు సంబంధం అన్నీ నీతోనే... అనే ప్రతిజ్ఞ పక్కాగా చేసారు కదా? తనువు, మనస్సు, ధనం అన్నీ నీవే అన్నప్పుడు ఇక నాది అనేది ఏమి ఉంటుంది? మరలా నాది అనేది ఏమైనా ఉందా? తనువు, మనస్సు, ధనం, జనం అన్నీ బాబాకి అర్పణ చేసేసారు. కుటుంబంలో ఉండేవారు చేసేసారా? మధువనం వారు చేసారా? పక్కాయే కదా? మనస్సు కూడా బాబాది అయినప్పుడు ఇక నా మనస్సు అనేది లేదు కదా! లేక మీ మనస్సు అనేది ఉందా? మనస్సుని నాదిగా భావించి ఉపయోగించవచ్చా?మనస్సుని బాబాకి ఇచ్చేసినప్పుడు మీ దగ్గర ఉన్నది తాకట్టు వస్తువు. మరలా యుద్ధం దేనిలో చేస్తున్నారు? నా మనస్సు అలజడిగా ఉంది, నా మనస్సులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనస్సు విచలితం అవుతుంది... అని అంటున్నారు. నాది అనేది లేదు, తాకట్టు వస్తువు, ఆ తాకట్టు వస్తువుని నాదిగా భావించి ఉపయోగించటం అంటే అది కల్తి అవ్వలేదా? మాయకి ద్వారాలు - నేను మరియు నాది. తనువు కూడా మీది కానప్పుడు దేహాభిమానంతో కూడిన నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? మనస్సు కూడా మీది కానప్పుడు నాది, నాది అనేది ఎక్కడ నుండి వచ్చింది? నీదా లేక నాదా? బాబాదేనా? లేక చెప్పటం వరకేనా, చేయటం వరకు కాదా? అనటం బాబాది అని కానీ అంగీకరించటం నాది అని అంటారా! మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి - దేహాభిమానం యొక్క నేను మరియు నాది అనేది ఉండకూడదు. బాబా యొక్క ఆజ్ఞ ఏమిటంటే తనువుని మరియు మనస్సుని కూడా తాకట్టు వస్తువుగా భావించండి. ఇక శ్రమ చేయవలసిన అవసరం ఏముంది? ఈ నేను మరియు నాది అనే రెండు మాటల ద్వారానే ఏ బలహీనత అయినా వస్తుంది. ఇది మీ శరీరం కాదు, దేహాభిమానం యొక్క నేను అనేది లేదు. మీరు ఆజ్ఞాకారి అయితే మనస్సులో నడిచే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏమిటి? శుభం ఆలోచించండి మరియు శుభ భావనతో కూడిన సంకల్పాలు చేయండి. వ్యర్ధ సంకల్పాలు చేయండి అనేది బాబా ఆజ్ఞయా? కాదు, మనస్సు మీది కాదు అయినా కానీ వ్యర్ధ సంకల్పాలు చేస్తుంటే బాబా ఆజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకురాలేనట్లే కదా! కేవలం ఒక మాట స్మృతి ఉంచుకోండి - నేను పరమాత్మ ఆజ్ఞాకారి బిడ్డను. ఇది బాబా ఆజ్ఞయా, కాదా అని అనుకోండి. ఆజ్ఞాకారి పిల్లలకు బాబా యొక్క స్మృతి సదా, స్వతహాగానే ఉంటుంది. స్వతహాగానే బాబాకి ప్రియంగా, సమీపంగా ఉంటారు. కనుక పరిశీలించుకోండి - నేను బాబాకి సమీపమేనా, బాబా యొక్క ఆజ్ఞాకారినేనా? అమృతవేళ నేనెవరు? అనే ఒక మాటను జ్ఞాపకం చేసుకోగలరు కదా! ఆజ్ఞాకారినేనా లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారి, అప్పుడప్పుడు ఆజ్ఞ అతిక్రమించేవాడినా అని చూసుకోండి. బాప్ దాదా సదా చెప్తారు - ఏ రూపంలోనైనా ఒకే బాబా యొక్క సంబంధం గుర్తు ఉంటే, నా బాబా అని మనస్సుతో అంటే సమీపత యొక్క అనుభవం చేసుకోగలరు. బాబా, బాబా అని ఒక మంత్రం వలె అనకండి. ప్రజలు రామా, రామా అని అంటారు అలాగే మీరు బాబా, బాబా అని అనటం కాదు, బాబా అనే మాట మనస్సు నుండి రావాలి. ప్రతి కర్మ చేసే ముందు తనువు కోసం, మనస్సు కోసం మరియు ధనం కోసం బాబా యొక్క ఆజ్ఞ ఏమిటి అని పరిశీలించుకోండి. కుమారుల దగ్గర ఎంత తక్కువ ధనం ఉన్నా కానీ ధనం యొక్క లెక్కలఖాతా బాబా ఎలా ఉంచుకోమని చెప్పారో అలా ఉంటుందా? లేక ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారా? ప్రతి కుమారుడు ధనం యొక్క లెక్కలఖాతా పెట్టుకోవాలి, ధనాన్ని ఎక్కడ మరియు ఏవిధంగా ఉపయోగించాలి, తనువును ఎక్కడ మరియు ఏవిధంగా ఉపయోగించాలి, మనస్సుని కూడా ఎక్కడ మరియు ఏవిధంగా ఉపయోగించాలి! వీటన్నింటి లెక్కలఖాతా ఉండాలి. మీకు దాదీలు ధారణా క్లాస్ చేస్తున్నప్పుడు ధనాన్ని ఏవిధంగా ఉపయోగించాలి, ఏవిధంగా ఖాతా ఉంచుకోవాలి అని చెప్తారు కదా! లెక్కలఖాతా ఏవిధంగా పెట్టుకోవాలో కుమారులకు తెలుసా? ఎక్కడ ఏవిధంగా ఉపయోగించాలో తెలుసా? కొద్దిమందే చేతులు ఎత్తుతున్నారు. క్రొత్త క్రొత్త వారు కూడా ఉన్నారు, వీరికి తెలియదు. కనుక ఏమేమి చేయాలి అనేది వీరికి తప్పకుండా చెప్పాలి. దీని ద్వారా మీరు నిశ్చింత అయిపోతారు, ఏ భారం ఉండదు. ఎందుకంటే కుమారులు అంటే డబల్ లైట్, మీ అందరి లక్ష్యం ఇదే కదా! మేము మొదటి నెంబరులోకి రావాలి అని కుమారులకు లక్ష్యం ఉంది కదా! అయితే లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా కావాలి. లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండి లక్షణాలు లేకపోతే లక్ష్యానికి చేరటం కష్టం. అందువలన బాబా యొక్క ఆజ్ఞను సదా బుద్దిలో ఉంచుకుని ఆ తర్వాత కార్యం చేయండి. 

బాప్ దాదా ఇంతకు ముందు కూడా వివరించారు - బ్రాహ్మణజీవితం యొక్క ముఖ్య ఖజానాలు - సంకల్పం, సమయం మరియు శ్వాస. మీ శ్వాస కూడా చాలా విలువైనది. ఒక శ్వాస కూడా సాధారణంగా, వ్యర్ధంగా ఉండకూడదు. భక్తిలో అంటారు. శ్వాస శ్వాస లో మీ ఇష్టదేవతను స్మృతి చేయండి అని. అంటే శ్వాస కూడా వ్యర్ధంగా వెళ్ళకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా ఇవి సరే కానీ ముఖ్యంగా ఉన్నవి ఈ మూడు ఖజానాలు - సమయం, సంకల్పం, శ్వాస. ఇవి ఆజ్ఞ ప్రకారం సఫలం అవుతున్నాయా? వ్యర్ధంగా వెళ్ళటం లేదు కదా? ఎందుకంటే వ్యర్ధంగా వెళ్ళటం ద్వారా జమ అవ్వదు. జమాఖాతాను సంగమయుగంలోనే జమ చేసుకోవాలి. సత్య, త్రేతాయుగాలలో శ్రేష్ఠపదవి పొందాలి, ద్వాపర, కలియుగాలలో పూజ్యపదవి పొందాలంటే రెండింటినీ ఈ సంగమయుగంలోనే జమ చేసుకోవాలి. ఈ లెక్కతో ఆలోచించండి - సంగమయుగీ సమయం యొక్క జీవితం యొక్క ఈ చిన్న జన్మ యొక్క సంకల్పం, సమయం, శ్వాస ఎంత అమూల్యమైనవి! దీనిలో సోమరిగా కాకూడదు. ఎలా పడితే అలా రోజు గడిపేయడం కాదు. ఒకరోజుని గడపలేదు కానీ ఒక రోజులో చాలా, చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్ధ సంకల్పాలు వస్తే, సమయం వ్యర్ధంగా పోతే 5 నిమిషాలే వ్యర్ధంగా పోయింది అని అనుకోకండి, దానిని కూడా రక్షించండి. సమయానుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి! ఏదో ఒక ఆట చూపిస్తూనే ఉంటుంది. ఎక్కడో అక్కడ ఆటను చూపిస్తుంది. కానీ ప్రకృతి పతి అయిన బ్రాహ్మణాత్మల ఆట ఒకటే - ఎగిరేకళ యొక్క ఆట. ప్రకృతి అయితే తన ఆటను చూపిస్తుంది కానీ బ్రాహ్మణులు తమ ఎగిరేకళ యొక్క ఆటను చూపిస్తున్నారా? 

కొంతమంది పిల్లలు బాప్ దాదాకి ఇలా జరిగింది, అలా జరిగింది... అని ఒరిస్సా యొక్క సమాచారాన్ని వ్రాసి ఇచ్చారు. ప్రకృతి యొక్క ఆటను చూశారు కదా! కానీ బాప్ దాదా అడుగుతున్నారు - మీరు కేవలం ప్రకృతి యొక్క ఆటను చూశారా లేక మీ ఎగిరే కళ యొక్క ఆటలో నిమగ్నమై ఉన్నారా? లేక కేవలం వార్తలు వింటూ ఉన్నారా? వార్తలు అందరూ వినవలసి ఉంటుంది కానీ వార్తలు వినడానికి ఎంత ఆసక్తి ఉంటుందో అంతగా మీ ఎగిరేకళ యొక్క ఆటలో ఉండే ఆసక్తి ఉందా? కొంతమంది గుప్త యోగి పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి గుప్త యోగి పిల్లలకు బాప్ దాదా నుండి కూడా చాలా సహాయం లభించింది మరియు అటువంటి పిల్లలు స్వయం కూడా అచంచలంగా, సాక్షిగా ఉన్నారు మరియు వాయుమండలంలో కూడా సమయానికి సహయోగమిచ్చారు. ప్రభుత్వం వారు లేదా చుట్టుప్రక్కల ప్రజలు స్థూల సహయోగం ఇవ్వడానికి ఎలా అయితే తయారైపోతారో అదేవిధంగా బ్రాహ్మణాత్మలు కూడా తమ వంతు సహాయంగా శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ట కార్యం చేశారా? వీరు ఇది చేశారు, ఫలానా దేశం వారు ఇది చేశారు... అని ప్రభుత్వం వారు ప్రకటించటంలో నిమగ్నం అయిపోతారు. అయితే బాప్ దాదా కూడా అడుగుతున్నారు - బ్రాహ్మణులు అయిన మీరు కూడా మీ కార్యాన్ని మీరు చేశారా? మీరు కూడా సంసిద్ధమవ్వాలి కదా! స్థూల సహయోగం ఇవ్వటం కూడా అవసరమౌతుంది, అది వద్దు అని బాప్ దాదా అనటం లేదు కానీ బ్రాహ్మణాత్మల విశేష కార్యం, ఇతరులు ఎవరూ ఇవ్వలేని సహయోగాన్ని మీరు సంసిద్ధంగా ఇచ్చారా? ఇవ్వాలి కదా! లేక వారికి కేవలం వస్త్రములు. బియ్యమే కావాలా? మొదట మనస్సుకి శాంతి కావాలి, ఎదుర్కునేశక్తి కావాలి కనుక మొదట ఎదుర్కోవడానికి మనస్సులో శాంతి, శక్తి కావాలి. కనుక స్థూలంతో పాటు సూక్ష్మ సహయోగాన్ని బ్రాహ్మణులే ఇవ్వగలరు, మరెవ్వరు ఇవ్వలేరు. ఇప్పుడు జరిగిన ఇవి గొప్పవేమీ కాదు. ఇవన్నీ రిహార్సల్ (ఆట ముందు చేసే అభ్యాసం), అసలైనవి రానున్నాయి. వాటికి అభ్యాసంగా వీటిని బాబా మరియు డ్రామా చేయిస్తున్నాయి. అయితే మీ దగ్గర ఏవైతే శక్తులు, ఖజానాలు ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించడం వస్తుందా? కుమారులు ఏమి చేస్తారు? శక్తులు జమ అయ్యి ఉన్నాయా? శాంతి జమ అయ్యిందా? ఉపయోగించడం వస్తుందా? చేతులు అయితే చాలా మంచిగా ఎత్తుతారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించాలి. సాక్షి అయ్యి చూడాలి, వినాలి మరియు సహయోగం కూడా ఇవ్వాలి. చివర్లో అసలైనవి వచ్చినప్పుడు వాటిని సాక్షిగా మరియు నిర్భయంగా చూడాలి మరియు పాత్రను అభినయించాలి. ఏ పాత్ర అభినయించాలి? దాత యొక్క పిల్లలు దాతగా అయ్యి ఏ ఆత్మలకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉండాలి. మాస్టర్ దాతలు కదా? స్టాక్ ని జమ చేసుకోండి. ఎంత స్టాక్ మీ దగ్గర ఉంటే అంతగా దాత కాగలరు. అంతిమం వరకు మీ కోసమే జమ చేసుకుంటూ ఉంటే దాతగా కాలేరు. అనేక జన్మలు శ్రేష్ట పదవిని పొందలేరు. అందువలన 1. మీ దగ్గర స్టాక్ జమ చేసుకోండి. శుభభావన, శ్రేష్ట కామన యొక్క భండారా సదా నిండుగా ఉండాలి. 2. విశేషశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ఏ సమయంలో, ఎవరికి, ఏ శక్తి కావాలంటే ఆ శక్తి ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయం అనుసరించి కేవలం మీ పురుషార్థంలోనే సంకల్పం మరియు సమయం ఉపయోగించడం కాకుండా వెనువెంట దాత అయ్యి విశ్వానికి కూడా సహయోగం ఇవ్వండి. మీ పురుషార్థం కోసం అయితే చెప్పాను - అమృతవేళ "నేను ఆజ్ఞాకారి బిడ్డను” అని అనుకోండి. ప్రతి కర్మకి ఆజ్ఞ లభించింది. మేల్కోవడానికి, నిద్రపోవడానికి, తినడానికి, ప్రతి కర్మలో కర్మయోగి అవ్వడానికి ఆజ్ఞ లభించింది. ప్రతి కర్మకి ఆజ్ఞ లభించింది. ఆజ్ఞాకారిగా అవ్వటమే బాబా సమానంగా అవ్వటం. శ్రీమతంపై నడవాలి కానీ మన్మతంపై, పరమతంపై కాదు. జోడింపులు ఏమీ ఉండకూడదు. అప్పుడప్పుడు మన్మతంపై, అప్పుడప్పుడు పరమతంపై నడిస్తే శ్రమ చేయవలసి వస్తుంది. సహజం అనిపించదు. ఎందుకంటే మన్మతం, పరమతం పైకి ఎగరనివ్వవు. మన్మతం, పరమతం అంటే బరువైనవి. ఈ బరువు ఎగరనివ్వదు. శ్రీమతం డబల్ లైట్ గా చేస్తుంది. శ్రీమతంపై నడవటం అంటే సహజంగా బాబా సమానంగా అవ్వటం. శ్రీమతంపై నడిచేవారిని ఏ పరిస్థితి కిందకి తీసుకురాలేదు. కనుక శ్రీమతంపై నడవటం వస్తుందా? 

మంచిది, అయితే ఇప్పుడు కుమారులు ఏమి చేస్తారు? ఆహ్వానం లభించింది, విశేష మర్యాద లభించింది. అంటే ఎంత గారాభమైనవారు! ఇప్పుడు ఇక ముందు ఏమి చేస్తారు? జవాబు ఇస్తారా లేక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడిలా ఇక్కడికి వస్తే ఇక్కడిలా అయిపోతారా? ఇలా అవ్వరు కదా? ఇక్కడైతే చాలా ఆనందంలో ఉంటారు, మాయ యొక్క యుద్ధం నుండి రక్షణగా ఉంటారు. మధువనంలో కూడా మాయ వచ్చింది, శ్రమ చేయవలసి వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా? రక్షణగా ఉన్నారు కదా! మంచిది! బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. యువకుల గ్రూప్ వైపు ప్రభుత్వం వారి యొక్క ధ్యాస వెళ్ళే సమయం వస్తుంది. కానీ మీరు విఘ్నవినాశకులుగా అయితేనే ధ్యాస వెళ్తుంది. విఘ్నవినాశకులు అనే పేరు ఎవరిది? మీదే కదా! ఏ కుమారుడిని అయినా ఎదుర్కునే ధైర్యం విఘ్నాలకు ఉండకూడదు. అప్పుడే విఘ్నవినాశకులు అని అంటారు.విఘ్నం ఓడిపోవాలే కానీ యుద్ధం చేయకూడదు. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా? లేక మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత - దాదీ! చాలా మంచిగా ఉండేవాళ్ళం కానీ ఏమైపోయిందో తెలియదు అని లెటర్ వ్రాస్తారా! ఇలా వ్రాయరు కదా. ఓ.కె., చాలా మంచిగా ఉన్నాము, విఘ్నవినాశకులుగా ఉన్నాము అనే శుభవార్త వ్రాయండి. కేవలం ఒక పదం వ్రాయండి. పెద్ద ఉత్తరం వ్రాయకండి. ఓ.కె. అని వ్రాయండి. పెద్ద ఉత్తరం వ్రాయడానికి ఎలా వ్రాయము, ఏమి వ్రాయము అని మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది కదా! కొంతమంది పిల్లలు చెప్తున్నారు - ఖాతా అంతా వ్రాయాలనుకుంటున్నాము కానీ ఆరోజు ఏదోక విషయం జరుగుతుంది, అది వ్రాయడానికి ధైర్యం చాలటం లేదు. అసలు ఆ విషయం ఎందుకు జరిగింది? విఘ్నవినాశకులు అనే టైటిల్ లేదా? కానీ వ్రాయటం ద్వారా, చెప్పటం ద్వారా సగం కట్ అయిపోతుంది అని బాబా అంటారు. దీనిలో లాభం ఉంది కానీ పెద్ద లెటర్ వ్రాయకండి. ఓ.కే అని వ్రాయండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే రెండవరోజు విశేషమైన ధ్యాస పెట్టుకుని విఘ్నవినాశకులు అయ్యి అప్పుడు ఓ.కె. అని వ్రాయండి. పెద్ద కథలు వ్రాయకండి. ఇది జరిగింది, అది జరిగింది.... వారు ఇలా అన్నారు, వీరు అలా అన్నారు.... ఇదంతా రామాయణం మరియు వారి యొక్క కథలు. జ్ఞాన మార్గంలో ఒకే పదం ఉంటుంది, అది ఏమిటి? ఓ.కె. (0.K), శివబాబా ఎలా అయితే వృత్తాకారంగా ఉంటారో ' ఓ' అనే అక్షరాన్ని కూడా అలాగే వ్రాస్తారు కదా! మరియు కె అంటే మీ రాజ్యం (K- KINGDOM). కనుక ఓ.కె. అంటే బాబా కూడా స్మృతి ఉన్నారు మరియు రాజ్యం కూడా స్మృతి ఉంది. ఇలా ఓ.కె. అంటూ రోజూ ఉత్తరం వ్రాయకండి. అలా అయితే పోస్ట్ ఖర్చు పెరిగిపోతుంది. ఓ.కె. అని వ్రాసి మీ టీచర్ కి ఇవ్వండి. అప్పుడు 15 రోజులకి ఒకసారి, లేదా నెలకి ఒకసారి అందరి సమాచారం ఒకేసారి వ్రాస్తారు. పోస్ట్ కోసం కూడా అంత ఖర్చు చేయకూడదు, పొదుపు చేయాలి కదా! అంతేకాకుండా అన్ని ఉత్తరాలు అయితే చదవడానికి ఇక్కడ కూడా సమయం ఉండదు. మీరు రోజూ వ్రాయండి, టీచర్ కి ఇవ్వండి, అప్పుడు టీచర్ ఒకే కాగితంపై ఓ. కె. అని వ్రాస్తారు లేదా లేదు అని వ్రాస్తారు. ఇంగ్లీషు రాకపోయినా కానీ ఓ.కె. మరియు నో అని వ్రాయటం వస్తుంది కదా! ఒకవేళ అది కూడా రాకపోతే సరిగ్గానే ఉన్నాము లేదా సరిగా లేము అని వ్రాయండి. 

యువకుల నుండి ఏమి ఫలితం వస్తుంది? ఓ.కె. అనే వస్తుందా! లేక అక్కడికి వెళ్ళాం కనుక అలా అయ్యింది, ఇలా అయ్యింది అని చెప్తారా? ఇలా, అలా అని చెప్పకండి. యువకులు అద్భుతాన్ని చూపించండి. అందరూ నెంబర్ వన్ గ్రూప్ అని అనాలి. స్పెషల్ గా కలుసుకున్నారు కదా? పార్టీలో వస్తే ఎదురుగా కూర్చోడానికి కొద్దిమందికే అవకాశం లభిస్తుంది. కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ అలా కూర్చుంటారు కానీ ఇప్పుడైతే అందరూ ఎదురుగా కూర్చున్నారు. మధువనం యొక్క ఈ స్నేహాన్ని మరియు శక్తిని మర్చిపోకూడదు. ఏమైనా కానీ సదా మధువనం యొక్క తాజాదనాన్ని గుర్తు చేసుకోవాలి. యువకులు అలా ఉంటారా? చూస్తాను. బ్రాహ్మణ పరివారం అందరి దృష్టి ఈ సమయంలో యువకులపై ఉంది. యువకులు ఏమి చేస్తున్నారు, ఇక ముందు ఏమి చేస్తారు అని అందరు ఇదే ఆలోచిస్తున్నారు. 

బాప్ దాదాకి కూడా ఈ ప్రోగ్రామ్ మంచిగా అనిపిస్తుంది. అందరు సంతోషమేనా? అయితే సదా సంతోషంగా ఉండాలి. కేవలం మధువనంలోనే సంతోషంగా ఉండటం కాదు. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - నడుస్తూ, నడుస్తూ ఎవరైనా కానీ కోపంలోకి ఎందుకు వస్తారు? ఏదో ఒక జ్ఞానరహస్యాన్ని మర్చిపోతున్నారు అందువలనే కోపంలోకి వస్తున్నారు. మీరయితే రహస్యాలన్నింటినీ అర్ధం చేసుకుని, ఆలోచించి పక్కా అయ్యి వెళ్తున్నారు కదా! ఎప్పుడూ కోపంలోకి రాకూడదు. మీపై మీరు కూడా కోపగించుకోకూడదు, ఇతరులపై కూడా కోపగించుకోకూడదు. సంతోషంగా ఉండాలి. మరలా సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఒక నెల సంతోషఖజానా జమ అయి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా సమాప్తి అయిపోవటం ఇలా ఉండరు కదా? సమాప్తి అవ్వదు కదా? సదా వెంట ఉంచుకోవాలి. మంచిది, తనువు, మనస్సు, ధనం అన్నీ బాబాకి ఇచ్చేసారు కదా? మనస్సుని కూడా ఇచ్చేసారా? ఒకవేళ మనస్సుని బాబాకి ఇచ్చేసినట్లయితే బాబా ఏ ఆజ్ఞ ఇస్తారో దాని అనుసారంగా నడవండి, మీ దగ్గర ఉన్న మనస్సు మీ కోసం కాదు. అయితే చెప్పండి - ఎవరైతే మనస్సుని మనోభిరాముడికి ఇచ్చేశారో అటువంటి వారు ఎప్పుడైనా, ఏ ఆత్మలతో అయినా మనస్సుని జోడిస్తారా? జోడించరు కదా! అయితే ఎవరితోనైనా మనస్సు తగుల్కుంది అనే విషయం, నడవడిక, దృష్టి మరియు వృత్తి ద్వారా కూడా చేయరు కదా! లేక మనస్సు కొద్దిగానే ఇచ్చి ఇతరులకు ఇవ్వడానికి కొంచెం ఉంచుకున్నారా? మనస్సుని ఇచ్చేశారా? అయితే మనస్సు తగుల్కోకూడదు. మనస్సు అనేది బాబా యొక్క తాకట్టు వస్తువు. మనోభిరామునికి మనస్సు ఇచ్చేసారు. మనస్సు తగుల్కున్న కథలు చాలా వస్తున్నాయి. కనుక కుమారులు గుర్తు ఉంచుకోవాలి, మామూలుగా అయితే కుటుంబంలో ఉండేవారు కూడా గుర్తు ఉంచుకోవాలి కానీ ఈ రోజు కుమారుల రోజు కదా! కనుక బాప్ దాదా ఈ ధ్యాస ఇప్పిస్తున్నారు - ఎప్పుడూ ఈ విధమైన రిపోర్ట్ రాకూడదు. మీ మనస్సు అనేదే లేదు, బాబాకి ఇచ్చేసారు, మరయితే మనస్సు మరలా ఎలా తగులుకుంటుంది? ఒకవేళ ఎవరి దృష్టి, వృత్తి అయినా కొంచెం బలహీనంగా ఉంటే బలహీన మనస్సుని ఇక్కడి నుండే గట్టిగా చేసుకుని వెళ్ళాలి. దీనిలో అలాగే అని అంటారా! లేక అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అలా ఉన్నాయి అని అంటారా? ఏది ఏమైనా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ బాప్ దాదాకి ఇచ్చిన మాటను మాత్రం వదలకూడదు. పరమాత్మకు ఇచ్చిన మాటను మరియు మాట ఇవ్వడాన్ని గుర్తు ఉంచుకోవాలి. ఏ ఆత్మకీ మాట ఇవ్వలేదు, పరమాత్మకి మాట ఇచ్చారు. అందువలన ఎప్పుడూ మాట తప్పకూడదు. జన్మ యొక్క ప్రతిజ్ఞను ఎప్పుడూ మర్చిపోకూడదు. 

కనుక ఇప్పుడు అందరూ ఒక నిమిషం మీ మనస్సుతో అసలైతే మనస్సు మీది కాదు, బాబాకి ఇచ్చేశారు కానీ మనస్సుతో ఒక నిమిషం మాట ఇవ్వండి - సదా విఘ్నవినాశకులుగా, ఆజ్ఞాకారిగా ఉంటాము. (వ్యాయామం) అందరూ ప్రతిజ్ఞ చేశారా? డబల్ విదేశీయులు చేతులెత్తండి. డబల్ విదేశీయులను చూసి మీరందరు కూడా సంతోషిస్తున్నారు కదా! మిమ్మల్నందరినీ చూసి అందరూ ఎంత సంతోషిస్తున్నారో చూడండి! ఎందుకంటే డబల్ విదేశీయులకు సంగమయుగంలో డ్రామాలో బాబాని ప్రత్యక్షం చేసే మంచి పాత్ర ఉంది. బాప్ దాదా చెప్తారు - డబల్ విదేశీయులు బాబా యొక్క ఒక టైటిల్ ను ప్రత్యక్షం చేసారు. మొదట భారతదేశం యొక్క కళ్యాణకారిగా ఉన్నారు ఇప్పుడు ప్రత్యక్షంలో విశ్వకళ్యాణిగా అయ్యారు. దీనికి వీరు నిమిత్తమయ్యారు కదా? విదేశాల నుండి కల్పపూర్వపు క్రొత్త, క్రొత్త ఆత్మలు వచ్చినప్పుడు బాప్ దాదా కూడా వారి యొక్క విశేషత లేదా అద్భుతం చూస్తారు. బాప్ దాదా అయితే భారతదేశ చరిత్ర యొక్క విషయాలు కూడా చాలా చెప్తారు, కానీ అవి విదేశీయులకు అస్సలు తెలియవు - గణేశుడు ఎవరు, హనుమంతుడు ఎవరు, రామాయణం ఏమిటి, భాగవతం ఏమిటి, భక్తి ఏమిటి? ఇవేమి తెలియదు. కానీ కల్పపూర్వపు పరిచయం కారణంగా అన్ని విషయాలను సహజంగా గ్రహించేస్తున్నారు. గ్రహణ శక్తి బాగా ఉంది. అర్ధం చేసేసుకుంటారు. ఎందుకంటే ఏదైతే వింటారో దానిని అనుభవము చేసుకునే విశేషత ఒకటి వీరిలో ఉంది. కేవలం విని నడవరు. శాంతి యొక్క అనుభవం అయినా, సంతోషం యొక్క అనుభవం అయినా, నిస్వార్ధ ప్రేమ యొక్క అనుభవం అయినా కానీ ఇలా ఏదో ఒక అనుభవం పరివర్తన చేస్తుంది. బాప్ దాదా డబల్ విదేశీయుల అద్భుతం చూస్తూ ఉంటారు మరియు ఓహో పిల్లలూ! ఓహో!! అని అంటూంటారు. ఈ రోజులలో నలువైపుల విదేశాల సమాచారాలలో సేవ యొక్క ఉల్లాసం బావుంది. కానీ స్మృతి మరియు సేవ యొక్క సమానత మరింత కావాలి. అయినా కానీ సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు బావున్నాయి మరియు ముందుకు వెళ్తూన్నారు. మరొక విశేషత కూడా ఉంది - ఎప్పుడూ కూడా ఏ బలహీనతను దాచరు. స్వచ్చమైన హృదయం. డబల్ విదేశీయులు విన్నారా? బాప్ దాదా ఓహో పిల్లలూ! ఓహో!! అనే పాట పాడుతూ ఉంటారు. జనరల్ గ్రూప్ లో కూడా విదేశీయులకు వ్యక్తిగత కలయిక జరిగింది కదా? పరిస్థితులు అన్నీ దాటుకుని ఎలా వచ్చేస్తారో చూడండి! బాప్ దాదా చూస్తున్నారు - విదేశీయులలో ఎక్కువమంది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. భారతవాసీయులు అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు కానీ వీరు మిస్ చేయరు. ఏమి చేయవలసి వచ్చినా కానీ రావలిసిందే అని అనుకుంటారు. రష్యా వారికి ధనం తక్కువగా ఉన్నా కానీ పెద్ద గ్రూప్ వస్తారు. విదేశీయులకు ధైర్యం చాలా మంచిగా ఉంది. అందువలన ప్రతి ఒక విదేశీకి బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు ఇస్తున్నారు. 

నలువైపుల ఉన్నటువంటి బాప్ దాదా యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్నవినాశక పిల్లలకు, సదా శ్రీమతంపై సహజంగా నడిచేవారికి, శ్రమ నుండి ముక్తిగా సదా ఆనందంలో ఎగురుతూ, ఎగిరింపచేసేవారికి, సర్వఖజానాల భండారాతో నిండుగా ఉండేవారికి, ఈవిధంగా బాబాకి సమీపంగా మరియు సమానంగా ఉండే పిల్లలకు, చాలా - చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. కుమారులకు, విశేషంగా అలసిపోనివారిగా, ఎవరెడీ, సదా ఎగిరేకళలో ఎగిరేవారికి బాప్ దాదా యొక్క విశేష ప్రియస్మృతులు. 

Comments