06-11-1987 అవ్యక్త మురళి

   06-11-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“నిరంతర సేవాధారిగా అయ్యేందుకు సాధనము - నాలుగురకాల సేవలు”

ఈ రోజు విశ్వకళ్యాణకారీ, విశ్వసేవాధారీ అయిన తండ్రి తన విశ్వ సేవాధారీ, సహయోగులైన పిల్లలందరినీ, తన పిల్లలు ప్రతి ఒక్కరు నిరంతర సహజయోగిగా అవ్వడముతో పాటుగా నిరంతర సేవాధారిగా ఎంతవరకు అయ్యారు అనేది చూస్తున్నారు. ఎందుకంటే స్మృతి మరియు సేవ - ఈ రెండింటి బ్యాలెన్స్, సదా బ్రాహ్మణ జీవితంలో బాప్ దాదా నుండి మరియు సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల నుండి ఆశీర్వాదాలు పొందేందుకు పాత్రులుగా చేస్తుంది. ఈ సంగమయుగములోనే, ఈ బ్రాహ్మణ జీవితములో పరమాత్మ ఆశీర్వాదాలు మరియు బ్రాహ్మణ పరివార ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అందుకే, ఈ చిన్న జీవితములో సర్వ ప్రాప్తులు మరియు సదాకాలికమైన ప్రాప్తులు సహజముగా ప్రాప్తిస్తాయి. ఈ సంగమయుగాన్ని విశేషంగా బ్లెస్సింగ్ యుగము (ఆశీర్వాదాల యుగమని) అని అనవచ్చు, అందుకే ఈ యుగాన్ని మహాన్ యుగమని అంటారు. స్వయంగా తండ్రియే ప్రతి శ్రేష్ఠ కర్మ మరియు ప్రతి శ్రేష్ఠ సంకల్పము ఆధారముగా, బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికీ ప్రతి సమయము మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణ జీవితము పరమాత్మ ఆశీర్వాదాల పాలనతో వృద్ధిని ప్రాప్తి చేసుకునే జీవితము. భోళానాథుడైన తండ్రి సర్వ ఆశీర్వాదాల జోలెలను విశాలమైన హృదయముతో పిల్లలకు ఇస్తున్నారు. కానీ ఈ సర్వ ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఆధారము - స్మృతి మరియు సేవల బ్యాలెన్స్. ఒకవేళ నిరంతర యోగులుగా ఉన్నట్లయితే, నిరంతర సేవాధారులుగా కూడా ఉన్నట్లు. సేవ యొక్క మహత్వము నిరంతరం బుద్ధిలో ఉంటుందా?

చాలామంది పిల్లలు సేవా ఛాన్స్ లభించినప్పుడు లేదా ఏవైనా సాధనాలు లేక సమయము లభించినప్పుడే సేవ చేద్దామని భావిస్తారు. కానీ, ఎలాగైతే బాప్ దాదా స్మృతిని, నిరంతరంగా మరియు సహజంగా అనుభవం చేయిస్తారో, అలా సేవను కూడా నిరంతరంగా మరియు సహజంగా చెయ్యవచ్చు. ఈ రోజు బాప్ దాదా సేవాధారి పిల్లల సేవా చార్టును చూస్తున్నారు. ఎంతవరకైతే నిరంతర సేవాధారులుగా అవ్వరో, అంతవరకు సదా ఆశీర్వాదాల యొక్క అనుభవీలుగా అవ్వలేరు. సమయమనుసారముగా, సేవా ఛాన్స్ అనుసారముగా, ప్రోగ్రాం అనుసారముగా సేవ చేస్తారు, ఆ సమయములో సేవకు ఫలస్వరూపంగా తండ్రి నుండి మరియు పరివారము నుండి ఆశీర్వాదాలను మరియు సఫలతను ప్రాప్తి చేసుకుంటారు, కానీ సదాకాలానికి ప్రాప్తి చేసుకోలేరు, అందుకే, అప్పుడప్పుడు ఆశీర్వాదాల కారణంగా స్వయములో మరియు సేవలో సహజంగా ఉన్నతిని అనుభవం చేస్తారు, అప్పుడప్పుడు శ్రమ చేసిన తర్వాత సఫలతను అనుభవం చేస్తారు, ఎందుకంటే నిరంతరం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ లేదు. నిరంతర సేవాధారులుగా ఎలా అవ్వగలరు, ఈ రోజు ఈ సేవ యొక్క మహత్వాన్ని వినిపిస్తున్నారు.

మొత్తం రోజంతటిలో రకరకాలుగా సేవ చేయగలరు. ఇందులో ఒకటి - స్వ సేవ అనగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు స్వయం పట్ల సదా అటెన్షన్ పెట్టడము. మీ ఈ చదువులో ఉన్న ముఖ్యమైన సబ్జెక్టులన్నింటిలోనూ స్వయాన్ని పాస్ విత్ ఆనర్ గా చేసుకోవాలి. ఇందులో జ్ఞాన స్వరూపము, స్మృతి స్వరూపము, ధారణా స్వరూపము - అన్నింటిలోనూ సంపన్నంగా అవ్వాలి. ఈ స్వ సేవ సదా బుద్ధిలో ఉండాలి. ఈ స్వ సేవ స్వతహాగానే మీ సంపన్న స్వరూపము ద్వారా సేవ చేయిస్తూ ఉంటుంది, కానీ దీనికి విధి - అటెన్షన్ మరియు చెకింగ్. స్వయం యొక్క చెకింగ్ చేసుకోవాలి, ఇతరులను కాదు. రెండవది - విశ్వ సేవ. ఈ సేవను రకరకాల సాధనాలతో, రకరకాల విధులతో, వాణితో మరియు సంబంధ-సంపర్కముతో చేస్తారు. ఇవన్నీ మీకు బాగా తెలుసు. మూడవది - యజ్ఞ సేవ. ఈ సేవను మీరు తనువు మరియు ధనము ద్వారా చేస్తూన్నారు.

నాల్గవది - మనసా సేవ. మీ శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానములో ఉంటున్నా కానీ, అనేక ఆత్మల సేవను చెయ్యవచ్చు. దీనికి విధి - లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వడము. లైట్ హౌస్ ఒకే స్థానములో స్థితియై దూరదూరాల వరకు సేవ చేస్తుంది. అలాగే మీరందరూ ఒకే స్థానములో ఉంటూ, అనేకుల సేవార్థము నిమిత్తులుగా అవ్వగలరు. అంతగా శక్తుల ఖజానా జమ అయి ఉంటే, సహజంగా చేయగలరు. ఇందులో స్థూలమైన సాధనాలు లేక ఛాన్స్ లేక సమయము యొక్క సమస్యలేవీ ఉండవు. కేవలం లైట్, మైట్ తో సంపన్నంగా అయ్యే అవసరముంది. సదా మనసు, బుద్ధి వ్యర్థం ఆలోచించడము నుండి ముక్తి అయి ఉండాలి, ‘మన్మనాభవ’ మంత్రము యొక్క సహజ స్వరూపముగా ఉండాలి. ఈ నాలుగు రకాల సేవలు నిరంతర సేవాధారులుగా చెయ్యలేవా? ఈ నాలుగు రకాల సేవలలోనూ, ప్రతి సమయము ఏదో ఒక సేవను చేస్తూ ఉన్నట్లయితే, సహజముగా నిరంతర సేవాధారులుగా అయిపోతారు, అంతేకాక నిరంతరం సేవలలో ఉపస్థితులై ఉన్న కారణంగా, సదా బిజీగా ఉన్న కారణంగా, సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. నాలుగు రకాల సేవలలోనూ ఏ సమయములో ఏ సేవను చేయగలరో, అది చేయండి కానీ ఒక్క సెకండు కూడా సేవ నుండి వంచితులుగా ఉండకండి. 24 గంటలు సేవాధారులుగా ఉండాలి. 8 గంటల యోగులుగా లేక సేవాధారులుగా కాదు, నిరంతర సేవాధారులుగా అవ్వండి. సులభమే కదా? ఏ సేవ లేకుంటే స్వ సేవ కూడా మంచిదే. ఏ సమయములో ఏ అవకాశము లభిస్తే, ఆ సేవను చేయవచ్చు.

చాలామంది పిల్లలు శరీరము కారణంగా లేక సమయము లభించని కారణంగా, మేమైతే సేవ చేయలేము అని భావిస్తారు. కానీ ఒకవేళ ఈ నాలుగు రకాల సేవలలోనూ, ఏదో ఒక సేవలో విధి పూర్వకంగా బిజీగా ఉన్నట్లయితే, సేవా సబ్జెక్టులో మార్కులు జమ అవుతూ ఉంటాయి, అంతేకాక ఈ మార్కులు ఫైనల్ రిజల్టులో జమ అవుతాయి. ఎలాగైతే వాణి ద్వారా సేవ చేసేవారికి మార్కులు జమ అవుతాయో, అలా యజ్ఞ సేవ మరియు స్వ సేవ మరియు మనసా సేవ - వీటికి కూడా అంతే మహత్వముంటుంది. వీటికి కూడా ఇన్ని మార్కులు జమ అవుతాయి. ప్రతి సేవకు ఇన్ని మార్కులే ఉంటాయి. అయితే, ఎవరైతే నాలుగు రకాల సేవలను చేస్తారో, వారికి అన్ని మార్కులు జమ అవుతాయి. ఎవరైతే ఒకటి లేక రెండు రకాల సేవలను చేస్తారో, వారికి దాని అనుసారముగా మార్కులు జమ అవుతాయి. అయినా, ఒకవేళ నాలుగు రకాల సేవలను చేయలేకపోతే, రెండు రకాల సేవలనే చేయగలిగితే, అప్పుడు కూడా నిరంతర సేవాధారులుగానే ఉంటారు. కనుక నిరంతర సేవ కారణంగా మార్కులు పెరుగుతాయి. అందుకే, బ్రాహ్మణ జీవితము అనగా నిరంతర సేవాధారి, సహజయోగి.

ఎలాగైతే స్మృతి నిరంతరము ఉండాలని, స్మృతి లింకు సదా జోడింపబడి ఉండాలని అటెన్షన్ పెడతారో, అలా సేవలో కూడా సదా లింకు జోడింపబడి ఉండాలి. ఎలాగైతే స్మృతిలో కూడా భిన్న భిన్న స్థితులను అనుభవం చేస్తారు - ఒక్కోసారి బీజ రూపాన్ని, ఒక్కోసారి ఫరిస్తా రూపాన్ని, ఒక్కోసారి మననం చేయడాన్ని, ఒక్కోసారి ఆత్మిక సంభాషణ చేయడాన్ని అనుభవం చేస్తారు, అప్పుడు స్థితులు వేరు వేరుగా ఉన్నా కానీ స్మృతి యొక్క సబ్జెక్టులో, నిరంతర స్మృతి కిందే లెక్కిస్తారు, అలా భిన్న భిన్న రూపాల సేవ కూడా ఉండాలి. అంతేకానీ, సేవ లేకుండా జీవితం ఉండకూడదు. శ్వాస శ్వాసలోనూ స్మృతి ఉండాలి, శ్వాస శ్వాసలోనూ సేవ ఉండాలి - దీనినే బ్యాలెన్స్ అని అంటారు. అప్పుడే ప్రతి సమయము, ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే అనుభవాన్ని సదా చేస్తూ ఉంటారు, అంతేకాక సదా హృదయం నుండి శబ్దము వెలువడుతుంది - స్వతహాగానే ఆశీర్వాదాలతో పాలింపబడుతున్నాను, ఆశీర్వాదాలతో ఎగిరేకళ యొక్క అనుభవంతో ఎగురుతున్నాను. శ్రమ నుండి, యుద్ధము నుండి విడుదల అవుతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్నంగా ఉంటారు. సఫలతను సదా జన్మ సిద్ధ అధికారం రూపంలో అనుభవం చేస్తూ ఉంటారు. ఏమవుతుందో తెలియదు, సఫలత లభిస్తుందో లేదో, మేము ముందుకు వెళ్ళగలమో లేదో తెలియదు - ‘ఏమో తెలియదు’ అనే ఈ సంకల్పాలు పరివర్తనవ్వాలి. అప్పుడు మాస్టర్ త్రికాలదర్శి స్థితిని అనుభవం చేస్తారు. ‘విజయం లభించే ఉంది’ అనే నిశ్చయం మరియు నషా సదా అనుభవమవుతుంది. ఇవే ఆశీర్వాదాలకు గుర్తులు. అర్థమయిందా.

బ్రాహ్మణ జీవితములో, మహాన్ యుగములో, బాప్ దాదాకు అధికారులుగా అయి కూడా శ్రమ చేయవలసి వస్తే, సదా యుద్ధ స్థితిలోనే జీవితాన్ని గడిపితే - పిల్లల యొక్క ఈ శ్రమతో కూడిన జీవితాన్ని బాప్ దాదా చూడలేరు. అందుకే, నిరంతర యోగులుగా, నిరంతర సేవాధారులుగా అవ్వండి. అర్థమయిందా. అచ్ఛా.

పాత పిల్లల ఆశ పూర్తయింది కదా. నీటిని సరఫరా చేసే సేవ చేసిన సేవాధారి పిల్లలను శభాష్ అని మెచ్చుకుంటున్నాము. వీరు అనేకమంది పిల్లల ఆశలను పూర్తి చేసేందుకు రాత్రింబవళ్ళు సహయోగం చేసారు. నిద్రా జీతులుగా కూడా అయిపోయారు, ప్రకృతి జీతులుగా కూడా అయిపోయారు. కనుక మధుబన్ సేవాధారులకు, వారు ప్లాన్ తయారు చేసేవారు కావచ్చు, నీరు తెచ్చేవారు కావచ్చు, ప్రశాంతంగా రిసీవ్ చేసుకునేవారు కావచ్చు, నివాస స్థానాన్ని ఏర్పాటు చేసేవారు కావచ్చు, సమయానికి భోజనం తయారు చేసేవారు కావచ్చు, ఎవరెవరైతే భిన్న-భిన్న సేవలకు నిమిత్తులుగా ఉన్నారో, వారందరికీ థాంక్స్ చెప్పండి. బాప్ దాదా అయితే ఎలాగా థాంక్స్ చెప్తున్నారు. ప్రపంచమంతా నీరు-నీరు అని ఆర్తనాదము చేస్తుంది, కానీ బాబా పిల్లలు ఎంత సహజముగా కార్యమును నడిపిస్తున్నారు! బాప్ దాదా సేవాధారి పిల్లలందరి సేవను చూస్తూ ఉంటారు. మధుబన్ నివాసులు నిమిత్తులుగా అయి మీ అందరికీ ఎంత ప్రశాంతంగా అవకాశాన్ని ఇప్పిస్తున్నారు. మీరు కూడా సహయోగులుగా అయ్యారు కదా. ఎలాగైతే వారు సహయోగులుగా అయినందుకు మీకు దాని ఫలము లభిస్తుందో, అలా మీరందరూ కూడా ప్రతి కార్యములో, సమయము అనుసారముగా నడుచుకున్నట్లయితే, మీ సహయోగ ఫలము ఇతర బ్రాహ్మణులకు కూడా లభిస్తూ ఉంటుంది.

బాప్ దాదా చిరునవ్వు నవ్వుతున్నారు - సత్యయుగములో పాల నదులు ప్రవహిస్తాయి కానీ సంగమయుగములో నీరు అనేది నెయ్యిగా అయిపోయింది కదా. నేతి నదులు కుళాయిల నుండి వస్తున్నాయి. నీరు నెయ్యిగా అయిపోయింది కనుక విలువైనదిగా అయిపోయింది కదా. ఈ విధితో అనేకమందికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఎంతైనా, ప్రపంచంలోని వారికి, బ్రాహ్మణులైన మీకు తేడా ఉంది కదా. ఎంతైనా, అనేక స్థానాలలో ఉన్నవారి కంటే మీకు చాలా ప్రశాంతత ఉంది. అంతేకాక, అభ్యాసము కూడా అవుతూ ఉంది. అందుకే, రాజయుక్తులుగా అయి ప్రతి పరిస్థితిలో రాజీగా ఉండే అభ్యాసమును పెంచుకుంటూ వెళ్ళండి. అచ్ఛా.

నిరంతరయోగి, నిరంతర సేవాధారి శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా త్రికాలదర్శులుగా అయి సఫలత యొక్క అధికారాన్ని అనుభవం చేసేవారికి, సదా ప్రసన్నచిత్తులైన, సంతుష్టులైన శ్రేష్ఠ ఆత్మలకు, ప్రతి సెకండు ఆశీర్వాదాలను అనుభవం చేసే పిల్లలకు, విధాత, వరదాత అయిన బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీతో - సంకల్పం చేసారు. అందరికీ ఆ శ్రేష్ఠ సంకల్పం యొక్క ఫలము లభించింది. ఎన్ని ఆశీర్వాదాల మాలలు పడతాయి! ఎవరైతే నిమిత్తముగా అవుతారో, తండ్రితో పాటు వారి గుణగానము కూడా చేస్తారు కదా. అందుకే, తండ్రితో పాటు పిల్లలకు కూడా పూజ జరుగుతుంది. అంతేకానీ, తండ్రి ఒక్కరికే జరగదు. అందరికీ ఎంత సంతోషము కలుగుతూ ఉంది! ఈ ఆశీర్వాదాల మాలలు భక్తి మార్గములో మాలలకు అధికారులుగా చేస్తాయి.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక -

1. శ్రేష్ఠ ఆత్మలైన మీరంతా అందరి దాహమును తీర్చేవారు కదా? అక్కడ స్థూలమైన జలముంది కానీ మీ వద్ద జ్ఞానామృతముంది. జలము అల్పకాలిక దాహాన్ని తీర్చి తృప్త ఆత్మగా చేస్తుంది. మరి మీరు సర్వాత్మలను అమృతం ద్వారా తృప్తపరచేందుకు నిమిత్తులుగా అయ్యారు కదా. ఈ ఉల్లాసము సదా ఉంటుందా? ఎందుకంటే దాహము తీర్చడమనేది మహాన్ పుణ్యము. దాహముతో ఉన్నవారి దాహమును తీర్చేవారిని పుణ్య ఆత్మలని అంటారు. మీరు కూడా మహాన్ పుణ్యాత్ములుగా అయి అందరి దాహమును తీర్చేవారు. ఎలాగైతే దాహముతో ఉన్న మనుష్యులు తపించిపోతారో, ఒకవేళ నీరు లభించకపోతే దాహముతో తపిస్తారు కదా, అలా జ్ఞానామృతము లభించకపోవడంతో ఆత్మలు దుఃఖము, అశాంతులతో తపించిపోతున్నారు. కనుక వారికి జ్ఞానామృతాన్నిచ్చి వారి దాహమును తీర్చే పుణ్యాత్ములు మీరు. మరి మీరు పుణ్య ఖాతాను అనేక జన్మల కోసం జమ చేసుకుంటున్నారు కదా? ఒక్క జన్మలోనే అనేక జన్మల ఖాతా జమ అవుతుంది. మరి మీరు ఇంత జమ చేసుకున్నారు కదా? ఎంత సంపన్నులుగా అయ్యారంటే, ఇతరులకు కూడా పంచగలరు! స్వయం కోసం కూడా జమ చేసుకున్నారు, ఇతరులకు ఇచ్చే దాతలుగా కూడా అయ్యారు. కనుక సదా చెక్ చేసుకోండి - మొత్తం రోజంతటిలో పుణ్యాత్మగా అయ్యానా, పుణ్య కార్యాన్ని చేసానా లేక కేవలం స్వయం కోసమే చేసుకొని తిని, తాగి, మజా చేసుకున్నానా? జమ చేసుకునేవారిని తెలివైనవారని అంటారు. ఎవరైతే సంపాదించుకొని తినేస్తారో, వారిని తెలివైనవారని అనరు. ఎలాగైతే భోజనము తినేందుకు సమయం తీస్తారో, ఎందుకంటే అది అవసరము, అలా ఈ పుణ్య కార్యము చేయడం కూడా అవసరమే. కనుక సదా పుణ్యాత్ములుగా అవ్వండి, అప్పుడప్పుడు కాదు. ఛాన్స్ లభిస్తే చేస్తామని అనుకోకండి. ఛాన్స్ తీసుకోవాలి. సమయమనేది లభించదు, సమయాన్ని తీయాలి, అప్పుడు జమ చేసుకోగలరు. ఈ సమయములో ఎంత కావాలంటే అంత పొడవుగా భాగ్యరేఖను గీసుకోగలరు. ఎందుకంటే బాబా భాగ్య విధాత మరియు వరదాత, తండ్రి శ్రేష్ఠ జ్ఞానమనే కలమును తన పిల్లలకు ఇచ్చేశారు. ఈ కలముతో ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే, అంత పొడవుగా గీసుకోగలరు. అచ్ఛా.

2. అందరూ రాజఋషులు కదా. రాజు అనగా అధికారి, ఋషి అనగా తపస్వీ. తపస్యా బలము సహజంగా పరివర్తన చేయించేందుకు ఆధారము. పరమాత్మ లగనముతో స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కోసం నిర్విఘ్నంగా చేయగలరు. నిర్విఘ్నంగా అవ్వడము మరియు నిర్విఘ్నంగా చేయడము - ఈ సేవనే చేస్తున్నారు కదా. అనేక రకాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను విముక్తులు చేసేవారు. కనుక మీరు తండ్రి నుండి జీవన్ముక్తి వరదానాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేవారు కదా. నిర్బంధనులు అనగా జీవన్ముక్తులు.

3. హిమ్మతే బచ్చే మదదే బాప్ (ధైర్యము చేసే పిల్లలకు తండ్రి సహాయము లభిస్తుంది). పిల్లలు ధైర్యానికి తండ్రి సహాయము సదా పదమాలరెట్లు ప్రాప్తిస్తుంది. భారమైతే తండ్రిపై ఉంది. కావున ట్రస్టీలుగా అయి సదా తండ్రి స్మృతి ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి. తండ్రి స్మృతియే ఛత్రఛాయ. పాత లెక్కాచారము బల్లెం వంటిది కానీ తండ్రి సహాయముతో అది ముల్లుగా అయిపోతుంది. పరిస్థితులు తప్పకుండా రావాల్సిందే ఎందుకంటే అంతా ఇక్కడే తీర్చుకోవాలి. కానీ తండ్రి సహాయము ముల్లుగా చేసేస్తుంది, పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసేస్తుంది ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు. సదా నిశ్చయంతో ముందుకు సాగుతూ వెళ్ళండి. ప్రతి అడుగులో ట్రస్టీగా ఉండాలి. ట్రస్టీ అనగా అంతా నీదే, నాది అనేది సమాప్తము. గృహస్థులు అనగా ‘నాది’. ‘నీది’ గా అయిపోయినట్లయితే పెద్ద విషయము చిన్నదిగా అయిపోతుంది. ‘నాది’ అని అన్నట్లయితే చిన్న విషయము పెద్దదైపోతుంది. ‘తేరాపన్’ (నీది) తేలికగా చేస్తుంది మరియు ‘మేరాపన్’ (నాది) భారీగా చేస్తుంది. కనుక ఎప్పుడైనా భారీతనాన్ని అనుభవం చేస్తే, చెక్ చేసుకోండి - మేరాపన్ అనేది ఎక్కడా లేదు కదా. ‘నాది’ని ‘నీది’ లోకి పరివర్తన చేసినట్లయితే ఆ క్షణమే తేలికైపోతారు. మొత్తం భారమంతా ఒక్క సెకండులో సమాప్తమైపోతుంది. అచ్ఛా.

Comments