18-01-1988 అవ్యక్త మురళి

18-01-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘స్నేహము’ మరియు ‘శక్తి’ యొక్క సమానత

ఈ రోజు, స్మృతి స్వరూపులుగా తయారుచేసే సమర్థుడైన తండ్రి నలువైపులా ఉన్న స్మృతి స్వరూప సమర్థ పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు - బాప్ దాదా స్నేహంలో ఇమిడిపోవడంతో పాటు స్నేహము మరియు సమర్థత - రెండింటి బ్యాలెన్స్ స్థితిని అనుభవం చేసుకునే రోజు. స్మృతి దివసము అనగా స్నేహము మరియు సమర్థత - ఈ రెండింటిలో సమానతను పొందే వరదానీ దివసము, ఎందుకంటే ఏ తండ్రి స్మృతిలోనైతే మీరు స్నేహముతో లవలీనమవుతారో, ఆ బ్రహ్మాబాబా, స్నేహము మరియు శక్తి యొక్క సమానతకు శ్రేష్ఠమైన సింబల్ (గుర్తు). ఇప్పుడిప్పుడే అతి స్నేహీగా, ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ శక్తిశాలిగా ఉండేవారు. స్నేహంలో కూడా, స్నేహం ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరినీ సదా శక్తిశాలిగా తయారుచేశారు. స్నేహంలో కేవలం వారి వైపుకు ఆకర్షించుకోవడం కాదు, కానీ స్నేహం ద్వారా శక్తి సేనను తయారుచేసి విశ్వం ఎదుట సేవార్థం నిమిత్తంగా చేశారు. సదా ‘స్నేహీ భవ’తో పాటుగా ‘నష్టోమోహా కర్మాతీత భవ’ అనే పాఠాన్ని చదివించారు. చివరి వరకు పిల్లలకు ‘సదా అతీతంగా ఉండండి మరియు సదా ప్రియంగా ఉండండి’ - అనే వరదానాన్ని నయనాల దృష్టి ద్వారా ఇచ్చారు.

ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలు భిన్న భిన్న స్వరూపాలతో, భిన్న భిన్న సంబంధాలతో, స్నేహంతో మరియు తండ్రి సమానంగా అవ్వాలనే స్థితి యొక్క అనుభూతితో మిలనం జరుపుకోవడానికి బాప్ దాదాల వతనానికి చేరుకున్నారు. కొందరు బుద్ధి ద్వారా, కొందరు దివ్యదృష్టి ద్వారా చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలందరి స్నేహాన్ని మరియు సమాన స్థితి యొక్క ప్రియస్మృతులను హృదయపూర్వకంగా స్వీకరించారు మరియు రిటర్న్ లో పిల్లలందరికీ ‘బాప్ దాదా సమాన భవ’ అనే వరదానాన్ని ఇచ్చారు మరియు ఇస్తూ ఉన్నారు. పిల్లలకు బ్రహ్మాబాబా అంటే చాలా స్నేహముందని బాప్ దాదాకు తెలుసు. సాకార పాలన తీసుకున్నా లేక ఇప్పుడు అవ్యక్త రూపం ద్వారా పాలన తీసుకుంటున్నా, బ్రహ్మాబాబా పెద్ద తల్లి అయిన కారణంగా తల్లి పట్ల పిల్లలకు స్వతహాగానే ప్రేమ ఉంటుంది. అందుకే బ్రహ్మా తల్లిని చాలా గుర్తు చేసుకుంటారని బాబాకు తెలుసు. కానీ స్నేహానికి ప్రత్యక్ష స్వరూపము - సమానంగా అవ్వడము. పిల్లల మనసుల్లో హృదయపూర్వకమైన, సత్యమైన ప్రేమ ఎంతగా ఉంటుందో, అంతగా ఫాలో ఫాదర్ చేసే ఉల్లాస-ఉత్సాహాలు కనిపిస్తాయి. ఈ అలౌకిక తల్లి చూపించే అలౌకిక ప్రేమ వియోగులుగా చేసేది కాదు, ఇది సహజయోగులుగా, రాజయోగులుగా అనగా రాజులుగా తయారుచేసేది. అలౌకిక తల్లికి పిల్లల పట్ల అలౌకిక మమకారముంది, అదేమిటంటే - నా ప్రతి బడ్డ రాజుగా అవ్వాలి, అందరూ రాజా పిల్లలుగా అవ్వాలి, ప్రజలుగా కాదు. మీరు ప్రజలను తయారు చేసేవారు, ప్రజలుగా అయ్యేవారు కాదు.

ఈ రోజు వతనంలో మాత-పితల (శివబాబా మరియు బ్రహ్మాబాబాల) ఆత్మిక సంభాషణ జరిగింది. పిల్లల స్నేహం యొక్క ఈ విశేషమైన రోజున ఏమి గుర్తుకొస్తుంది అని శివబాబా, బ్రహ్మా తల్లిని అడిగారు. పిల్లలైన మీకు కూడా వారు విశేషంగా గుర్తుకొస్తారు కదా. ప్రతి ఒక్కరికీ స్మృతి కలుగుతుంది మరియు ఆ స్మృతులలో లీనమైపోతారు. ఈ రోజు విశేషంగా అలౌకిక స్మృతులతో కూడిన ప్రపంచం ఉంటుంది. ప్రతి అడుగులోనూ విశేషంగా సాకార స్వరూపం యొక్క చరిత్ర స్వతహాగానే గుర్తుకొస్తుంది. పాలన యొక్క స్మృతి, ప్రాప్తుల స్మృతి, వరదానాల స్మృతి స్వతహాగానే కలుగుతుంది. కనుక బాబా కూడా బ్రహ్మాబాబాను ఇదే అడిగారు. అప్పుడు బ్రహ్మాబాబా ఏమి చెప్పి ఉంటారో తెలుసా? మాత-పితలకు పిల్లలే ప్రపంచము. బ్రహ్మాబాబా అన్నారు - అమృతవేళలో ముందుగా ‘సమాన పిల్లలు’ గుర్తుకొచ్చారు. స్నేహీ పిల్లలు మరియు సమాన పిల్లలు. స్నేహీ పిల్లలకు సమానంగా అవ్వాలనే కోరిక లేక సంకల్పమైతే ఉంది కానీ కోరిక మరియు సంకల్పంతో పాటు సదా సమర్థత ఉండదు, అందుకే సమానంగా అవ్వడంలో నంబరు ముందుకు వెళ్ళేందుకు బదులుగా వెనుక ఉండిపోతుంది. స్నేహమనేది ఉల్లాస-ఉత్సాహాల్లోకి తీసుకొస్తుంది కానీ సమస్యలు, స్నేహము మరియు శక్తి రూపాల సమాన స్థితి తయారవడంలో అక్కడక్కడ బలహీనంగా చేస్తున్నాయి. సమస్యలు సదా సమానంగా అయ్యే స్థితి నుండి దూరం చేస్తున్నాయి. స్నేహమున్న కారణంగా తండ్రిని మర్చిపోలేరు కూడా. ఉండడం కూడా పక్కా బ్రాహ్మణులుగా ఉన్నారు. వెనుకడుగా వేసేవారు కూడా కాదు, అమరులుగా కూడా ఉన్నారు. కేవలం సమస్యను చూసి ఆ సమయానికి కొద్ది సేపు భయపడతారు, అందుకే ‘స్నేహము మరియు శక్తుల’ సమాన స్థితిని నిరంతరం అనుభవం చేయలేరు.

ఇప్పటి సమయమనుసారంగా నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్, సక్సెస్ ఫుల్ స్థితులలో బహుకాలపు అనుభవీలుగా అయ్యారు. మాయ, ప్రకృతి మరియు ఆత్మల ద్వారా నిమిత్తంగా వచ్చే సమస్యల విషయంలో కూడా అనేక సార్లు అనుభవీ ఆత్మలుగా అయ్యారు. ఇవి కొత్త విషయాలేమీ కాదు. మీరు త్రికాలదర్శులు, సమస్యల ఆది, మధ్య, అంతము - ఈ మూడింటి గురించి తెలుసు. అనేక కల్పాల మాట వదిలేయండి కానీ ఈ కల్పంలోని బ్రాహ్మణ జీవితంలో కూడా సమస్యలను బుద్ధి ద్వారా తెలుసుకొని విజయులుగా అవ్వడంలో లేక వాటిని దాటుకొని అనుభవీలుగా అవ్వడంలో మీరు కొత్తవారు కాదు, పాతవారిగా అయ్యారు. ఒక్క సంవత్సరం (జ్ఞానంలో) వారైనా, ఈ అనుభవంలో పాతవారే. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అనే పాఠం కూడా చదివించడం జరిగింది, కనుక వర్తమాన సమయమనుసారంగా ఇప్పుడు సమస్యలకు భయపడడంలో సమయాన్ని పోగొట్టుకోకూడదు. సమయాన్ని పోగొట్టుకుంటే నంబరు వెనుకబడిపోతుంది.

బ్రహ్మా తల్లి అన్నారు - ఒకరేమో విశేషమైన స్నేహీ పిల్లలు, రెండవ వారు - సమానంగా అయ్యేవారు. ఈ రెండు రకాల పిల్లలను చూసి ఇదే సంకల్పం వచ్చింది - వర్తమాన సమయమనుసారంగా మెజారిటీ పిల్లలను ఇప్పుడు సమాన స్థితికి సమీపంగా చూడాలని ఉంది. సమాన స్థితి కలవారు కూడా ఉన్నారు కానీ మెజారిటీ పిల్లలు సమానతకు సమీపంగా చేరుకోవాలి. అమృతవేళ పిల్లలను చూస్తూ-చూస్తూ ఆ సమానంగా అయ్యే రోజు గుర్తుకొస్తూ ఉంది. మీరు ‘స్మృతి దినాన్ని’ గుర్తు చేసుకుంటూ ఉన్నారు, బ్రహ్మా తల్లి ‘సమానంగా అయ్యే రోజును’ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ శ్రేష్ఠ సంకల్పాన్ని పూర్తి చేయడం అనగా స్మృతి దివసాన్ని సమర్థ దివసంగా చేసుకోవడము. స్నేహం యొక్క ఈ ప్రత్యక్ష ఫలాన్నే మాత-పితలు చూడాలనుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన పాలనకు మరియు వరదానాలకు ఇదే శ్రేష్ఠమైన ఫలము. మీరు మాత-పితలకు ప్రత్యక్ష ఫలాన్ని చూపించే శ్రేష్ఠమైన పిల్లలు. స్నేహీలు తమ స్నేహీలలోని లోపాలను చూడలేకపోవడమే అతి స్నేహానికి గుర్తు అని ఇంతకుముందు కూడా వినిపించాము. కావున ఇప్పుడు తీవ్ర వేగంతో సమాన స్థితికి సమీపంగా రండి. ఇదే తల్లి యొక్క స్నేహము. ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేస్తూ ఉండండి. విశేష ఆత్మ అయిన బ్రహ్మ ఒక్కరికే మాత-పిత అనే రెండు పాత్రలు సాకార రూపంలో నిర్ణయించబడ్డాయి కావున ఆ విచిత్ర పాత్రధారి, మహాన్ ఆత్మ యొక్క డబల్ స్వరూపము పిల్లలకు తప్పకుండా గుర్తుకొస్తుంది. కానీ ‘మాత-పిత’ అయిన బ్రహ్మా మనసులో - అందరూ సమానంగా అవ్వాలి అనే శ్రేష్ఠమైన ఆశ ఉంది, దీనిని కూడా గుర్తు చేసుకోండి. అర్థమయిందా? ఈ స్మృతి దివసము యొక్క శ్రేష్ఠ సంకల్పము - ‘సమానంగా అవ్వాల్సిందే’. సంకల్పంలోనైనా, మాటలోనైనా, సంబంధ-సంపర్కంలోనైనా సమానంగా అనగా సమర్థంగా అవ్వాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ‘నథింగ్ న్యూ’ (కొత్తేమీ కాదు) అనే స్మృతితో సమర్థంగా అయిపోతారు. ఇందులో నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యంలో కూడా ‘నథింగ్ న్యూ’ అనే మాటను ఉపయోగిస్తారు. అనేక సార్లు విజయులుగా అవ్వడంలో ‘నథింగ్ న్యూ’ అనే స్మృతి ఉండాలి. ఈ విధితో సదా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ వెళ్ళండి. అచ్ఛా.

అందరూ చాలా ఉల్లాసంతో స్మృతి దివసాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మూడు అడుగుల భూమిని ఇచ్చినవారు కూడా వచ్చారు. మూడు అడుగులు ఇచ్చి మూడు లోకాలకు యజమానులుగా అవుతున్నారంటే, అది ఇవ్వడమెలా అవుతుంది? అయితే, సేవ ద్వారా పుణ్యం జమ చేసుకోవడంలో తెలివైనవారిగా అయ్యారు కనుక ఆ తెలివికి శుభాకాంక్షలు. ఒకటి ఇచ్చి లక్ష పొందే విధిని మీదిగా చేసుకునే సమర్థతను అలవరచుకున్నారు కనుక విశేషంగా స్మృతి దివసమున ఇటువంటి సమర్థ ఆత్మలను పిలిపించాము. బాబా రమణీకమైన చిట్ చాట్ చేస్తున్నారు. విశేషంగా స్థలమిచ్చిన వారిని పిలిపించారు. బాబా కూడా స్థలమిచ్చారు కదా. ఆ లిస్టులో బాబా పేరు కూడా ఉంది కదా. ఏ స్థానమిచ్చారు? అలాంటి స్థానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. బాబా తన ‘హృదయ సింహాసనాన్ని’ ఇచ్చారు. ఇది ఎంత పెద్ద స్థానము! ఈ స్థానాలన్నీ అందులో వచ్చేస్తాయి కదా. దేశ విదేశాలలోని సేవా స్థానాలన్నింటినీ కలిపినా, పెద్ద స్థానం ఏది అవుతుంది? పాత ప్రపంచంలో ఉంటున్నందుకు మీరు ఇటుకలతో నిర్మించిన ఇళ్ళను ఇచ్చారు కానీ బాబా సింహాసనాన్ని ఇచ్చారు. అక్కడ సదా నిశ్చింత చక్రవర్తులుగా అయి కూర్చుంటారు. అయినా చూడండి, ఏ రకమైన సేవ చేసినా, స్థానం ద్వారా సేవ చేసినా, స్థితి ద్వారా సేవ చేసినా, సేవకు స్వతహాగా మహత్వముంటుంది. కనుక స్థానమిచ్చే సేవకు కూడా చాలా మహత్వముంది. ఎవరికైనా ‘హా జి’ అని చెప్తూ సేవ చేసినా మరియు ఎవరితోనైనా ‘ముందు మీరు’ అని అంటూ సేవ చేసినా, దానికి కూడా మహత్వముంది. కేవలం భాషణ చెప్పడం మాత్రమే సేవ కాదు. ఏ విధి ద్వారా సేవ చేసినా - మనసా, వాచా, కర్మణా, పాత్రలు శుభ్రం చేసే సేవకు కూడా మహత్వముంది. భాషణ ఇచ్చేవారు ఎంతటి పదవిని పొందుతారో, అంతగా యోగయుక్తమైన యుక్తియుక్తమైన స్థితిలో స్థితి అయ్యి ‘పాత్రలు శుభ్రం చేసేవారు’ కూడా శ్రేష్ఠ పదవిని పొందగలరు. వారు నోటి ద్వారా చేస్తారు. వీరు స్థితి ద్వారా చేస్తారు. కనుక ప్రతి సమయంలో సేవ చేసే విధికి గల మహత్వాన్ని తెలుసుకొని మహాన్ గా అవ్వండి. ఏ సేవకైనా సరే, ఫలం లభించకపోవడమనేది జరగదు. సత్యమైన మనసుపై ఆ యజమాని రాజీ అవుతారు. దాత, వరదాత రాజీ అయినప్పుడు ఇంకేమి లోటు ఉంటుంది. వరదాత, భాగ్య విధాత, జ్ఞాన దాత అయిన భోళా తండ్రిని రాజీ చేసుకోవడం చాలా సులభము. భగవంతుడు రాజీ అయితే న్యాయాధిపతి అయిన ధర్మరాజు నుండి కూడా రక్షించబడతారు, అంతేకాక మాయ నుండి కూడా రక్షించబడతారు. అచ్ఛా.

నలువైపులా ఉన్న ‘స్నేహము మరియు శక్తుల’ సమాన స్థితిలో స్థితులై ఉండేవారందరికీ, సదా మాత-పితల శ్రేష్ఠమైన ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలకు, సదా ప్రతి విధి ద్వారా సేవ చేసే మహత్వాన్ని తెలుసుకునేవారు, సదా ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేసేవారు, మాత-పితలకు సదా ‘స్నేహము మరియు శక్తి’ ద్వారా సమానంగా అయ్యే ఫలితాన్ని చూపించేవారు, ఇలాంటి స్మృతి స్వరూప, సర్వ సమర్థ పిల్లలకు, సమర్థ దివసమున సమర్థుడైన తండ్రి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

సేవాకేంద్రాల కొరకు మూడు అడుగుల భూమి ఇచ్చిన నిమిత్త సోదరీ-సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక -

విశేష సేవకు గల ప్రత్యక్ష ఫల ప్రాప్తిని చూసి సంతోషం కలుగుతుంది కదా. భవిష్యత్తు అయితే ఎలాగూ జమ అయ్యే ఉంది కానీ వర్తమానం కూడా శ్రేష్ఠంగా అయ్యింది. వర్తమాన సమయంలోని ప్రాప్తి, భవిష్యత్తు కంటే శ్రేష్ఠమైనది. ఎందుకంటే అప్రాప్తి మరియు ప్రాప్తుల అనుభవం గురించిన జ్ఞానం ఈ సమయంలోనే ఉంది. అక్కడ అప్రాప్తి అంటే ఏమిటి అనేది తెలియనే తెలియదు కనుక తేడా తెలియదు. ఇక్కడ తేడా గురించిన అనుభవముంది, అందుకే ఈ సమయంలోని ప్రాప్తి యొక్క అనుభవానికి మహత్వముంది. ఏ సేవకు నిమిత్తమైనా, దానికి ‘త్వరిత దానం మహాపుణ్యం’ అనే మహిమ ఉంది. ఒకవేళ ఎవరైనా ఏ విషయానికైనా నిమిత్తమైతే అనగా వెంటనే దానం చేస్తే, దాని రిటర్న్ లో మహాపుణ్యం అనుభూతి అవుతుంది. అదేమిటి? ఏదైనా సేవకు పుణ్య ఫలితంగా ఎక్స్ ట్రా సంతోషము మరియు శక్తి అనుభూతి అవుతాయి. ఎవరైనా సఫలతా స్వరూపంగా అయి సేవ చేసినప్పుడు, ఆ సమయంలో విశేషంగా సంతోషాన్ని అనుభవం చేస్తారు కదా. ఈ రోజు చాలా బాగా అనుభవమయింది అని వర్ణిస్తారు. ఎందుకు అయింది? తండ్రి పరిచయాన్ని వినిపించి సఫలతను అనుభవం చేస్తారు. ఎవరైనా పరిచయాన్ని విని మేల్కుంటే లేదా పరిచయం లభిస్తూనే పరివర్తన అయితే, వారు పొందిన ప్రాప్తి యొక్క ప్రభావం మీ పై కూడా పడుతుంది. మనసులో సంతోషపు గీతాలు మోగడం ప్రారంభమవుతాయి - ఇదే ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి. కనుక సేవ చేసేవారు అనగా సదా ప్రాప్తి అనే ఫలాన్ని తినేవారు. ఎవరైతే ఫలాన్ని తింటారో, వారు ఎలా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటారు కదా. డాక్టర్లు కూడా ఎవరైనా బలహీనంగా ఉండడం చూస్తే ఏమి చెప్తారు? ఫలాలు తినండి అని చెప్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో శక్తినిచ్చే మిగతా వస్తువులు - వెన్న తిన్నా, నెయ్యి తిన్నా వాటిని జీర్ణించుకోలేరు. ఈ రోజుల్లో శక్తి కోసం ఫలాలు ఇస్తారు. అలా సేవకు కూడా ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. కర్మణా సేవ చేసినా, ఆ సేవలో కూడా సంతోషముంటుంది. ఒకవేళ శుభ్రం చేసే సేవ చేస్తే, ఆ స్థానం శుభ్రతతో మెరిసినప్పుడు, సత్యమైన మనసుతో చేసిన కారణంగా ఆ స్థానం శుభ్రంగా మెరవడం చూసి సంతోషమనిపిస్తుంది కదా.

ఏ సేవకైనా పుణ్య ఫలమనేది స్వతహాగానే ప్రాప్తిస్తుంది. పుణ్య ఫలం జమ కూడా అవుతుంది, అంతేకాక వర్తమానానికి కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా పని చేసినప్పుడు లేక సేవ చేసినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని - చాలా బాగా సేవ చేశారు, అలసిపోకుండా చాలా కష్టపడి సేవ చేశారు అని అంటే, అది విని సంతోషమనిపిస్తుంది కదా. అంటే ఫలం లభించినట్లే కదా. నోటి ద్వారా సేవ చేసినా, చేతుల ద్వారా సేవ చేసినా, సేవ అంటేనే ఫలము. మరి మీరు ఈ సేవకు నిమిత్తంగా అయ్యారు కదా. మహత్వం ఉంచితే మహానతను ప్రాప్తి చేసుకుంటారు. ఇలాగే ఇకముందు కూడా సేవా మహత్వాన్ని తెలుసుకొని సదా ఏదో ఒక సేవలో బిజీగా ఉండండి. అయితే, జిజ్ఞాసువులు ఎవరూ లభించలేదు కనుక ఏమి సేవ చేయను అని అనుకోకూడదు. ప్రదర్శనీలు లేవు, భాషణ ఏమీ జరగలేదు, మరి ఏమి సేవ చేయను అని అనుకోకూడదు. సేవా క్షేత్రము చాలా పెద్దది. మాకు సేవ లభించడం లేదు అని ఎవరూ అనలేరు. వాయుమండలాన్ని తయారుచేసే సేవ ఎంతగా మిగిలి ఉంది! మీరు ప్రకృతిని కూడా పరివర్తన చేసేవారు. మరి ప్రకృతి పరివర్తన ఎలా జరుగుతుంది? భాషణ ఇస్తారా? వృత్తితో వాయుమండలం తయారవుతుంది. వాయుమండలం తయారుచేయడమంటే ప్రకృతి పరివర్తన అవ్వడము. మరి ఈ సేవ ఎంత ఉంది? ఇదంతా అయిపోయిందా? ఇప్పుడైతే ప్రకృతి పరీక్ష తీసుకుంటూ ఉంది. కనుక ప్రతి సెకండు చాలా పెద్ద సేవా క్షేత్రము మిగిలిపోయి ఉంది. మాకు సేవ చేసే ఛాన్స్ లభించదని ఎవ్వరూ అనలేరు. అనారోగ్యంతో ఉన్నా, సేవ చేసే ఛాన్స్ ఉంటుంది. చదువుకోని వారైనా, చదువుకున్న వారైనా, ఎటువంటి ఆత్మకైనా, అందరికీ సేవా సాధనము చాలా ఉంది. కనుక సేవా ఛాన్స్ లభించినప్పుడు... అని కాదు, అది లభించి ఉంది.

ఆల్రౌండ్ సేవాధారులుగా అవ్వాలి. కర్మణా సేవకు కూడా 100 మార్కులున్నాయి. ఒకవేళ వాచా మరియు మనసా బాగానే ఉన్నాయి కానీ కర్మణా వైపు అభిరుచి లేకపోతే 100 మార్కులు పోయినట్లే. ఆల్రౌండ్ సేవాధారి అనగా అన్ని రకాల సేవల ద్వారా ఫుల్ మార్కులు తీసుకునేవారు. అటువంటివారిని ఆల్రౌండ్ సేవాధారులని అంటారు. మరి అలా ఉన్నారా? ప్రారంభంలో పిల్లల భట్టీ జరిగినప్పుడు, కర్మణా పాఠాన్ని ఎంత పక్కా చేయించారు! తోటమాలిగా కూడా చేశారు, చెప్పులు కుట్టేవారిగా కూడా చేశారు, పాత్రలు శుభ్రం చేసేవారిగా కూడా చేశారు, అలాగే భాషణ ఇచ్చేవారిగా కూడా తయారుచేశారు ఎందుకంటే దీని (కర్మణా) మార్కులు కూడా పోగొట్టుకోకూడదని. అక్కడ లౌకిక చదువులో కూడా, ఒకవేళ మీరు ఏదైనా సులువైన సబ్జెక్టులో ఫెయిల్ అయితే, విశేషమైన సబ్జెక్టులో కాదు, మూడు లేక నాల్గవ నంబరు సబ్జెక్టులోనైనా ఒకవేళ ఫెయిల్ అయితే, పాస్ విత్ ఆనర్ అవ్వలేరు. టోటల్ మార్కులైతే తగ్గిపోయాయి కదా. ఇలా అన్ని సబ్జెక్టులను చెక్ చేసుకోండి. అన్ని సబ్జెక్టులలో మార్కులు తీసుకున్నారా? ఎలాగైతే ఇందులో (ఇల్లు ఇవ్వడంలో) నిమిత్తంగా అయ్యారు, ఈ సేవను చేశారు, దీని పుణ్యం లభించింది, మార్కులు లభిస్తాయి. కానీ ఫుల్ మార్కులు తీసుకున్నామా లేదా అని చెక్ చేసుకోండి. ఏదో ఒక కర్మణా సేవ కూడా తప్పకుండా చేయాలి ఎందుకంటే కర్మణా సేవకు కూడా 100 మార్కులున్నాయి. తక్కువేమీ లేవు, ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులున్నాయి. అక్కడైతే డ్రాయింగ్ కు తక్కువ మార్కులుంటాయి, గణితానికి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అన్నీ సబ్జెక్టులు మహత్వం కలిగినవే. కనుక మనసాలో, వాచాలో జమ చేసుకొని, కర్మణాలో చేసుకోకుండా, స్వయాన్ని - నేను చాలా మహావీర ఆత్మను అని అనుకోకండి. అన్నింటిలో మార్కులు తీసుకోవాలి. ఇటువంటివారినే సేవాధారులని అంటారు. కనుక మీరు ఏ గ్రూపు? ఆల్రౌండ్ సేవాధారులా లేక స్థలమిచ్చే సేవాధారులా? ఈ సేవ కూడా బాగా చేశారు, సఫలం చేసుకున్నారు. ఎవరెంత సఫలం చేసుకుంటారో, అంత యజమానులుగా అవుతారు. సమయానికి ముందే సఫలం చేసుకోవడమనేది తెలివిగలవారి గుర్తు. కనుక తెలివైన పని చేశారు. మీరు ధైర్యముంచే పిల్లలు అని బాప్ దాదా కూడా సంతోషిస్తారు. అచ్ఛా.

Comments