22-11-1987 అవ్యక్త మురళి

                       22-11-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘సహాయ సాగరుని నుండి పదమాలరెట్ల సహాయము తీసుకునే విధి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ ధైర్యశాలి పిల్లలను చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటివరకు ప్రతి బ్రాహ్మణాత్మ ధైర్యం యొక్క ఆధారంతో బాప్ దాదా సహాయానికి పాత్రులుగా అయ్యారు మరియు ‘పిల్లలు ధైర్యమును ఉంచితే, తండ్రి సహాయము చేస్తారు’ అనే వరదానం ప్రమాణంగా పురుషార్థంలో నంబరువారుగా ముందుకు వెళ్తున్నారు. పిల్లల వైపు నుండి ధైర్యము యొక్క ఒక్క అడుగు మరియు తండ్రి వైపు నుండి పదమాల అడుగుల సహాయమనేది పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఇది బాప్ దాదా యొక్క ప్రతిజ్ఞ అనండి, వారసత్వమనండి, పిల్లలందరి కోసము ఉంది, మరియు ఈ శ్రేష్ఠమైన సహజ ప్రాప్తి కారణంగానే 63 జన్మల నిర్బల ఆత్మలు శక్తిశాలిగా అయి ముందుకు వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ముందుగా ఏ ధైర్యాన్ని ధారణ చేశారు? మొదటి ధైర్యము - అసంభవాన్ని సంభవం చేసి చూపించారు, పవిత్రతా విశేషతను ధారణ చేశారు. మేము పవిత్రంగా అవ్వాల్సిందేనని ధైర్యంతో దృఢ సంకల్పం చేశారు మరియు, ఆత్మలైన మీరు అనాది ఆదిలో పవిత్రంగా ఉండేవారు, అనేకసార్లు పవిత్రంగా అయ్యారు మరియు అవుతూ ఉంటారని చెప్పి తండ్రి పదమాలరెట్ల సహాయమునిచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్ల శ్రేష్ఠ స్థితిని కేవలం మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పవిత్ర ఆత్మలైన మీ యొక్క భక్తులు మీ జడచిత్రాల ముందు పవిత్రతా శక్తిని కోరుకుంటూ ఉంటారు, మీ పవిత్రత యొక్క పాటలను పాడుతూ ఉంటారు. అలాగే మీ పవిత్రతకు గుర్తుగా ప్రతి పూజ్య ఆత్మపైన ప్రకాశ కిరీటముంది. ఈ విధంగా, స్మృతి ద్వారా సమర్థులుగా చేశారు అనగా తండ్రి సహాయం ద్వారా మీరు నిర్బల ఆత్మల నుండి శక్తిశాలిగా అయ్యారు. ఎంత శక్తిశాలిగా అయ్యారంటే, మేము విశ్వాన్ని పావనంగా చేసే చూపిస్తాము అని విశ్వాన్ని ఛాలెంజ్ చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు. నిర్బలుల నుండి ఎంత శక్తిశాలిగా అయ్యారంటే, ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవం అని ద్వాపర యుగం యొక్క ప్రసిద్ధమైన ఋషులు, మునులు, మహాన్ ఆత్మలు ఏ విషయాన్ని అయితే ఖండిస్తూ వచ్చారో మరియు నేటి సమయ ప్రమాణంగా స్వయానికి కూడా కఠినమని భావిస్తారో, ఆ పవిత్రతను, ఇదైతే ఆత్మ యొక్క అనాది, ఆది నిజ స్వరూపము, ఇందులో కష్టమేముంది అని మీరు వారి ఎదురుగా సహజ రూపంలో వర్ణన చేస్తారు. దీనినే పిల్లల ధైర్యమును ఉంచితే, తండ్రి సహాయము చేస్తారు అని అంటారు. అసంభవం అన్నది సహజమని అనుభవమయింది మరియు అవుతూ ఉంది. వారు ఎంతగా అసంభవమని అంటారో, మీరు అంతగా అత్యంత సహజమని అంటారు. కనుక తండ్రి జ్ఞాన శక్తి యొక్క సహాయం మరియు స్మృతి ద్వారా ఆత్మలకు తమ పావన స్థితిని అనుభూతి చేసే శక్తి యొక్క సహాయాన్ని అందించి పరివర్తన చేశారు. ఇదే మొదటి అడుగు వేసే ధైర్యానికి తండ్రి చేసిన పదమాలరెట్ల సహాయం.

ఇదే విధంగా మాయాజీతులుగా అయ్యేందుకు, మాయ ఆది నుండి ఇప్పటి వరకు ఎన్నో రూపాలలో దాడి చేసేందుకు వస్తూనే ఉంటుంది, ఒక్కోసారి రాయల్ రూపంలో వస్తుంది, ఒక్కోసారి ప్రసిద్ధి చెందిన రూపంలో వస్తుంది, ఒక్కోసారి గుప్త రూపంలో వస్తుంది మరియు ఒక్కోసారి ఆర్టిఫిషియల్ (కృత్రిమమైన) ఈశ్వరీయ రూపంలో కూడా వస్తుంది. 63 జన్మలు మాయకు సాథీలుగా (సహచరులు) ఉన్నారు. ఇలాంటి పక్కా సాథీలను వదలుకోవడం కూడా కష్టమవుతుంది కనుక రకరకాల రూపాలలో దాడి చేసేందుకు మాయ కూడా బంధింపబడి ఉంది, మరియు మీరు ఇక్కడ దృఢంగా ఉన్నారు. ఇంతగా దాడి జరుగుతున్నా సరే, ధైర్యం కల పిల్లలు ఎవరైతే తండ్రి నుండి పదమాలరెట్ల సహాయానికి పాత్రులుగా ఉన్నారో, వారు సహాయం కారణంగా మాయ చేసే దాడిని, నీ పని రావడం, మా పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం అని ఛాలెంజ్ చేస్తారు. దాడిని ఆటగా భావిస్తారు, మాయ యొక్క సింహం వంటి రూపాన్ని చీమగా భావిస్తారు ఎందుకంటే ఇప్పుడీ మాయా రాజ్యం సమాప్తమవ్వనున్నదని మరియు అనేకసార్లు విజయీ ఆత్మలుగా అయిన మా విజయము 100 శాతం నిశ్చితమని మీకు తెలుసు. అందుకే, ఈ ‘నిశ్చితము’ అనే నషా తండ్రి నుండి పదమాలరెట్ల సహాయం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. కావున ఎక్కడైతే ధైర్యమును ఉంచే పిల్లలకు సర్వశక్తివంతుడైన తండ్రి సహాయము చేస్తారో, అక్కడ అసంభవాన్ని సంభవం చేయడం మరియు మాయను, విశ్వాన్ని ఛాలెంజ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇలా భావిస్తున్నారు కదా?

ఆది నుండి ఇప్పటివరకు పిల్లలు ప్రతి ఒక్కరు ధైర్యం ఆధారంగా సహాయానికి పాత్రులుగా అయి ఎంతవరకు సహజ పురుషార్థాన్ని చేస్తూ ముందుకు వెళ్ళారు, ఎంతవరకు చేరుకున్నారు అనే రిజల్టును బాప్ దాదా చూస్తున్నారు. మరి ఏమి చూశారు? తండ్రి సహాయము అనగా దాత ఇచ్చే దానము, వరదాత ఇచ్చే వరదానాలు సాగర సమానంగా ఉన్నాయి. కానీ సాగరం నుండి తీసుకునే పిల్లల్లో కొంతమంది సాగర సమానంగా నిండుగా అయి ఇతరులను కూడా అలా తయారుచేస్తున్నారు, మరికొంతమంది పిల్లలు సహాయం యొక్క విధి గురించి తెలియక సహాయాన్ని తీసుకునేందుకు బదులుగా తమ శ్రమతోనే అప్పుడప్పుడు తీవ్ర గతి, అప్పుడప్పుడు నిరాశ చెందే ఆటలో కింద-మీద అవుతూ ఉంటారు. మరికొంతమంది పిల్లలు, అప్పుడప్పుడు సహాయం తీసుకుంటారు, అప్పుడప్పుడు శ్రమ చేస్తారు. చాలా సమయపు సహాయం కూడా ఉంది కానీ అక్కడక్కడ నిర్లక్ష్యం కారణంగా సహాయం యొక్క విధిని సమయానికి మర్చిపోతారు మరియు ధైర్యమునుంచేందుకు బదులుగా నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చేస్తారు - మేమైతే సదా పవిత్రంగానే ఉన్నాము, బాబా మాకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తారు, బాబా బంధింపబడి ఉన్నారు అని. ఈ అభిమానం కారణంగా ధైర్యంతో సహాయాన్ని తీసుకునే విధిని మర్చిపోతారు. నిర్లక్ష్యంతో కూడిన అభిమానము మరియు స్వయానికి అటెన్షన్ ఇచ్చుకునే అభిమానము సహాయం నుండి వంచితులుగా చేస్తుంది. ఇప్పుడైతే చాలా యోగం చేసేసాము, జ్ఞానీ ఆత్మలుగా కూడా అయ్యాము, యోగీ ఆత్మలుగా కూడా అయ్యాము, చాలా పేరుగాంచిన సేవాధారులుగా కూడా అయ్యాము, సెంటర్ ఇంఛార్జ్ లుగా కూడా అయ్యాము, సేవా రాజధాని కూడా తయారయింది, ప్రకృతి కూడా సేవా యోగ్యంగా అయింది, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాము అని అనుకుంటారు. ఇది అటెన్షన్ పెట్టడంలో నిర్లక్ష్యము. అందుకే, ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు చదువుకోవాలి మరియు సంపూర్ణంగా అవ్వడం పట్ల అటెన్షన్ పెట్టాలి, అనంతమైన వైరాగ్య వృత్తి పట్ల అటెన్షన్ పెట్టాలి అన్నదానిని మర్చిపోతారు. బ్రహ్మాబాబాను చూశారు - అంతిమ సంపూర్ణ కర్మాతీత స్థితి వరకు స్వయం పట్ల, సేవ పట్ల, అనంతమైన వైరాగ్య వృత్తి పట్ల, విద్యార్థి జీవితం వలె అటెన్షన్ ఇచ్చి నిమిత్తంగా అయి చూపించారు, అందుకే ఆది నుండి అంతిమం వరకు ధైర్యంగా ఉంటూ, ధైర్యాన్ని ఇవ్వడంలో నిమిత్తులయ్యారు. అందుకే తండ్రి సహాయానికి నంబరువన్ పాత్రునిగా అయి నంబరువన్ ప్రాప్తిని అందుకున్నారు. భవిష్యత్తు నిశ్చితమై ఉన్నా కానీ నిర్లక్ష్యంగా లేరు. సదా తమ తీవ్ర పురుషార్థం యొక్క అనుభవాలను చివరి వరకు పిల్లలకు వినిపిస్తూ ఉన్నారు. సహాయ సాగరంలో ఎలా ఇమిడిపోయారంటే, ఇప్పటికీ కూడా తండ్రి సమానంగా పిల్లలు ప్రతి ఒక్కరికీ అవ్యక్త రూపంతో కూడా సహాయం చేసేవారిగా ఉన్నారు. దీనినే, ఒక అడుగు ధైర్యము మరియు పదమాలరెట్ల సహాయానికి పాత్రులుగా అవ్వడము అని అంటారు.

మరి చాలామంది పిల్లలు సహాయానికి పాత్రులుగా ఉన్నా కానీ సహాయం నుండి వంచితులుగా ఎందుకు అవుతున్నారు అన్నది బాప్ దాదా చూస్తున్నారు. దీనికి కారణము ఏమని వినిపించారంటే - ధైర్యం యొక్క విధిని మర్చిపోయినందుకు, అభిమానం అనగా నిర్లక్ష్యము మరియు స్వయం పట్ల అటెన్షన్ లో లోపము. విధి లేకపోతే వరదానాల నుండి వంచితులైపోతారు. సాగరుని పిల్లలుగా అయినప్పటికీ చిన్న చిన్న చెరువులుగా అయిపోతారు. ఎలాగైతే చెరువులోని నీరు నిలిచి ఉంటుందో, అలా పురుషార్థం మధ్యలో నిలిచిపోతుంది. అందుకే, ఒక్కోసారి శ్రమిస్తూ ఉంటారు, ఒక్కోసారి ఆనందంగా ఉంటారు. ఈ రోజు చూస్తే చాలా ఆనందంగా ఉంటారు, రేపు చిన్న ఆటంకం (రాయి) కారణంగా దానిని తొలగించే శ్రమలో మునిగి ఉంటారు. పర్వతం కూడా కాదు, చిన్న రాయి. అసలైతే మహావీర పాండవ సైన్యము, కానీ చిన్న రాయి కూడా పర్వతంలా అయిపోతుంది. ఆ శ్రమలోనే మునిగిపోతారు. ఇంకా, చాలా నవ్విస్తారు. ఒకవేళ ఎవరైనా వారితో, ఇది చాలా చిన్న రాయి కదా అని అంటే, అప్పుడు వారు నవ్వు వచ్చే ఏ మాట అంటారు? మీకేమి తెలుసు, మీ ఎదురుగా వస్తే, అప్పుడు తెలుస్తుంది అని అంటారు. బాబాతో కూడా, మీరు ఎలాగా నిరాకారుడే, మీకైనా ఏమి తెలుసు అని అంటారు. బ్రహ్మాబాబాతో కూడా, మీకైతే బాబా యొక్క లిఫ్ట్ ఉంది, మీకేమి తెలుసు అని అంటారు. చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతారు. కానీ దీనికి కారణము, చిన్న పొరపాటు. ‘పిల్లలు ధైర్యమును ఉంచితే, తండ్రి సహాయము చేస్తారు’ అనే రహస్యాన్ని మర్చిపోతారు. ఇది డ్రామాలో కర్మల యొక్క గుహ్యగతి. ‘పిల్లలు ధైర్యమును ఉంచితే, తండ్రి సహాయము చేస్తారు’ - ఒకవేళ ఈ విధి యొక్క విధానము (నియమము) లేకపోతే అందరూ విశ్వానికి మొదటి రాజుగా అయిపోతారు. అందరూ ఒకే సమయంలో సింహాసనంపై కూర్చుంటారా ఏమిటి? నంబరువారుగా అయ్యే నియమము ఈ విధి కారణంగానే తయారవుతుంది. లేదంటే అందరూ తండ్రితో, బ్రహ్మానే ఎందుకు నంబరువన్ గా చేశారు, మమ్మల్ని కూడా చేయవచ్చు కదా అని ఫిర్యాదు చేస్తారు. అందుకే, ఈ ఈశ్వరీయ నియమము డ్రామానుసారంగా తయారై ఉంది. ఒక అడుగు ధైర్యము మరియు పదమాల అడుగుల సహాయము అనే ఈ నియమము నిమిత్తమాత్రంగా నిశ్చితమై ఉంది. సహాయ సాగరుడైనా సరే ఈ విధి యొక్క నియమము డ్రామానుసారంగా నిశ్చితమై ఉంది. కనుక ఎంత కావాలంటే, అంత ధైర్యమునుంచండి మరియు సహాయాన్ని తీసుకోండి. ఇందులో తక్కువ చేయరు. ఒక సంవత్సరం పిల్లలైనా గాని, 50 సంవత్సరాల పిల్లలైనా గాని, సరెండర్ అయిన వారైనా గాని, ప్రవృత్తిలో ఉండేవారైనా గాని - అందరికీ సమానమైన అధికారం ఉంది. కానీ విధితోనే ప్రాప్తి ఉంటుంది. మరి ఈశ్వరీయ నియమము అర్థమయింది కదా?

ధైర్యమునైతే చాలా బాగా ఉంచారు. ఇక్కడి వరకు చేరుకునేందుకు కూడా ధైర్యాన్ని ఉంచుతారు కావుననే చేరుకుంటారు కదా. బాబాకు చెందినవారిగా అయ్యారంటే కూడా ధైర్యాన్ని ఉంచారు కావుననే అయ్యారు. సదా ధైర్యమునుంచే విధితో సహాయానికి పాత్రులుగా అయి నడుచుకోవడం మరియు అప్పుడప్పుడు విధితో సిద్ధిని ప్రాప్తి చేసుకోవడం - ఇందులో తేడా వచ్చేస్తుంది. సదా ప్రతి అడుగులో ధైర్యంతో సహాయానికి పాత్రులుగా అయి నంబరువన్ గా అయ్యే లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోండి. నంబరువన్ గా అయితే ఒక్క బ్రహ్మానే అవుతారు కానీ ఫస్ట్ డివిజన్లో అయితే ఇంకా ఉంటారు కదా, కనుక నంబరువన్ అని అంటారు. అర్థమయిందా? ఫస్ట్ డివిజన్లోకి అయితే రాగలరు కదా? దీనినే నంబరువన్ లోకి రావడమని అంటారు. మరెప్పుడైనా పిల్లల నిర్లక్ష్యం యొక్క లీలలను వినిపిస్తాము. చాలా మంచి లీలలను చేస్తారు. బాప్ దాదా అయితే సదా పిల్లల లీలలను చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థం యొక్క లీలలను చూస్తారు, అప్పుడప్పుడు నిర్లక్ష్యం యొక్క లీలలను కూడా చూస్తారు. అచ్ఛా.

కర్ణాటక వారి విశేషత ఏమిటి? ప్రతి జోనుకు వారి వారి విశేషత ఉంటుంది. కర్ణాటక వారిది చాలా మంచి భాష - భావన యొక్క భాషలో తెలివైనవారు. హిందీ భాష అయితే తక్కువ అర్థమవుతుంది కానీ కర్ణాటక వారి విశేషత ఏమిటంటే, వారు భావన యొక్క భాషలో నంబరువన్, అందుకే భావన యొక్క ఫలం సదా లభిస్తుంది. ఇంకేమీ మాట్లాడరు కానీ, సదా బాబా, బాబా అని అంటూ ఉంటారు. ఈ భావన యొక్క శ్రేష్ఠ భాష వారికి తెలుసు. భావన యొక్క భూమి కదా. అచ్ఛా.

నలువైపుల యొక్క ధైర్యము కల పిల్లలకు, సదా తండ్రి సహాయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పాత్రులైన ఆత్మలకు, సదా విధానాన్ని తెలుసుకుని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా సమానంగా చివరి వరకు చదువు మరియు పురుషార్థం యొక్క విధిలో నడుచుకునే శ్రేష్ఠమైన, మహాన్, బాబా సమానమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా మిలనము

1. స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాలుగా అనుభవం చేస్తున్నారా? డబల్ లైట్ స్థితి అనగా ఫరిస్తా స్థితి. ఫరిస్తా అనగా లైట్. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత మొత్తం భారాన్ని అంతా తండ్రికి ఇచ్చేశారు కదా? భారం తేలికైపోయింది కనుక ఫరిస్తాలుగా అయిపోయారు. తండ్రి వచ్చిందే భారాన్ని సమాప్తం చేసేందుకు. మరి తండ్రి భారాన్ని సమాప్తం చేసేవారు అన్నప్పుడు మీరందరూ భారాన్ని సమాప్తం చేసుకున్నారు కదా? ఏదైనా చిన్న మూటను దాచిపెట్టి ఉంచుకోలేదు కదా? అంతా ఇచ్చేశారా లేదా సమయానికని కొద్ది కొద్దిగా ఉంచుకున్నారా? పాత సంస్కారాలు కొద్ది కొద్దిగా ఉన్నాయా లేక అవి కూడా సమాప్తమయ్యాయా? పాత స్వభావము మరియు పాత సంస్కారాలు, ఇవి కూడా ఖజానాయే కదా. ఇవి కూడా ఇచ్చేశారా? ఒకవేళ కొద్దిగా ఉన్నాసరే అవి పై నుండి కిందకు తీసుకొస్తాయి, ఫరిస్తాలుగా అయి ఎగిరేకళను అనుభవం చేయనివ్వవు. ఒక్కోసారి ఉన్నతంగా ఉంటారు, ఒక్కోసారి కిందకు వచ్చేస్తారు, అందుకే బాప్ దాదా అంతా ఇచ్చేయండి అని అంటారు. ఇది రావణుని ఆస్తి కదా. రావణుని ఆస్తిని మీ వద్ద ఉంచుకున్నట్లయితే దుఃఖాన్నే పొందుతారు. ఫరిస్తా అనగా కొద్దిగా కూడా రావణుని ఆస్తి ఉండకూడదు. పాత స్వభావము మరియు సంస్కారాలు వస్తాయి కదా? ‘మేము కావాలనుకోలేదు కాని జరిగిపోయింది, అలా చేసేశాము’ లేదా ‘అలా జరిగిపోతుంది’ అని అంటారు కదా. కావున ఇంకా ఒక చిన్న పాత మూటను మీ వద్ద ఉంచుకున్నారని దీని ద్వారా ఋజువవుతుంది. అది మురికి, చెత్తతో కూడిన మూట. సదాకాలానికి ఫరిస్తాగా అవ్వడం - ఇదే బ్రాహ్మణ జీవితం. గతం సమాప్తమైపోయింది. పాత ఖాతాను భస్మం చేసేశారు. ఇప్పుడిక కొత్త విషయాలు, కొత్త ఖాతా. ఒకవేళ కొద్దిగానైనా పాత అప్పు మిగిలి ఉంటే, సదా మాయ యొక్క వ్యాధి అంటుకుని ఉంటుంది ఎందుకంటే అప్పును వ్యాధి అని అంటారు, కనుక మొత్తం ఖాతానంతా సమాప్తం చేయండి. కొత్త జీవితం లభించింది కనుక పాతదంతా సమాప్తం.

2. సదా ‘వాహ్ వాహ్’ పాటలను పాడేవారు కదా? ‘అయ్యో అయ్యో’ అనే పాటలు సమాప్తమైపోయాయి మరియు ‘వాహ్ వాహ్’ అనే పాటలను సదా మనసుతో పాడుతూ ఉంటారు. ఏదైనా శ్రేష్ఠ కర్మను చేసినప్పుడు మనసు నుండి ఏమి వెలువడుతుంది? వాహ్ నా శ్రేష్ఠ కర్మ! లేదా వాహ్ శ్రేష్ఠ కర్మను నేర్పించేవారు! లేదా వాహ్ శ్రేష్ఠ సమయము, శ్రేష్ఠ కర్మను చేయించేవారు! కనుక సదా ‘వాహ్ వాహ్’ యొక్క పాటలను పాడే ఆత్మలు కదా? ఎప్పుడైనా పొరపాటునైనా ‘అయ్యో’ అని వెలువడదు కదా? అయ్యో, ఏంటి ఇలా అయ్యింది - అని అనకూడదు. ఏదైనా దుఃఖంతో కూడిన దృశ్యాన్ని చూసినా ‘అయ్యో’ అనే శబ్దము వెలువడకూడదు. నిన్న ‘అయ్యో అయ్యో’ అనే పాటలను పాడారు మరియు ఈ రోజు ‘వాహ్ వాహ్’ అనే పాటలను పాడుతున్నారు. అంత తేడా వచ్చింది. ఇది ఎవరి శక్తి? తండ్రిదా లేక డ్రామాదా? (తండ్రిది). తండ్రి కూడా డ్రామా కారణంగానే వచ్చారు కదా. కనుక డ్రామా కూడా శక్తిశాలి అయినట్లు. ఒకవేళ డ్రామాలో పాత్రనే లేకపోతే తండ్రి కూడా ఏమి చేస్తారు. తండ్రి కూడా శక్తిశాలి అయినవారు మరియు డ్రామా కూడా శక్తిశాలి అయినది. కనుక ఇరువురి పాటలను పాడుతూ ఉండండి - వాహ్ డ్రామా వాహ్! ఏదైతే స్వప్నంలో కూడా లేదో, అది సాకారమయింది. ఇంట్లో కూర్చునే అంతా లభించింది. ఇంట్లో కూర్చునే ఇంత భాగ్యం లభిస్తే, దీనినే డైమండ్ లాటరీ అని అంటారు.

3. సంగమయుగీ స్వరాజ్య అధికారి ఆత్మలుగా అయ్యారా? ప్రతి కర్మేంద్రియంపై మీ రాజ్యం ఉందా? ఏ కర్మేంద్రియము మోసం చేయడం లేదు కదా? ఎప్పుడూ సంకల్పంలో కూడా ఓటమి కలగడం లేదు కదా? ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయా? ‘మేము స్వరాజ్య అధికారి ఆత్మలము’ - ఈ నషా మరియు నిశ్చయంతో సదా శక్తిశాలిగా అయి మాయాజీతుల నుండి జగత్ జీతులుగా అయిపోతారు. స్వరాజ్య అధికారి ఆత్మలు సహజ యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వగలరు. స్వరాజ్య అధికారిని అనే నషా మరియు నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉండండి. మాతలు నష్టోమోహులుగా ఉన్నారా లేక మోహం ఉందా? పాండవులకు ఎప్పుడైనా క్రోధం యొక్క అంశమాత్రం ఆవేశమైనా వస్తుందా? ఎప్పుడైనా ఎవరైనా కొద్దిగా కింద-మీద చేస్తే క్రోధం వస్తుందా? కొద్దిగా సేవా ఛాన్స్ తక్కువ లభించినా, ఇతరులకు ఎక్కువ లభించినా వీరేమి చేస్తున్నారు అని అక్కయ్య పైన కొద్దిగా ఆవేశం వస్తుందా? చూసుకోండి, పేపరు వస్తుంది ఎందుకంటే కొద్దిగా దేహాభిమానం వచ్చినా సరే అందులో ఆవేశం లేక క్రోధం సహజంగా వచ్చేస్తుంది. అందుకే, సదా స్వరాజ్య అధికారి అనగా సదా నిరహంకారి, సదా నిర్మానులుగా అయి సేవాధారిగా అయ్యేవారు. మోహ బంధనం కూడా సమాప్తం. అచ్ఛా.

Comments