18-01-1996 అవ్యక్త మురళి

         18-01-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమర్ధంగా ఉండేటందుకు సహజ విధి - శుభచింతన చేయండి మరియు శుభచింతకులు అవ్వండి .

ఈరోజు స్నేహ సంపన్న స్మృతిదివసం. నలువైపుల ఉన్న పిల్లల స్నేహం యొక్క మనస్సు యొక్క ధ్వని బాప్ దాదా దగ్గరకి చేరుకుంది. ఈ స్నేహం సుఖ స్వరూప స్నేహం, బాప్ దాదా ఈ రోజుని స్మృతి దివసంతో పాటు సమర్ధ దివసం అని కూడా అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మాబాబా సాకార స్వరూపంలో అన్ని కార్యాల యొక్క సమర్థతలు అంటే శక్తులు అన్నీ సాకార రూపంలో పిల్లలకి అర్పణ చేసారు. ఈ రోజుని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే వరదానం పొందిన రోజు అని అంటారు. సాకార రూపంలో పిల్లలని ముందుంచారు. మరియు ఫరిస్తా రూపంలో తన పిల్లల యొక్క మరియు విశ్వం యొక్క సేవని అరంభించారు. ఈ జనవరి 18 రోజు బ్రహ్మాబాబా సంపూర్ణ నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యారు. గీతలో 18 అధ్యాయాల సారం - భగవంతుడు అర్జునుడిని నష్టోమోహ స్మృతి స్వరూపంగా తయారుచేశారు. ఇది జనవరి 18 యొక్క స్మృతి చిహ్నం. బాబా పిల్లలతో అతి స్నేహిగా ఉండేవారు. అనుభవీ అయిన పిల్లలు ఉన్నారు కదా! సదా సేవకి నిమిత్తంగా అయిన పిల్లలను ఎంతగా జ్ఞాపకం చేసేవారో అనుభవమే కదా! మోహం లేదు కానీ మనస్పూర్వక ప్రేమ ఉండేది. ప్రేమలో స్వార్థం ఉంటే దానిని మోహం అంటారు. కానీ బ్రహ్మాబాబాకి స్వార్ధం లేదు, సేవార్ధం పిల్లలపై అతి స్నేహం ఉండేది. వెంట ఉంటూ మరియు పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహరూపం యొక్క స్మృతి బాధించలేదు. పూర్తిగా అతీతంగా మరియు అతిప్రియంగా ఉండేవారు. అందువలనే నష్టోమోహ స్మృతి స్వరూప అని అంటారు. నాది అనే భావం ఏదీ ఉండేది కాదు.దేహాభిమానంతో కూడా నష్టోమోహగా ఉండేవారు. అందువలన ఈరోజు బ్రహ్మాబాబాని అనుసరించే పాఠాన్ని చదువుకునే రోజు. 

ఈ అవ్యక్త దినోత్సవం అనేది అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపు మేల్కొల్పే రోజు. ఎందుకంటే ఎక్కువమంది ప్రజలు బ్రహ్మాబాబాని చూసి వీరి పరమాత్మ బ్రహ్మయే అని అనుకునేవారు. ఈ బ్రహ్మాకుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు అని కానీ బ్రహ్మాబాబా సాకారంలో పాత్ర పరివర్తన చేసుకున్న తరువాత ఆలోచించడం ప్రారంభించారు. ఇప్పుడు బ్రహ్మాకుమారీల భగవంతుడు వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళ పని ఈరోజు కాకపోతే రేపు పూర్తి అయిపోతుంది అని. కానీ మీకు తెలుసు ఇదంతా బ్రహ్మ ద్వారా చేయించేవాడు పరమాత్మ కనుక అంతిమం వరకు నడుస్తుంది. ఇది పరమాత్మ కార్యం, వ్యక్తి యొక్క కార్యం కాదు. బ్రహ్మాబాబా సాకార పాత్ర పరివర్తన అయిన తర్వాత వీరిని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా పరమాత్మని తెలుసుకోలేదు కానీ ఏదో ఒక శక్తి కార్యం చేస్తుంది ఆ శక్తి ఏమిటి అనేది చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు చివరికి అర్థం చేసుకోవలసిందే. అయితే ఇది ఎవరి కార్యం ? బ్రహ్మాబాబా కార్యమా లేదా పరమాత్మ బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారా? ఎవరి కార్యం? బ్రహ్మాబాబా అవ్యక్తం అయిపోయిన తరువాత వచ్చిన పిల్లలు అనుకుంటున్నారు - బ్రహ్మాబాబా ఇంత తొందరగా తన పాత్రను ఎందుకు పూర్తి చేశారు? అని. ఉంటే మేము కూడా చూసే వాళ్ళం కదా! మేము కూడా కలిసేవాళ్ళం అని ఆలోచిస్తున్నారు కదా? కానీ కల్పపూర్వపు మహిమ కూడా ఉంది. కౌరవ సేనకి నిమిత్తం అయిన మహావీరుల కళ్యాణం ఎవరి ద్వారా జరిగింది? శక్తి ద్వారానే అయ్యింది కదా! అందువలన డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిర్ణయం అయిపోయింది. మాతృశక్తి లేకుండా ఈ విశ్వానికి కళ్యాణం జరగటం అసంభవం అని అందరూ ఒప్పుకుంటారు. అయితే బ్రహ్మాబాబా ఫరిస్తాగా ఎందుకు అయ్యారు, సాకార పాత్రను ఎందుకు పరివర్తన చేశారు? ఒకవేళ బ్రహ్మాబాబా ఫరిస్తా రూపం ధారణ చేసి ఉండకపోతే ఇంతమంది ఆత్మలు ఇక్కడికి చేరుకోలేరు. ఎందుకంటే వాయుమండలం యొక్క తరంగాలు ఈ విశ్వక్రాంతి కార్యాన్ని తేలిక చేస్తున్నాయి. బ్రహ్మాబాబా ముఖ్యంగా పిల్లల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పడానికే ఫరిస్తాగా అయ్యారు. ఫరిస్తా రూపంలో సేవలో వచ్చిన తీవ్రవేగాన్ని మీరు చూస్తున్నారు కదా! వేగం తీవ్రం అయ్యిందా లేక తక్కువ అయ్యిందా? తీవ్రం అయ్యింది కదా! తీవ్రం అయ్యింది కనుకనే మీరు ఇక్కడికి చేరుకున్నారు. లేకపోతే ఈపాటికి బాగా నిద్రపోతూ ఉండేవారు. బ్రహ్మాబాబా అవ్యక్తం అయిపోయారు, అయిపోయారు అని బయటివారి లాగా అనుకోవడం కాదు. మేము కూడా బ్రహ్మ సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవుతాం అని బ్రహ్మాబాబాని అనుసరించే ఉత్సాహ ఉల్లాసాలు రావాలి. ఈ రోజు ప్రత్యక్షపాఠం చదువుకునే రోజు. . 

ఈరోజు మీలో ఎవరికైనా మనస్సు నుండి దు:ఖం యొక్క కన్నీళ్ళు వచ్చాయా? బయటికి వచ్చాయా? లేక లోలోపల కొంచెమే వచ్చాయా? కొంచెం అయినా దు:ఖం యొక్క అల వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. దు:ఖం వచ్చిందా? రాలేదా? ఈరోజు సేవలో బ్రహ్మాబాబాకి తోడు అయ్యే రోజు, మీరందరు సహయోగులేనా? లేక సాక్షిలా? సేవలో సాతీ మరియు మాయ యొక్క పరీక్షలలో సాక్షిగా ఉండాలి. మాయకి స్వాగతం చెప్పారా లేక అయ్యో! ఇలా అయిపోయింది ఏమిటి అని భయపడుతున్నారా? కొంచెం కొంచెం భయపడుతున్నారా? మాయ యొక్క తేలికైన రూపం గురించి అయితే మీకు కూడా తెలుసు కదా, వీళ్ళకి తెలిసిపోయింది. అని మాయ కూడా అనుకుంటుంది. కానీ మాయ విరాట రూపంలో వచ్చినా కూడా సదా సాక్షి అయ్యి ఆట ఆడండి. కుస్తీ ఆట ఉంటుంది కదా! ఆ ఆట చూసారా? లేక చూపించమంటారా? ఇక్కడి పిల్లలు చేసి చూపిస్తారు కదా! అలాగే మీరు కూడా కుస్తీ ఆట ఆడుతున్నారు. మాయని బాగా కొట్టండి. ఇది ఆట, భయపడకండి. సాక్షిగా అయ్యి ఆట ఆడితే మజా వస్తుంది. మాయ వచ్చేసింది, వచ్చేసింది అనుకుంటే భయపడతారు. మాయలో ఇప్పుడు కొంచెం కూడా శక్తి లేదు. బయటికి సింహంలా ఉంది కానీ పిల్లి కూడా కాదు. మిమ్మల్ని భయపెట్టడానికి పెద్దగా వస్తుంది. దాన్ని చూసి ఇప్పుడు ఏమవుతుందో అనుకుంటున్నారు. ఏం చేయను, ఎలా అవుతుందో, ఎలా అవుతుందో....అని ఎప్పుడు అనకండి. బాప్ దాదా ఇంతకు ముందు కూడా పాఠం చదివించారు. జరిగేదంతా మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది అని. బ్రాహ్మణులుగా అవ్వటం అంటే మంచిదే మంచిది. కలలో కూడా అనుకోని విషయాలు వస్తాయి. కొన్ని విషయాలు అజ్ఞానకాలంలో కూడా జరగనివి వస్తాయి. ఉదాహరణకి అజ్ఞానంలో ఉన్నప్పుడు వ్యాపారంలో దెబ్బ తినలేదు. జ్ఞానంలోకి వచ్చిన తరువాత వ్యాపారంలో అలజడి వచ్చిందనుకోండి. అయితే జ్ఞానం వదిలేద్దాం అని భయపడుతున్నారు. కానీ ఏ పరిస్థితి వచ్చినా ఆ కొంచెం సమయం దానిని శిక్షకునిగా భావించండి. శిక్షకుడు ఏమి చేస్తాడు? శిక్షణ ఇస్తాడు. అలాగే పరిస్థితి కూడా విశేషంగా మిమ్మల్ని రెండు శక్తుల యొక్క అనుభవిగా చేస్తుంది. 1. సహనశక్తి, అతీత స్థితి, నష్టోమోహ 2. ఎదుర్కోనే శక్తి యొక్క పాఠం చదివిస్తుంది. ఈ పరిస్థితి ఈ రెండు పాఠాలను చదివించడానికి వచ్చింది అని ఆ రెండు పాఠాలను ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి. మేము నిమిత్తులం నాది అంటూ ఏదీ లేదు అని అంటున్నారు. మోసం చేయడానికి అనటం లేదు కదా! మనస్సుతో అంటున్నారా? నిమిత్తులేనా? అప్పుడప్పుడు గృహస్తీలుగా, అప్పుడప్పుడు నిమిత్తులుగా అవుతున్నారా? 

క్రొత్త సంవత్సరంలో బాప్ దాదాకి రెండు - నాలుగు బొమ్మలు ఇచ్చారు, ఆ బొమ్మల్లో ఒకటి ఒకవైపు త్రిప్పితే అన్నయ్య, మరోవైపు త్రిప్పితే అక్కయ్య బొమ్మ వస్తుంది. ఒకే బొమ్మ మారుతూ ఉంటుంది. ఒక సెకనులో ఒక విధంగా, ఒక సెకనులో ఒక విధంగా అవుతుంది. మీరు అటువంటి బొమ్మ కాదు కదా! ఇప్పుడిప్పుడే గృహస్థీగా, ఇప్పుడిప్పుడే నిమిత్తులుగా ఉండటం లేదు కదా! కొద్దికొద్దిగా అప్పుడప్పుడు అలా అవుతున్నారా? భయపడుతున్నారు కదా మాయ, వీరు భయపడుతున్నారు అని అర్ధం చేసుకుంటుంది. అందువలన భయపడకండి. నిమిత్తం అంటే మొదటి నుండి అన్నీ వదిలిపోవాలి. నిమిత్తులు అంటే అన్ని బాబాకి అర్పణ చేసేసారు. ఇక నాది అనేది ఏమి ఉంటుంది! చేస్తాను, చూస్తాను ఇలా “ను, ను,” అంటే అలజడి అవుతుంది కదా !అన్ని మంచివే మరియు మంచిగా అవ్వాల్సిందే. నిశ్చితం అయిపోయింది - దీనినే సమర్ధ స్వరూపం అంటారు. ఈరోజు ఏమి రోజు? సమర్ధంగా, నష్టోమోహగా అయ్యే రోజు. కేవలం బాబా చాలా స్మృతి వచ్చారు అని పాట పాడడానికి కాదు. బ్రహ్మాబాబా ఫరిస్తాగా అవ్వటం డ్రామాలో పరమాత్మ కార్యం ప్రత్యక్షం చేయడానికి నిమిత్తమయ్యింది. బ్రహ్మాబాబా ఉన్నారా లేదా లేరా? (ఉన్నారు) కనిపించటం లేదు మరి! 

ఎవరైతే వెనుక వచ్చారో వారు చాలా అదృష్టవంతులు! ఎందుకు? ఇప్పుడు సేవ యొక్క తయారైన సాధనాలు లభించే సమయానికి వచ్చారు. 60 సం||లు వారు వెన్న తీసారు మరియు మీరు వెన్న తినే సమయంలో వచ్చారు. ఈ రోజు బ్రహ్మాబాబా యొక్క చరిత్ర విన్నారు కదా! ఆ సమయంలో ఉన్న శ్రమ మీకు ఉంటే మీరు పారిపోయేవారు. వర్తమాన సమయంలో సేవ యొక్క వాయుమండలం తయారై ఉంది. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ నేత అయినా ఎక్కువ మంది ఈ కార్యం మంచిది అని అంగీకరిస్తారు. వారు చేయటం, చేయలేకపోవటం అనేది వేరే విషయం. ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిది కానీ ఈ కార్యం మంచిది మరియు ముందుకు వెళ్ళాలి అని అయితే అంటున్నారు కదా! ఆదిలో బ్రహ్మాకుమారీల ముఖం కూడా చూడకూడదు అనేవారు, ఆదిలో సందేశం ఇవ్వడానికి వెళ్తే తలుపులు మూసేసేవారు. మీరు అయితే మంచి సమయానికి వచ్చారు కదా!సేవ యొక్క అవకాశం చాలా ఉంది.. ఎంత సేవ చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు అందరు అర్థం చేసుకుంటున్నారు - సాకార బ్రహ్మాబాబా తర్వాత కూడా బ్రహ్మాకుమారీలు సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకున్నారు, గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకున్నారు. ఇప్పుడు డైమండ్ వరకు చేరుకున్నారు అని. ఎందుకంటే ఎవరైనా పెద్ద గురువు చనిపోతే అలజడి అయిపోతారు. ఇక్కడ అలజడి అయ్యిందా? ఇక్కడైతే ఇంకా వృద్ధి అయ్యింది. పెరుగుతుంది. దీని ద్వారా ఏమి రుజువు అయ్యిందంటే ఈ కార్యం చేసేవారు పరమాత్మ తండ్రి, నిమిత్త మాధ్యమం బ్రహ్మాబాబా అని. ఇప్పుడు కూడా మాధ్యమం బ్రహ్మాబాబా ఉన్నారు కానీ పాత్ర వేరుగా ఉంది. డ్రామాలో మొదట మాధ్యమంగా సాకార బ్రహ్మ ఉండేవారు కానీ ఇప్పుడు ఫరిస్తా రూపంలో ఉన్నారు. బ్రహ్మని తండ్రి అంటారు, బ్రహ్మ రచయిత కదా! ఈ పాత్ర మధ్యమధ్యలో పిల్లలని పాలన చేయడానికి నిమిత్తంగా ఉంది. బ్రహ్మయే రచయిత మరియు రచన కార్యంలో ఇప్పుడు కూడా మరియు అంతిమం వరకు బ్రహ్మ పాత్రయే ఉంటుంది. 

ఈరోజు రోజంతటిలో ఎవరి దగ్గరికి మాయ వచ్చింది? మనవడు, మనవరాలు ఎవరూ జ్ఞాపకం రాలేదా? సదా ఈవిధంగా సమర్థంగా ఉండండి మరియు దీనికి సహజవిధి - రెండు మాటలు స్మృతి ఉంచుకోండి. రెండు మాటలైతే జ్ఞాపకం ఉంటాయి కదా? మురళీ అంతా మర్చిపోయినా కానీ రెండు మాటలు స్మృతి ఉంచుకోండి మరియు ప్రత్యక్షంలో చేస్తూ వెళ్ళండి. ఆ రెండు విషయాలు మీకు తెలుసు, క్రొత్త విషయాలేమీ కాదు. 1. శుభచింతన. వ్యతిరేకాన్ని కూడా మంచిగా చేసుకోండి, దీనినే శుభచింతన అంటారు. వ్యతిరేకం మంచిగా అవుతుందా మరియు మారుతుందా! పరిశీలించుకోండి - కర్మ చేస్తూ కూడా శుభచింతన నడుస్తుందా? అని 2. అందరిపట్ల శుభచింతకులుగా అవ్వాలి. శుభచింతన మరియు శుభ చింతకులు రెండింటికి సంబంధం ఉంది. శుభచింతన లేకపోతే శుభచింతకులుగా కూడా కాలేరు. కనుక ఈ రెండు విషయాల ధ్యాస ఉంచుకోవాలి. అర్థమైందా? ఏమి చేస్తారు? ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలా సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే ప్రజలు మీరు మాట ద్వారా చెప్తే అర్ధం చేసుకోవటం లేదు కానీ శుభచింతకులుగా అయ్యి శుభమైన తరంగాలు ఇస్తే మారిపోతున్నారు. ఒక విషయంలో ముక్తులుగా కూడా అవ్వాలి. ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తులు అయ్యేవారు కదా! ముక్తి అవ్వడానికి 9 విషయాలు చెప్పాను. ఆ 9 విషయాలతో ముక్తి అయితే నవరత్నాలుగా 
అవుతారు. 

ఈరోజు బాప్ దాదా ఒక విషయం యొక్క స్మృతి ఇప్పిస్తున్నారు - ఎప్పుడైనా శారీరకంగా అనారోగ్యం వచ్చినా, మనస్సులో తుఫాను వచ్చినా, తనువులో అలజడి వచ్చినా, కుటుంబంలో అలజడి వచ్చినా, సేవలో కూడా అలజడి వచ్చినా ఏ రకమైన అలజడిలో కూడా బలహీనం కాకూడదు. విశాల హృదయం కలిగిన వారిగా అవ్వండి. బాబా హృదయం ఎంత ఉంటుంది, చిన్నదా ఏమిటి! బాబా విశాల హృదయుడు మరియు పిల్లలు చిన్న హృదయం గలవారిగా అయిపోతున్నారు. జబ్బు వస్తే ఏడవటం ప్రారంభిస్తున్నారు. జబ్బు వచ్చేసింది, జబ్బు వచ్చేసింది అని బలహీనం అవ్వడం మంచిదా? ఇలా బలహీనం అయితే అనారోగ్యం పోతుందా లేదా పెరుగుతుందా? కర్మల ఖాతా వచ్చింది, అనారోగ్యం వచ్చింది కానీ బలహీనత ద్వారా జబ్బు పెంచుకుంటున్నారు. అందువలన ధైర్యవంతులుగా అవ్వండి. బాబా కూడా సహాయకారి అవుతారు. ఏడుస్తూ - అయ్యో ఏమి చేయము, ఏమి చేయము అని అంటున్నారు మరియు మరల బాబా సహాయం చేయటం లేదు అంటున్నారు. ఇలా అనకండి. ఎవరైతే ధైర్యం పెట్టుకుంటారో వారికే సహాయం లభిస్తుంది. మొదట పిల్లల ధైర్యం తర్వాత బాబా సహాయం లభిస్తుంది. ధైర్యంలో ఓడిపోతున్నారు, మరలా బాబా సహాయం లభించడం లేదు అని ఆలోచిస్తున్నారు. బాబా కూడా సమయానికి చేయడం లేదు అంటున్నారు. కేవలం సగం పదాన్నే స్మృతి చేయకండి. బాబా సహాయకారియే కానీ ఎవరికి? సగం వాక్యం మరిచిపోతున్నారు. మహారథీలకే బాబా సహాయం చేస్తారేమో, మాకు చేయటమే లేదు, మాకు ఇవ్వడం లేదు అని సగమే జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. కానీ బాబాకి మొదట మీరు, ఆ తర్వాత మహారథీలు. మనస్సుని బలహీనం చేసుకోవద్దు. మనస్సులో ఏదైనా అలజడి వస్తుంది కానీ ఆ సమయంలో కూడా నిర్ణయశక్తి కావాలి. మీ మనస్సు బాబా వైపు ఉన్నప్పుడే ఆ నిర్ణయశక్తి కూడా వస్తుంది. ఆ అలజడితోనే ఉంటే అవునా - కాదా? అవునా - కాదా? అని అలజడిలోనే ఉండిపోతారు. అందువలన మనస్సుతో కూడా బలహీనులుగా అవ్వద్దు. అలాగే ధనంలో కూడా లోటుపాట్లు వస్తాయి. కోటీశ్వరులకే అలా జరుగుతున్నప్పుడు వారి ముందు మీరు ఎంత? అది అయితే జరగవలసిందే. కానీ మీకైతే పక్కా నిశ్చయం ఉంది కదా! బాబా మాకు తోడు అని సత్యంగా ఉంటే ఎటువంటి పరిస్థితులోనైనా బాప్ దాదా పప్పు, రొట్టె తప్పక పెడతారు. రెండు, రెండు కూరలు పెట్టరు. కానీ పప్పు, రొట్టె పెడతారు. అలాగని పనితో అలసిపోయి బాబా పప్పు, రొట్టె పెడతారని కూర్చోకండి. ఇలా సోమరితనం, బద్దకం ఉన్నవారికి లభించదు. సత్యమైన మనస్సుకే బాబా రాజీ అవుతారు. అలాగే కుటుంబంలో కూడా గొడవలు వస్తాయి. అతి తర్వాత అంతం అవుతుందని మీరు చెప్తారు కదా! అలాగే సమయం అతిలోకి వెళ్తుంది. వెళ్ళాలి కూడా. అటువంటి సమయంలో కుటుంబంలో గొడవలు లేకుండా ఉండవు, గొడవలు వస్తాయి. కానీ మీరు నిమిత్తులుగా అయ్యి సాక్షిగా అయ్యి పరిస్థితిని బాబా యొక్క శక్తితో పరిష్కరించండి. గృహస్తీగా అయ్యి ఆలోచిస్తే ఇంకా అలజడి అవుతుంది. అందువలన మొదట పూర్తిగా అతీతంగా, నిమిత్తంగా అయిపోండి. నాది అనే భావన ఉండకూడదు. ఈ నాది అనేది అంటే నా పేరు పాడైపోతుంది, నన్ను నిందిస్తారు, నా పిల్లలని మరియు నన్ను...... నా అత్తగారు నన్ను ఇలా చేస్తుంది..... ఇలా నాది అనే భావం వస్తే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అనేది ఎక్కడ వస్తుందో అక్కడ బుద్ధికి వలయం అయిపోతుంది. మారిపోతుంది. ఎక్కడైనా కానీ బుద్ది అలజడిలో మారిపోయింది అంటే నాది అనే భావం ఉన్నట్లు భావించండి. దానిని పరిశీలించుకోండి, ఎంతగా పరిష్కరించాలనుకుంటే అంతగా అలజడి చేస్తుంది. అందువలన అన్ని విషయాలలో ఏవిధంగా అవ్వకూడదు? బలహీనులుగా అవ్వకూడదు. ఏవిధంగా అవ్వకూడదు? (బలహీనులుగా కాకూడదు) కేవలం చెప్పటం కాదు, చేయాలి. భగవంతుని పిల్లలు ఇది అయితే పక్కా ప్రతిజ్ఞ కదా! దీనిని మాయ కూడా చలింపచేయలేదు. ఇది పక్కా ప్రతిజ్ఞ. నిశ్చయం అయినా కానీ భగవంతుని పిల్లలు కూడా బలహీనం అయిపోతుంటే ఇక విశాల హృదయం పెట్టుకునే వారు ఎవరు అవుతారు? ఇంకెవరైనా అవుతారా? మీరే కదా! కనుక ఏమి చేస్తారు? ఇప్పుడు సమర్థంగా అవ్వండి మరియు తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలం అనే పాఠం పక్కా చేసుకోండి. కచ్చాగా ఉండటం కాదు, పక్కా చేసుకోండి. అందరు ధైర్యవంతులే కదా? ధైర్యం ఉందా? డైమండ్ జూబ్లీ గురించి సంతోషంగా ఉంది కదా? బాప్ దాదా సమాచారం వింటూనే ఉంటారు. మొదట ఢిల్లీలో ప్రారంభించారు. బాగా చేసారు. రాజధానిలో మీ పాదం పెట్టి జమ చేసుకున్నారు. ఇప్పుడు అందరు చేస్తున్నారు. కానీ స్మృతి ఉంచుకోవాలి. బాప్ దాదా ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో ప్రతి జోన్ కి ఏదోక పని ఇచ్చారు. యువకులకి పని ఇచ్చారు, కుమారీలకు పని ఇచ్చారు, కుటుంబం వారికి పని ఇచ్చారు ఆ పని చేయడం మర్చిపోకూడదు. బాప్ దాదా దగ్గరికి ఏదోకటి, చిన్న నెక్లెస్ తయారుచేసి తీసుకురండి, కంకణం తయారుచేసి తీసుకురండి, పెద్దహారం తయారుచేసి తీసుకురండి కానీ ఏదోకటి తప్పనిసరిగా తీసుకురావాలి. ఖాళీ చేతులతో రాకూడదు. ధైర్యం ఉంది కదా? తయారుచేస్తారు కదా? బాప్ దాదా అయితే కంకణమే తీసుకురండి అంటారు, ఎందుకంటే చాలా ఆత్మలు లోపల అలజడితో చాలా దు:ఖీగా ఉన్నారు, వారిలో ముందుకి వెళ్ళే ధైర్యం లేదు. మాస్టర్ సర్వశక్తివంతులైన అయిన మీరు వారికి ధైర్యం ఇస్తే వచ్చేస్తారు. ఎవరికైనా కాళ్ళు లేకపోతే కర్రకాళ్ళు తయారుచేసి ఇస్తే వాటి ఆధారంతో నడుస్తారు కదా! అలాగే మీరు ధైర్యం అనే కాళ్ళు ఇవ్వండి, కర్రవి కాదు. ధైర్యం అనే కాళ్ళు ఇవ్వండి. చాలా దు:ఖీగా ఉన్నారు, దయాహృదయులుగా అవ్వండి. బాప్ దాదా అజ్ఞాని పిల్లలని కూడా చూస్తారు కదా - లోపల ఏమి పరిస్థితి ఉంది అని. బయటికి షోగా చాలా టిప్ టాప్ గా ఉన్నారు కానీ లోపల చాలా చాలా దు:ఖం ఉంది. మీరు చాలా మంచి సమయానికి పిల్లలు అయ్యారు అంటే రక్షించబడ్డారు. మంచిది. 

నలువైపుల ఉన్న సర్వ సమర్ధ ఆత్మలకు, సర్వమాయాజీత్, ప్రకృతి జీత్ ఆత్మలకి, సదా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా మనస్సుతో సంతోషంగా ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments