10-12-1979 అవ్యక్త మురళి

10-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పుణ్యాత్మల లక్షణాలు.

                      ఈ రోజు బాప్ దాదా తమ సర్వశ్రేష్ఠ పుణ్యాత్మలను చూస్తున్నారు.

1)పుణ్యాత్మలనగా ప్రతి సంకల్పము, ప్రతి సెకండు పుణ్య ఖాతాను తాము జమ చేసుకుంటూ ఇతర ఆత్మలతో జమ చేయించువారు.
2)పుణ్యాత్మలనగా సదా మహాదానియై ఏదో ఒక ఖజానాను మహాదానము చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకునేవారు.
3)పుణ్యాత్మలనగా సదా వారి కనులలో బాప్ దాదాగారి మూర్తి, ముఖములో బాప్ దాదా వ్యక్తిత్వము, స్మృతిలో తండ్రి సమానమైన సమర్థత, నోటిలో సదా జ్ఞానరత్నాలు అనగా అమూల్యమైన మాటలు, ప్రతి కర్మలో తండ్రి సమానమైన చరిత్ర (స్వభావము), సదా తండ్రి సమానమైన విశ్వకళ్యాణకారి వృత్తి, ప్రతి సెకండు ప్రతి సంకల్పములో కళ్యాణకారి కిరణాలను దయా హృదయముతో నలువైపులా ఉన్న దు:ఖము, అశాంతులనే అంధకారాన్ని దూరము చేయువారు.
4) పుణ్యాత్మలు తమ పుణ్య ఖాతా ద్వారా అనేకమంది పేదవారిని ధనవంతులుగా చేయువారు. జ్ఞాన స్వరూప పుణ్య ఆత్మల ఒక్క పుణ్యంలో కూడా చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే వారు డైరక్టు పరమాత్మ శక్తి ఆధారముతో పుణ్యాత్మలుగా ఉన్నారు. ద్వాపర యుగము నుండి కోరికతో పరోక్షంగా దానపుణ్యాలు చేసిన అల్పకాలిక రాజులను చూసి ఉంటారు లేదా వారిని గురించి విని ఉంటారు. ఆ రాజులలో కూడా రాజ్య సత్తా ఫుల్ శక్తివంతముగా ఉండేది. వారు ఏ ఆజ్ఞ ఇచ్చినా దానినెవ్వరూ మార్చలేరు. ఎవరిని ఎలా కావాలంటే అలా చేసేవారు. సంపన్నముగా చేయాలనుకున్నా, ఉరి తీయాలనుకున్నా రెండిటికీ అధికారాలు ఉండేవి. ఇది పరోక్షంగా (ఇన్ డైరక్టుగా) చేసిన దానపుణ్యాల శక్తి. ఈ శక్తిని ద్వాపర యుగము ప్రారంభములో అప్పటి రాజులు యథార్థ రూపంలో ఉపయోగించేవారు. తర్వాత మెల్లమెల్లగా అదే రాజ్య సత్తా అయ్యథార్థ రూపంలోకి వచ్చేసింది. ఈ కారణంగా చివర్లో ఆ సత్తా పూర్తిగా సమాప్తమైపోయింది. కాని ఎలాగైతే పరోక్ష రాజ్య సత్తాలో కూడా తమ ప్రజలను, పరివారాన్ని అర్ఘకాలానికి సుఖవంతులుగా, శాంతియుతంగా చేసేవారో, అలాగే పుణ్యాత్మలు మరియు మహాదానులకు కూడా డైరక్టు  తండ్రి ద్వారా ప్రకృతిజీతులు, మాయాజీతులుగా అయ్యే విశేషమైన సత్తా లభించింది. కనుక మీరు ఆల్మైటి సత్తా (శక్తి) గలవారు. మీ ఆల్మైటీ సత్తా (శక్తి) ఆధారముతో అనగా పుణ్యఖాతా(రాశి) ఆధారముతో, శుద్ధ సంకల్పాల ఆధారముతో ఏ ఆత్మనైనా మీరు ఎలా కావాలంటే అలా చేయగలరు. మీ సంకల్పములో ఎంత శక్తి ఉందంటే తండ్రితో సంబంధము జోడింపజేసి మాలామాల్(సంపన్నం)గా చేయగలరు. వారి(ఆ రాజుల) ఆజ్ఞ, మీ సంకల్పము. వారు వారి ఆజ్ఞ ఆధారంతో ఏమి కావాలంటే అది చేయగలరు. అలా మీరు ఒక్క సంకల్పము ఆధారముతో ఆత్మలను ఎంత ఉన్నతంగా చేయాలనుకుంటే అంత ఉన్నతంగా చేయగలరు. ఎందుకంటే మీకు డైరక్టు పరమాత్మ అధికారము ప్రాప్తి అయ్యింది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారా? అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎందుకు జరగడం లేదు? అధికారమూ ఉంది, ఆల్మైటీ సత్తా కూడా ఉంది. అయినా దానినెందుకు ఉపయోగించుకోలేకున్నారు? కారణమేమి? ఈ శ్రేష్ఠ సేవ ఇంతవరకు ఎందుకు ప్రారంభము కాలేదు? సంకల్ప శక్తిని దురుపయోగం (మిస యూస్) చేయకండి, ఉపయోగించండి. మొత్తం చరిత్రలో ఎవరైనా తమ సత్తాను యథార్థంగా ఉపయోగించలేదంటే తప్పక దురుపయోగం చేసి ఉంటారు. రాజులు రాజ్యాలను పోగొట్టుకున్నారు. నాయకులు కుర్చీలను పోగొట్టుకున్నారు. డిక్టేటర్లు (మిలిటరీతో రాజ్యాధికారము పొందినవారు) తమ రాజ్య సత్తాను పోగొట్టుకున్నారు, కారణమేమి? తమ యథార్థ కర్తవ్యాన్ని వదిలి భోగ-విలాసాలలో వ్యస్తమై(మగ్నమై) పోయారు. ఏదో ఒక విషయానికి స్వయం అధీనమైపోయారు. అందువలన అధికారం పోగొట్టుకున్నారు., వశీభూతమైపోయారు. అందువలన తమ అధికారాన్ని దురుపయోగం చేశారు, అలాగే తండ్రి ద్వారా పుణ్యాత్మలైన మీకు ప్రతి సెకండు, ప్రతి సంకల్పానికి సత్తా(శక్తి) లభించింది, అథారిటీ లభించింది. అన్ని అధికారాలు లభించాయి. సత్తా విలువను తెలుసుకున్నా దాని అనుసారంగా యథార్థ రీతిలో ఉపయోగించడం లేదు. చిన్న చిన్న విషయాలలో తమ నిర్లక్ష్యమనే విశ్రాంతిలో వ్యర్థంగా ఆలోచించుట, మాట్లాడుటలో దురుపయోగం చేయుట వలన జమ అయిన పుణ్యరాశిని, ప్రాప్తించిన ఈశ్వరీయ సత్తాను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించడం లేదు. లేకుంటే మీరు చేసే ఒక్క సంకల్పమైనా చాలా శక్తిశాలిగా పని చేస్తుంది. శ్రేష్ఠ బ్రాహ్మణుల సంకల్పము ఆత్మల భాగ్యరేఖను గీచే సాధనం. మీ సంకల్పం ఒక స్విచ్ వంటిది. ఆ స్విచ్ ను ఆన్ చేసి ఒక సెకండులో అంధకారాన్ని తొలగించవచ్చు.
5)పుణ్యాత్మల సంకల్పము ఒక ఆత్మిక అయస్కాంతం. అది ఆత్మలను ఆత్మీయత వైపు ఆకర్షిస్తుంది.
6)పుణ్యాత్మల సంకల్పం ఒక లైట్‌హౌస్, అది దారి తెలియక భ్రమించు వారికి సరియైన గమ్యాన్ని చూపిస్తుంది.
7)పుణ్యాత్మల సంకల్పము అతి శీతల స్వరూపం. అది వికారాలనే అగ్నిలో కాలిపోయిన ఆత్మలను శీతలంగా చేస్తుంది.
8)పుణ్యాత్మల సంకల్పం ఒక శ్రేష్ఠమైన శాస్త్రము. అది అనేక బంధనాలతో పరతంత్రులుగా ఉన్న ఆత్మలను స్వతంత్రులుగా చేస్తుంది.
9)పుణ్యాత్మల సంకల్పంలో ఒక విశేషమైన శక్తి ఉంది. ఎలాగైతే మంత్ర తంత్రాల ద్వారా అసంభవాలను సంభవంగా చేస్తారో అలా సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవంగా చెయ్యగలరు. వశీకరణ మహామంత్రము (మన్మనాభవ) ద్వారా వశీభూత ఆత్మలను మిణుగురు పురుగుల వలె ఎగిరించగలరు.
10)ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారులను కూడా సస్యశ్యామలంగా చేస్తున్నారు. పర్వతాలపై (రాళ్లపై) పుష్పాలను పూయిస్తున్నారు. అలాంటప్పుడు పుణ్యాత్మలైన మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరాశావాదులను ఆశావాదులుగా చేయలేరా? ఈవిధంగా ప్రతి సెకండు పుణ్యరాశిని జమ చేసుకోండి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పాన్ని, సెకండును ఉపయోగించండి. ఏ కార్యమైతే ఈ రోజుల్లోని పదమాపతులు (కోటీశ్వర్లు) కూడా చేయలేరో, దానిని మీ సంకల్పమే అనగా ఆత్మను పదమాపతిగా (కోటీశ్వరునిగా) చేస్తుంది. కనుక మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్ఠమైనది. ఈ శక్తిని జమ చేసుకొని ఇతరులతో చేయిస్తారో లేక వ్యర్థంగా పోగొట్టుకుంటారో అది మీ పైననే ఆధారపడి ఉంది. పోగొట్టుకునేవారు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. జమ చేసుకునేవారు సర్వ ప్రాప్తుల ఊయలలో ఊగుతూ ఉంటారు. ఒకసారి సుఖము కలిగించే ఊయలలో, ఒకసారి శాంతినిచ్చే ఊయలలో, ఒకసారి ఆనందము కలిగించే ఊయలలో ఊగుతూ ఉంటారు. పోగొట్టుకున్నవారు ఊయలలో ఊగేవారిని చూచి తమ జోలెను చూసుకుంటూ ఉంటారు. మీరందరూ ఊయలలో ఊగేవారే కదా.

రాజస్థాన్ మరియు యు.పి వారు వచ్చారు. రాజస్థాన్ వారు రాజ్యసత్తా అనగా అధికార శక్తి, ఈశ్వరీయ శక్తి ద్వారా సదా తమ రాజస్థానాన్ని ఎడారి నుండి హర్షితంగా (సస్యశ్యామలంగా) తయారుచేయుటలో, ఎడారిని స్వర్గముగా చేయుటలో, అడవిని పూలతోటగా చేయుటలో చాలా తెలివి గలవారు. రాజస్థాన్లో ముఖ్య కేంద్రముంది. ఎక్కడ ముఖ్య కేంద్రముందో అది అన్నిటిలో ముఖ్యముగా ఉంటుంది కదా, రాజస్థాన్ వారికి గర్వంగా ఉండాలి, నషా ఉండాలి. రాజస్థాన్ నుండి సేవ కొరకు కొత్త కొత్త ప్లాన్లు వెలువడాలి. రాజస్థాన్ వారు ఏదైనా కొత్త పద్ధతిని, కొత్త దానిని కనుగొనాలి. రాజస్థాన్ ధరణిని పరివర్తన చెయ్యాలి. అందుకొరకు పదే పదే శ్రమ అనే నీటిని పోయవలసి వస్తుంది. ఎడతెరపి లేకుండా ఎరువు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా తేలికైన ఎరువు వేశారు. అచ్ఛా రేపు యు. వారి గొప్పతనము గురించి వినిపిస్తాము. ఫారిన్ వారైతే (విదేశీయులైతే) ఇప్పుడు కూడా వెంటనే చేసేవారు. ఆలోచన వస్తూనే చేసేస్తారు. యుపి వారి గొప్పతనము గురించిన మాలను కూడా వర్ణిస్తాము. ఇప్పుడు తయారు చెయ్యండి. మరుసటి రోజు మాలను ధరింపజేస్తాము.

ఈవిధంగా శ్రేష్ఠ సంకల్పాల విధి ద్వారా ఆత్మలకు సద్గతిని చేసేవారు, ఈశ్వరీయ సత్తా ద్వారా ఆత్మలను ప్రతి ఆపద నుండి, దుఃఖము నుండి విడిపించేవారు, సదా పుణ్య రాశిని జమ చేసుకొని ఇతరులకు జమ చేయించేవారు, సదా విశ్వ కళ్యాణము చేయాలనే దృఢ సంకల్పము ధారణ చేయువారు, ఇటువంటి సర్వ శ్రేష్ఠ పుణ్యాత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.

టీచర్లతో - టీచర్లు సదా ఉన్నతమయ్యే కళను అనుభవం చేస్తూ నడుస్తున్నారు కదా? టీచర్ల విశేషత - అనుభవీ మూర్తులుగా అగుట. టీచర్లనగా చెప్పడంతో పాటు అనుభవం చేయించేవారు కనుక వినిపించుటతో పాటు స్వరూపములో అనుభవము చేయించుట - ఇది టీచర్ల విశేషత. వినిపించేవారు లేక ఉపన్యసించేవారు. క్లాసులు చేయించేవారు ద్వాపరము నుండి చాలామంది చాలా ప్రసిద్ధి గాంచినవారున్నారు. కాని ఇక్కడ జ్ఞాన మార్గములో ఎవరు ప్రసిద్ధి చెందుతారు? వినిపించుటతో పాటు అనుభవం చేయించేవారు. టీచర్లు విశేషంగా ఈ సేవపై గమనముంచాలి - నేను ఎక్కడ ఉన్నా సదా అచ్చట వాయుమండలమును మరియు దానితో పాటు బేహద్ వాయుమండలములోని వైబ్రేషన్లను సదా శుద్ధముగా చేయాలి. ఎలాగైతే ఏదైనా హద్దు సుగంధము, వాతావరణాన్ని మార్చివేస్తుందో అలా టీచర్ల గుణధారణ అనే సుగంధము, శక్తుల సుగంధము, వాయుమండలాన్ని మరియు వైబ్రేషన్లను సదా శక్తిశాలిగా చేయాలి. టీచర్లు ఎప్పుడూ వాయుమండలం ఇలా ఉంది, దీని వైబ్రేషన్ల వలన నా పురుషార్థమిలా అయిపోయింది అని అనరాదు. టీచర్లు అనగా పరివర్తన చేయువారు. స్వయం పరివర్తనవుతే చాలదు. ఎవరైతే పరివర్తన చేసేవారిగా ఉంటారో వారు ఎప్పుడూ ఇతరుల ప్రభావానికి లోబడి పరివర్తన కారు. కనుక టీచర్ల విశేషత - వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయాలి, స్వయం శక్తిశాలిగా అయ్యి బలహీనులకు శక్తిని సహయోగంగా ఇవ్వాలి. ఉదాసీనుల(వ్యాకులపడేవారు) ఉమంగ ఉత్సాహాలను పెంచాలి. కనుక మీరు ఇటువంటి టీచర్లు కదా? ఇది టీచర్ల కర్తవ్యము లేక డ్యూటీ. ఇలా స్వయం సంపన్నమవ్వాలి. అప్పుడు ఇతరులను కూడా సంపన్నంగా చేయగలరు. ఒకవేళ ఏదైనా శక్తి తక్కువగా ఉంటే ఇతరులు కూడా అందులోనే బలహీనంగా ఉంటారు. ఎందుకంటే మీరు నిమిత్తంగా ఉన్నారు కదా, టీచర్లు సదా చురుకుగా(అలర్ట్ గా) ఎవరెడీగా ఉండాలి. స్థూలము లేక సూక్ష్మ సోమరితనము నామమాత్రంగా కూడా ఉండరాదు. పురుషార్థములో కూడా సోమరితనము వస్తుంది. స్థూల కర్మలో కూడా సోమరితనము వస్తుంది. పురుషార్థములో వ్యాకులపడితే సోమరితనము వచ్చేస్తుంది - ఏమి చెయ్యాలి? ఇంత మాత్రమే వీలవుతుంది, ఇంతకంటే ఎక్కువ చెయ్యలేను, ధైర్యము లేదు, నడుస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. పురుషార్థములో అలసట కూడా సోమరితనానికి గుర్తు. సోమరులు త్వరగా అలసిపోతారు. ఉత్సాహముండేవారు అలసిపోరు. కనుక టీచర్లనగా పురుషార్థములో స్వయం అలసిపోరు, ఇతరులను అలసిపోనివ్వరు. కనుక ఆలౌండర్‌గానూ ఉండాలి, అలర్ట్ గానూ ఉండాలి. ప్రతి కార్యములో సంపన్నులుగా ఉంటారు. అప్పుడప్పుడు టీచర్లు క్లాసు చేయడం, సెంటర్లో పని చేయడం మా కర్తవ్యము అని అనుకుంటారు. స్థూల సేవ ఇతరుల కార్యమని భావిస్తారు. కాని అలా కాదు. స్థూల కార్యము కూడా సెంటరుకు సంబంధించిన సబ్జక్టే. ఇది కూడా చదువులో ఒక సబ్జక్టే. కనుక దీనిని తేలికగా భావించకండి. కర్మణాలో మార్కులు తగ్గిపోతే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు కాలేరు. బ్యాలన్స్ ఉండాలి. దీనిని సేవగా భావించక పోవడం కూడా తప్పే. ఇంటర్నల్ సేవలో(సెంటర్లో సేవలో) ఇది కూడా ఒక భాగమే. యోగయుక్తముగా ఉండి, ప్రీతితో భోజనం తయారు చేయకుంటే, అన్న(ఆహారము) ప్రభావము మనసుపై ఎలా పడుంది? స్థూల పనులు చేయకుంటే కర్మణా సేవకు మార్కులు ఎలా జమ అవుతాయి? కనుక టీచరు అనగా స్పీకర్ కాదు. క్లాసు చేసేవారు, కోర్సు ఇచ్చేవారు మాత్రమే కాదు, సమయాన్ని బట్టి సబ్జక్టును బట్టి అందులో అభిరుచితో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలి. దీనినే అల్‌రౌండర్ అని అంటారు. ఇలా ఉన్నారా లేక లోపల సేవ చేయువారు వేరే, బయట సేవ చేయువారు వేరే అని అనుకుంటున్నారా? రెండిటికి పరస్పరములో సంబంధముంది.

టీచర్లకు త్యాగము, తపస్సు సదా గుర్తున్నాయి కదా. ఏ వ్యక్తి లేక వైభవాల ఆకర్షణలోకి రారాదు. లేకుంటే అది కూడా కర్మాతీతులగుటలో ఒక బంధనమైపోతుంది. కనుక టీచర్లు స్వయం పురుషార్థములో మీ అంతకు మీరు సంతుష్టంగా ఉన్నారా? ఉన్నతమయ్యే కళ అనుభవమవుతూ ఉందా? అందరితో సంతుష్టంగా (తృప్తిగా) ఉన్నారా? అందరూ మీ పురుషార్థముతో, సేవతో, సాథీలందరితో సంతుష్టంగా ఉన్నారా? అందరి నుండి సర్టిఫికెట్ కావాలి కదా? కనుక అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయా? ఏమనుకుంటున్నారు? మీరు సత్యతతో, సఫాయితో సంతుష్టంగా ఉంటే తండ్రి కూడా సంతుష్టంగా ఉంటారు. ఒకటేమో ఊరకే సంతృప్తిగా ఉన్నానని చెప్పడం, మరొకటి సత్యతతో, సఫాయితో సంతుష్టంగా ఉన్నానని చెప్పడం. సదా సంతుష్టంగా ఉన్నారా? ఇక్కడకు వచ్చారు. ఏదైనా లోపముంటే నిమిత్తంగా ఉన్న వారితో ఇచ్చిపుచ్చుకోండి. ముందు కొరకు ఉన్నతమయ్యే కళను పొందుకునే వెళ్లాలి. లోపాన్ని నింపుకొనుటకు, స్వయాన్ని తేలికగా ఉంచుకొనుటకే వస్తారు. పురుషార్థ వేగములో ఆటంకము కలిగించేందుకు నిమిత్తమయ్యే ఏ చిన్న విషయాన్ని అయినా సమాప్తము చేసుకొని వెళ్లాలి. అచ్ఛా

Comments

Post a Comment