11-04-1981 అవ్యక్త మురళి

11-04-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యత శక్తి ద్వారా విశ్వ పరివర్తన.

  ఈరోజు ఇది ఎలాంటి సభ? ఇది విధి - విధాతల సభ, సిద్ది - దాతల సభ. స్వయాన్ని ఇలాంటి విధి-విధాతగా లేక సిద్ధి-దాతగా భావిస్తున్నారా? ఈ సభ విశేషతల గురించి తెలుసా? విధి-విధాతల విశేష శక్తి ఏమిటి? సెకెండులో విధి ద్వారా అందరినీ సిద్ధి స్వరూపులుగా తయారు చేయవచ్చు. ఈ విధి గురించి తెలుసా? అది సత్యత అనగా రియాల్టీ. సత్యతకు గొప్పతనముంది. సత్యతకే గౌరవం ఉంది. ఆ సత్యత అనగా మహానతను(గొప్పతనాన్ని) గురించి స్పష్టంగా తెలుసా! విశేషమైన విధి - సత్యత ఆధారంతో ఉంది. మొదటి పునాది 'స్వయం యొక్క జ్ఞానము' అనగా తమ స్వరూపంలో సత్యతను చూడండి. సత్య స్వరూపం ఏమిటి కానీ మీరు ఏమని
భావించేవారు? మొదటి సత్యము - ఆత్మ స్వరూపము. ఈ సత్యత గురించి తెలుసుకోనంతవరకు మీకు మహానత ఉండేదా? మహాన్ గా ఉండేవారా? లేక మహాన్ గా అయిన వారి పూజారులుగా ఉండేవారా? స్వయాన్ని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా అయ్యారు? మహాన్ ఆత్మగా అయ్యారు. సత్యత అథారిటీతో ఇతరులకు కూడా మనం ఆత్మలము అని చెప్తున్నారు. అదే విధంగా సత్యమైన తండ్రి సత్య పరిచయం లభించడం ద్వారా పరమాత్మ మాకు తండ్రి అని అథారిటీతో చెప్తున్నారు. వారసత్వపు అధికారం యొక్క శక్తితో తండ్రి మావారు, మేము తండ్రి వారిమి అని చెప్తున్నారు. అలాగే తమ రచన గురించి లేక సృష్టి చక్రం సత్య పరిచయాన్ని అథారిటీతో వినిపిస్తారు. ఇప్పుడీ సృష్టి చక్రం సమాప్తమై మరలా రిపీట్ కాబోతుంది. ఇది సంగమ యుగము, కలియుగము కాదు. మొత్తం విశ్వంలోని విద్వాంసులు, పండితులు ఇంకా అనేక ఆత్మలు, శాస్త్రాల అనుసారం ఇది కలియుగం అని విశ్వసిస్తారు. కానీ పంచ పాండవులైన మీరు అనగా కోట్లమందిలో కొద్దిమంది ఆత్మలైన మీరు ఇది కలియుగం కాదు, సంగమ యుగమని ఛాలెంజ్ చేస్తారు. ఏ అథారిటీతో చెప్తున్నారు? సత్యత మహానత కారణంగా చెప్తున్నారు. "రండి, వచ్చి అర్థం చేసుకోండి” అని విశ్వానికి సందేశం ఇస్తున్నారు. నిద్రపోతున్న కుంభకర్ణులను మేల్కొలిపి సమయం వచ్చేసింది అని చెప్తున్నారు. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు ద్వారా సత్యతా శక్తి లభించింది అని అనుభవం చేస్తారు - ఇదే సత్యత.

సత్యానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి సత్ అనగా సత్యం(నిజం), రెండవది సత్ అనగా అవినాశి. బాబా సత్యమే కాక అవినాశి కూడా. అందువలన తండ్రి ద్వారా లభించిన పరిచయమంతా సత్ అనగా సత్యము మరియు అవినాశి. భక్తులు కూడా తండ్రిని సత్యం-శివం-సుందరం అని మహిమ చేస్తారు. సత్యం అని, అవినాశి అని అంగీకరిస్తారు. గాడ్ ఈజ్ ట్రూత్ అని కూడా అంటారు. కావున తండ్రి ద్వారా సత్యమైన అథారిటీ ప్రాప్తించింది. వారసత్వం కూడా లభించింది కదా! సత్యత అథారిటీగా కల్గినవారి మహిమ కూడా విన్నారు. వారి గుర్తులు ఎలా ఉంటాయి? సత్యంగా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తారని సింధీ భాషలో ఒక సూక్తి ఉంది(సచ్ తో బిరో నచ్). సత్యం యొక్క నావ కదులుతుంది కానీ మునిగిపోదు అని మరొక సామెత కూడా ఉంది. మిమ్ములను కదిలించాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా! ఇది అసత్యం, కల్పన(మీ ఊహ) అని అంటారు. కానీ సత్యంగా ఉంటే నాట్యం చేస్తారు కదా. మీరు సత్యతకు ఉన్న మహానత, నశాలో, సదా సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. సంతోషంగా నాట్యం చేస్తూ ఉన్నారు కదా! వారు ఎంతగా కదిలించాలని ప్రయత్నిస్తే అంతగా ఏమవుతుంది? తమ ఊయలను ఊపుట వలన మీరు ఇంకా ఎక్కువగా ఊగుతూ ఉంటారు. మిమ్ములను కదిలించలేరు కానీ ఊయలను ఊపుతారు. మేము బాబాతో పాటుగా ఊగుతున్నాము, మీరు ఇంకా ఊపండి అని వారికి మరింతగా ధన్యవాదాలు చెప్పండి. ఇది కదిలించడం కాదు, ఊపడం. ఇలా అనుభవం చేస్తున్నారా? చలించరు కానీ ఊయలలో ఊగుతారు కదా! సత్యతా శక్తి మొత్తం ప్రకృతిని సతో ప్రధానంగా చేస్తుంది. యుగాన్ని సత్యయుగంగా చేసేస్తుంది. సర్వాత్మలకు సద్గతి కలిగే భాగ్యాన్ని తయారు చేస్తుంది. ప్రతి ఆత్మ తమ సత్యతా శక్తి ద్వారా తమ తమ యథా శక్తి తమ ధర్మంలో తమ సమయానికి గతి తర్వాత సద్గతిలోనే అవతరిస్తుంది. ఎందుకంటే విధి - విధాతల ద్వారా సంగమ యుగం చివర్లో అయినా తండ్రిని స్మృతి చేసే విధిని తెలిపే సందేశం తప్పకుండా లభిస్తుంది. కొందరికి వాచా ద్వారా, కొందరికి చిత్రాల ద్వారా, కొందరికి సమాచారాల(వార్తల) ద్వారా మరి కొంతమందికి మీ అందరి శక్తిశాలీ వైబ్రేషన్ల ద్వారా, కొంతమందికి అంతిమ వినాశన లీల కలిగించే అలజడి ద్వారా, వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ద్వారా లభిస్తుంది. ఈ సైన్సు సాధనాలన్నీ మీ సందేశాన్ని ఇచ్చే కార్యంలో మీకు సహయోగులుగా అవుతాయి.

సంగమ యుగంలోనే ప్రకృతి సహయోగిగా అయ్యే పాత్రను ప్రారంభిస్తుంది. అన్నివైపుల నుండి ప్రకృతిపతికి, మాస్టర్ ప్రకృతి పతులకు ఏర్పాట్లు చేస్తుంది. అన్ని వైపుల నుండి ఆఫరీన్ మరియు ఆఫర్(గౌరవం, అవకాశం) లభిస్తాయి. తర్వాత ఏం చేస్తారు? భక్తిలో గాయనం ఉంది - ప్రతి ప్రకృతి తత్వాన్ని దేవతా రూపంలో చూపించారు. దేవత అనగా ఇచ్చేవారు. కావున అంతిమంలో ఈ ప్రకృతి తత్వాలన్నీ మీ అందరికీ సహయోగాన్ని ఇచ్చే దాతగా అయిపోతాయి. ఈ సముద్రం కూడా మీకు సహయోగము చేస్తుంది. నలువైపులా ఉన్న సామాగ్రిని భారత భూమికి తీసుకు రావడంలో సహయోగం చేస్తుంది. అందువలన సముద్రుడు రత్నాలను నింపి నింపి పళ్లాలలో ఇచ్చాడని అంటారు. అలాగే భూమి కంపించి విలువైన వస్తువులను శ్రేష్ఠ ఆత్మలైన మీ కొరకు ఒకే స్థానం అయిన భారతదేశంలోకి జమ చేయడంలో సహయోగిగా అవుతుంది. ఇంద్ర దేవత అని అంటారు కదా! వర్షం కూడా ఈ భూమిని స్వచ్చంగా చేయుటకు సహయోగాన్ని ఇవ్వడంలో హాజరవుతుంది. ఇంత మొత్తం చెత్తను, మురికిని మీరు శుభ్రం చేయలేరు. ఇందుకు మొత్తం ప్రకృతి నుండి సహకారం లభిస్తుంది. కొంత మురికి గాలి ఎగిరిపోయేలా చేస్తుంది. కొంత వర్షం తీసుకెళ్తుంది. అగ్ని గురించి అయితే మీకు ముందే తెలుసు. కావున అంతిమంలో ఈ తత్వాలన్నీ శ్రేష్ఠ ఆత్మలైన మీకు సహయోగాన్ని ఇచ్చే దేవతలుగా అవుతాయి. ఇది ఆత్మలన్నీ అనుభవం చేస్తాయి. అందువలన భక్తిలో, ఇప్పుడు సహయోగాన్ని ఇచ్చే కర్తవ్యం చేసిన కారణంగా తత్వాలు దేవతలుగా అయ్యాయి. ఆ కర్తవ్యం యొక్క అర్థాన్ని మర్చిపోయి తత్వాలకు మనుష్యుల రూపాన్ని ఇచ్చేస్తారు. ఉదాహరణానికి సూర్యుడు ఒక తత్వం. కానీ మానవ రూపాన్ని ఇచ్చేశారు. కావున విధి - విధాతగా అయ్యి ఏ కార్యం చెయ్యాలో అర్థమయ్యింది కదా! వారిది విధాన సభ, ఇది విధి - విధాతల సభ. అక్కడ సభలో సభ్యులు(మెంబర్లు) ఉంటారు. ఇక్కడ అధికారీ మహాన్ ఆత్మలు ఉంటారు. సత్యత యొక్క మహానత ఎంత గొప్పదో అర్థమయ్యిందా! సత్యత పరశువేదితో సమానము - ఎలాగైతే పరశువేది ఇనుమును కూడా బంగారుగా తయారు చేస్తుందో అలా తమ సత్యతా శక్తి - ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహారాన్ని, వ్యవహారాన్ని అన్నిటినీ సతో ప్రధానంగా తయారు చేసేస్తుంది. తమోగుణం యొక్క నామ రూపాలను సమాప్తం చేసేస్తుంది. సత్యతా శక్తి తమ నామాన్ని, రూపాన్ని, సత్ అనగా అవినాశిగా చేసేస్తుంది. అర్ధకల్పం చైతన్య రూపం, అర్ధకల్పం చిత్రాల రూపంగా చేస్తుంది. అర్ధకల్పం ప్రజలు తమ పేరును మహిమ చేస్తారు. అర్దకల్పం భక్తులు తమ పేరును మహిమ చేస్తారు. తమ మాటలను సత్య వచన రూపంలో మహిమ చెయ్యడం జరుగుతుంది. ఈ రోజుకు కూడా ఒక మాట, సగం మాట పలికినా తమను మహాన్ గా అనుభవం చేస్తారు. తమ సత్యతా శక్తితో తమ దేశం కూడా అవినాశిగా అయిపోతుంది. వేషం కూడా అవినాశిగా అయిపోతుంది. అర్దకల్పం దేవతా రూపంలో ఉంటారు. అర్ధకల్పం దేవతా రూపపు స్మృతి చిహ్నము(విగ్రహ రూపం) నడుస్తుంది. ఇప్పుడు చివరి వరకు కూడా భక్తులు తమ చిత్రాలను వస్త్రాలతో అలంకరిస్తూ ఉంటారు. మీ కర్తవ్యం మరియు చరిత్ర అన్నీ సత్యంగా అయిపోయాయి. మీ కర్తవ్యానికి స్మృతి చిహ్నంగా భాగవతాన్ని తయారు చేశారు. మీ చరిత్రల గురించి అనేక కథలు తయారు చేశారు. ఇవన్నీ సత్యమైపోయాయి. దేని కారణంగా? సత్యతా శక్తి కారణంగా. మీ దినచర్య కూడా సత్యమైపోయింది. భోజనం తినడం, అమృతం త్రాగడం అన్నీ సత్యమైపోయాయి. తమ చిత్రాలను కూడా ఎత్తుకుంటారు, కూర్చోబెడ్తారు, ఊరేగింపులు చేస్తారు, భోగ్ పెడ్తారు(నైవేద్యం), అమృతం పెడ్తారు(తీర్థం), త్రాగుతారు. ప్రతి కర్తవ్యం లేక ప్రతి కర్మకు స్మృతి చిహ్నం తయారయ్యింది. ఇంత శక్తి ఉందని తెలుసా? ఇంత గొప్ప అథారిటీతో అందరినీ ఛాలెంజ్ చేస్తారా లేక సేవ చేస్తారా? క్రొత్త క్రొత్త వారు వచ్చారు కదా! మేము కొద్ది మందే ఉన్నాము అని అనుకోవడం లేదు కదా! కానీ సర్వశక్తివంతుని అథారిటీ మీకు తోడుగా ఉంది. మీరు సత్యతా శక్తి కలిగినవారు. మీరు ఐదుగురు కాదు, విశ్వ రచయిత మీకు తోడుగా ఉన్నారు. ఇదే నశాతో చెప్పండి. అంగీకరిస్తారా? అంగీకరించరా?(ఒప్పుకుంటారా, ఒప్పుకోరా) చెప్పాలా? ఎలా చెప్పాలి?....... ఇలాంటి సంకల్పాలు అయితే రావడం లేదు కదా? ఎక్కడ సత్యత ఉందో, సత్యమైన తండ్రి ఉన్నారో అక్కడ సదా విజయం ఉంటుంది. నిశ్చయం ఆధారంతో అనుభవీ మూర్తులుగా అయ్యి చెప్పినట్లయితే సఫలత సదా మీ వెంటనే ఉంటుంది.

మీరందరూ వచ్చారు కావున బాప్ దాదా కూడా వచ్చారు. మీరు రావలసి ఉంటుంది. కనుక బాప్ దాదా కూడా రావలసి ఉంటుంది. తండ్రి కూడా పరాయి శరీరంలో కూర్చోవలసి వచ్చింది కదా! మీరు రైలులో కూర్చోవలసి ఉంటుంది. తండ్రి పరాయి శరీరంలో కూర్చోవలసి ఉంటుంది. కష్టమనిపిస్తుందా? ఇప్పుడింకా మీ మనవళ్లు - మునిమనవళ్లు అందరూ వస్తారు. భక్తులు కూడా వస్తారు. అప్పుడేం చేస్తారు? భక్తులైతే మిమ్ములను కనీసం కూర్చోనివ్వరు. ఇప్పుడైతే విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. తర్వాత విశ్రాంతి ఇవ్వవలసి వస్తుంది. అయినా మూడడుగుల స్థలం(నేల) అయితే లభించింది కదా! భక్తులైతే నిలబడి, నిలబడే తపస్సు చేస్తారు. తమ చిత్రాలను చూచేందుకు భక్తులు క్యూలో నిల్చుంటారు. కావున మీరు కూడా అనుభవం చెయ్యండి. సీజన్ యొక్క ఫలాన్ని తినడానికి వచ్చారు కదా! క్రొత్త క్రొత్త పిల్లలకు బాప్ దాదా విశేషంగా స్నేహాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే అంతిమంలో వచ్చేవారు కూడా తీవ్రగతిలో ముందుకు వెళ్లారని బాప్ దాదాకు తెలుసు. సదా లగ్నము ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యి విజయీ రత్నాలుగా అవుతారు. లౌకిక రూపంలో కూడా పెద్దవారి కంటే చిన్నవారు పరుగులు తీయడంలో నేర్పరులుగా ఉంటారు. కావున మీరందరూ కూడా రేస్లో(పందెం)లో పరుగులు తీస్తూ నంబర్ వన్లోకి రండి. బాప్ దాదా ఇలాంటి ఉత్సాహ ఉల్లాసాలతో ఉండు పిల్లలకు సదా సహయోగిగా ఉంటారు. మీది యోగము, తండ్రిది సహయోగము. ఈ రెండిటి ద్వారా ఎంత కావాలంటే అంత ముందుకు వెళ్లవచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది. తర్వాత ఈ సమయం కూడా సమాప్తమైపోతుంది.

ఇలా సదా సత్యతా మహానతలో ఉండేవారికి, సర్వాత్మలకు విధి - విధాతలకు, సద్గతిదాతలకు, విశ్వానికి స్వంత సత్యతా శక్తి ద్వారా సతో ప్రధానంగా తయారు చేసేవారికి, బాప్ దాదాకు సదా స్నేహీగా మరియు సహయోగులుగా ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. 

పార్టీలతో :- 1) సదా స్వయాన్ని శక్తిశాలీ ఆత్మగా అనుభవం చేస్తున్నారా? శక్తిశాలి ఆత్మ చేసే ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉంటుంది. ప్రతి సంకల్పంలో సేవ ఇమిడి ఉండాలి. ప్రతి మాటలో తండ్రి స్మృతి ఇమిడి ఉండాలి. ప్రతీ కర్మలో తండ్రి లాంటి చరిత్ర ఇమిడి ఉండాలి. ఇలాంటి శక్తిశాలి ఆత్మగా స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? నోట్లో కూడా తండ్రే, స్మృతిలో కూడా తండ్రే, కర్మలో కూడా తండ్రి చరిత్రే. ఇటువంటివారిని తండ్రి సమాన శక్తిశాలీ ఆత్మలని అంటారు. ఇలా ఉన్నారా? ఒకే శబ్దము “బాబా”. కానీ ఈ ఒక్క శబ్దమే ఇంద్రజాలము చేసే శబ్దము. ఎలాగైతే ఇంద్రజాలము చేసినప్పుడు స్వరూపం పరివర్తన అయిపోతుందో అలా ఒక్క బాబా అనే శబ్ధము సమర్థ స్వరూపంగా తయారు చేస్తుంది, గుణాలు మారిపోతాయి. కర్మలు పరివర్తన అవుతాయి, మాటలు మారిపోతాయి. ఈ ఒక్క శబ్దమే ఇంద్రజాలము చేస్తుంది. కనుక అందరూ ఇంద్రజాలికులుగా అయ్యారు కదా! ఇంద్రజాలం చెయ్యడం వస్తుంది కదా! బాబా అని అంటారు మరియు బాబా వారిగా తయారు చేస్తారు. ఇదే ఇంద్రజాలము. 

2) వరదాన భూమి పైకి వచ్చి వరదాత ద్వారా వరదానాలు పొందే భాగ్యాన్ని తయారు చేసుకున్నారా? భాగ్య విధాత అయిన తండ్రి ద్వారా ఏది కావాలంటే దానిని తమ భాగ్య రేఖలుగా గీసుకోవచ్చు అని గాయనం ఉంది. ఇది ఈ సమయంలోని వరదానమే. కావున వరదాన సమయాన్ని, వరదాన స్థానాన్ని కార్యంలోకి తీసుకొచ్చారా? ఏ వరదానం తీసుకున్నారు? ఎలాగైతే తండ్రి సంపన్నంగా ఉన్నారో, అలా తండ్రి సమానంగా అయ్యే దృఢ సంకల్పం చేశారా? “బాలురు నుండి యజమానులు” (బాలక్ సో మాలిక్) అని పిల్లల కొరకు గాయనం ఉంది. కనుక పిల్లలు తండ్రికి యజమానులు. యజమానిని అని నశాలో ఉండేందుకు తండ్రి సమానంగా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవలసి ఉంటుంది. తండ్రి విశేషత - సర్వ శక్తివంతుడు అనగా వారిలో సర్వ శక్తుల విశేషత ఉంది. కనుక బాలకుల నుండి యజమానులుగా అయ్యే వారిలో కూడా సర్వ శక్తులు ఉంటాయి. ఒక్క శక్తి కూడా తక్కువ కాదు. ఒక్క శక్తి తక్కువైనా శక్తివంతులని అంటారు, సర్వశక్తివంతులని అనరు. కావున మీరు ఎవరో చెప్పండి? సర్వ శక్తివంతులు అనగా ఏది కావాలంటే అది చెయ్యగలరు. ప్రతి కర్మేంద్రియము తమ అధీనంలో ఉండాలి. సంకల్పం చేస్తూనే అది జరిగిపోతుంది. ఎందుకంటే యజమానులు కదా! కావున మీరందరూ స్వరాజ్యాధికారులుగా ఉన్నారు కదా! మొదట స్వరాజ్యం తర్వాత విశ్వ రాజ్యం. ఢిల్లీ రాజధానిలో ఉండేవారు స్వరాజ్యాధికారులుగా ఉన్నారు కదా? దీని కొరకు చాలాకాలపు సంస్కారం కావాలి. ఒకవేళ అంతిమంలో తయారవుతామంటే విశ్వ రాజ్యం కూడా ఎప్పుడు లభిస్తుంది? విశ్వ రాజ్యం ఆది నుండి తీసుకోవాలనుకుంటే ఈ సంస్కారం కూడా ఆదికాలం నుండే ఉండాలి. చాలా సమయం యొక్క రాజ్యం అనగా చాలా సమయం నుండి సంస్కారం ఉండాలి. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ఏదీ పెద్ద విషయం కాదు. ఢిల్లీ నివాసులు ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నారు? మహాయజ్ఞము చేశాము కదా అని ఆలోచిస్తున్నారా? ఉన్నతమయ్యే కళ వైపు వెళ్తున్నారు కదా. ఏదైతే చేశారో దాని కంటే ఇంకా ముందుకు వెళ్లండి. ముందుకు వెళ్తూ వెళ్తూ తమ రాజ్యంగా అయిపోతుంది. ఇప్పుడైతే మరొకరి రాజ్యంలో మీ కార్యం చెయ్యాల్సి వస్తుంది. తర్వాత తమ రాజ్యంగా అయిపోతుంది. ప్రకృతి కూడా మీకు ఆఫర్ చేస్తుంది. ప్రకృతి ఆఫర్ చేసినప్పుడు ఆత్మలు ఏం చేస్తారు? ఆత్మలైతే తలలు వంచుతారు. కనుక ఇప్పుడు మీరేం చేస్తారు? అయినా డ్రామానుసారము ఇంతవరకు చేసినదంతా ధైర్యము, ఉల్లాసంతో కార్యాన్ని సఫలం చేశారు. అందువలన బాప్ దాదా మీ ధైర్యానికి సంతోషపడుతున్నారు. కష్టం చేసినందుకు ఫలము జమ అయిపోయింది. వర్తమానం కూడా తయారయ్యింది, భవిష్యత్తు కూడా తయారయ్యింది.

సేవా బీజం అవినాశి అయినందున కొంచెం ధ్వని అయితే వచ్చింది, ఇంకా వస్తూనే ఉంటుంది. బీజం పడుట వలన అనేకమంది ఆత్మలకు గుప్త రూపంలో సందేశం లభించింది. అందరి అలసట తీరిపోయింది కదా! బాప్ దాదా స్నేహం, సహయోగం సదా లభించడం ద్వారా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఢిల్లీకి కూడా ఈ వరదానం లభించింది. శ్రేష్ఠ కర్మలకు నిమిత్తంగా అయ్యే వరదానం లభించింది. అయినా సేవకు జన్మభూమి కదా! సేవ చరిత్రలో పేరు అయితే ఉంటుంది కదా! అంతేకాక అనేకమందికి సేవ చేసేందుకు సాధనాలు లభిస్తాయి. సేవా భూమిలో ఉండేవారు వరదానులుగా అయ్యారు కదా! చాలా బాగా శ్రమించారు. మంచిది.

Comments