07-03-1981 అవ్యక్త మురళి

07-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శాంతి స్వరూప ఆయస్కాంతమై నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింపజేయండి.

ఈ రోజు అత్యంత పవిత్రమైన బాబా తన పవిత్ర హంసలతో కలుసుకునేందుకు వచ్చారు. ఈ ప్రియమైన భిన్నమైన మిలనాన్ని కేవలం సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీరు మాత్రమే అనుభవం చేయగలరు. అది కూడా ఇప్పుడే అనుభవం చేయగలరు. పిల్లల స్నేహానికి బదులు ఇచ్చుటకు తండ్రి వచ్చారు. పిల్లలు తండ్రి స్నేహానికి బదులును(రెస్పాన్స్) సంఘటిత రూపములో సహయోగాన్నిచ్చి సేవలో చూపారు. బాప్ దాదా స్నేహ రూపీ సంఘటనను చూసి చాలా సంతోషిస్తున్నారు. సంలగ్నముతో ప్రకృతిని, కలియుగ సంప్రదాయ ఆసురీ విఘ్నాలను దాటుకొని నిర్విఘ్నముగా కార్యాన్ని సమాప్తి చేశారు. ఈ సహయోగానికి, సంలగ్నతకు బదులుగా బాప్ దాదా పిల్లలపై శుభాకాంక్షల పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నారు. తండ్రి కార్యం అంటే నా కార్యము అనే లగ్నముతో సఫలత పొందినందుకు అభినందనలు. సంఘటన శక్తితో మొదటి కార్యాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఇప్పుడు స్యాంపుల్ రూపంలో చేశారు. మీ రచన ఇంకా వృద్ధిని పొందుతూ ఇంకా విశాల కార్యానికి నిమిత్తంగా చేస్తుంది. సంఘటిత శక్తి ఎదుట రకరకాల విఘ్నాలు ఎలా సహజంగా సమాప్తమైపోతాయో అనుభవం చేశారు. "సఫలత నా జన్మ సిద్ధ అధికారము" అను శ్రేష్ఠ సంకల్పం అందరికీ ఉంది. ఈ సంకల్పమే కార్యాన్ని సఫలం చేసింది. పిల్లల ధైర్యము, ఉత్సాహము, శ్రమ, ప్రేమను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు.

ఈ సంఘటన విశేషంగా మీకు ఏ పాఠాన్ని నేర్పిందో తెలుసా? ఏ కార్యము జరిగినా అది భవిష్యత్తు కొరకు పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. కనుక మీకు ఏ పాఠాన్ని నేర్పించింది? (సహనం చేసుకోవడం) ఇప్పుడీ పాఠాన్ని ఇంకా బాగా చదవాలి. ఈ కార్యము భవిష్యత్తులో "ఎల్లప్పుడూ డబల్ లైట్ గా ఉంటూ ఎవరెడీగా ఎలా ఉండాలి?” అను పాఠాన్ని ప్రాక్టికల్ గా చదివించింది. ఎవరైతే డబల్ లైట్ గా ఉంటారో వారు స్వయాన్ని ప్రతి విషయంలో సహజంగా సఫలతా మూర్తులుగా చేసుకోగలరు. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి తమను తాము సరళంగా నడిపించుకోగలరు. సదా మనసా మగ్నావస్థలో ఉండగలరు.

ఈ రోజు కేవలం పిల్లల శ్రమకు శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చాము. ఇక ముందు ఇంకా విశాల కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తూ పోండి. బాప్ దాదా మీ కంటే ఎక్కువగా అన్ని కార్యాలు చూశారు. మీరైతే స్థూల సాధనాల వల్ల ఒకసారి చేరుకుంటారు, ఒకసారి చేరుకోలేరు. బాప్  దాదాకు ఏ స్థానాన్ని చేరడానికైనా ఎంత సమయము పడ్తుంది? ఏదైతే మీరు చూడలేదో అది మేము చూశాము. తండ్రి స్నేహమే పాదాలు ఒత్తుతుంది. ముఖ్యముగా ఢిల్లీ వారు నిమిత్తమయ్యారు కాని సర్వ బ్రాహ్మణ ఆత్మల సహయోగంతో జరిగింది. ఏ పిల్లలైతే సేవ మైదానంలో అడుగు పెట్టారో పర్వతం లాంటి సేవలో తమ వ్రేలును ఇచ్చారో ఆ పిల్లలందరికీ బాప్ దాదా స్నేహాన్ని మరియు సదా తోడు అనే ఛత్రఛాయను ఇస్తూ యాద్ ప్యార్ తో వారి పాదాలు ఒత్తుతున్నారు. అలసిపోలేదు కదా! నిమిత్తమగుటలో విదేశీయులు వస్తారు కాని వారు కూడా స్వదేశీయులే. వారు కూడా చాలా మంచి పట్టుదలతో అలసిపోకుండా భారతదేశ కుంభకర్ణులను మేల్కొలడానికి సఫలతా పూర్వకంగా పని చేశారు. అందుకు బాప్ దాదా అందరికీ నంబర్ వన్ అనే బిరుదునిస్తున్నారు. విదేశీయులు విన్నారా? విదేశాలలో కూడా ఇంత పెద్ద కార్యము జరిగే రోజు వస్తుంది. అందరూ సంతోషంగా నాట్యము చేస్తున్నారు.

నేటి ఈ మధుర మిలనం విశేషంగా ఒక స్మృతి చిహ్నంగా అవుతూ ఉంది. ఈ విశాలమైన మేళా అంటే బాప్ దాదాకు కూడా చాలా ప్రియమైనది, ఇష్టం. శ్రమతో, దృఢతతో ఏ పిల్లలైతే చాలా చాలా దూరము నుండి వచ్చారో వారందరికీ బాప్ దాదా విశేషంగా యాద్ ప్యార్ తెలియజేస్తున్నారు. స్నేహము దూరాన్ని కూడా దగ్గరకు తెస్తుంది. కనుక భారతదేశంలో కూడా అందరికంటే దూరంగా ఉండేవారు, స్నేహ బంధనములో, సహయోగమనే లగ్నములో దగ్గరగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. అందువలన భారతదేశంలో కూడా దూరంగా ఉన్న పిల్లలకు బాప్ దాదా విశేషమైన స్నేహాన్ని ఇస్తున్నారు. చాలా అమాయకంగా, చాలా ప్రియంగా ఉన్నారు. అందుకే భోలానాథుడైన తండ్రి యొక్క విశేషమైన స్నేహ దృష్టి ఇటువంటి పిల్లలపై ఉంది. అందరూ మేము ఇంత శ్రేష్ఠమైన పదమా పదమ్ భాగ్యశాలీ పిల్లలమని భావిస్తున్నారు కదా? మంచిది.

ఇప్పుడు రాబోయే సంవత్సరంలో ఏమి చేయాలి? ఇంతవరకు చేసింది చాలా బాగా చేశారు. ఇక ముందు ఏం చేయాలి? వర్తమాన సమయములో విశ్వంలో మెజారిటి ఆత్మలకు అన్నిటికంటే ఎక్కువగా సత్యమైన శాంతి అవసరము. రోజు రోజుకు అశాంతికి అనేక కారణాలు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. స్వయం అశాంతికి గురి కాకపోయినా ఇతరుల అశాంతి వాతావరణం, అశాంతి వైబ్రేషన్లు వారిని కూడా తమ వైపుకు ఆకర్షిస్తాయి. నడకలో, వ్యవహారంలో, ఆహారంలో, కర్మలలో అన్నిటిలో అశాంతి వాతావరణం శాంతి స్థితిలో ఉండనివ్వదు అనగా ఇతరుల అశాంతి ప్రభావం కూడా ఆత్మపై పడుంది. అశాంతితో ఒత్తిడి అనుభవం ఇంకా పెరుగుతుంది. అలాంటి సమయంలో శాంతి సాగరుని పిల్లలైన మీ సేవ ఏమిటి? ఎక్కడైనా అగ్గి అంటుకుంటే శీతల జలముతో అగ్నిని ఆర్పి వేడి వాతావరణాన్ని శీతలంగా తయారు చేస్తారు. అలా ఇప్పుడు మీ అందరి విశేష స్వరూపం “మాస్టర్ శాంతిసాగరుని రూపం” ఎమర్జ్ కావాలి. మనసా సంకల్పాల ద్వారా, శాంతి స్వరూప స్థితి ద్వారా నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింపజేయండి. పూర్తి విశ్వంలో ఒక మూలలో ఉన్న కొంతమంది ఆత్మలే శాంతిని దానం చేసే మాస్టర్ శాంతిసాగరులని, అశాంతి ఆత్మలు అనుభవం చేసే శక్తిశాలి స్వరూపాన్ని తయారు చేయండి. నలువైపులా అంధకారం వ్యాపించి ఒక మూల నుండి ప్రకాశం వ్యాపిస్తున్నప్పుడు అందరి అటెన్షన్ స్వతహాగా ప్రకాశం వైపుకు వెళ్తుందో అలా నలువైపులా అశాంతి అలుముకొని ఉంటే ఇక్కడ నుండి శాంతి ప్రాప్తి అవుతూ ఉందని ఆకర్షణ కలగాలి. మీరు శాంతి స్వరూప ఆయస్కాంతాలుగా తయారుకండి. దూరము నుండే అశాంతి ఆత్మలను మీరు లాగగలగాలి. నయనాల ద్వారా శాంతి వరదానము ఇవ్వండి, నోటి ద్వారా శాంతి స్వరూప స్మృతిని ఇప్పించండి. సంకల్పాల ద్వారా అశాంతి సంకల్పాలను దూరం చేసి శాంతి తరంగాలను వ్యాపింపజేయండి. ఈ విశేష కార్యము కొరకు స్మృతి అనే విశేష విధితో సిద్ధిని ప్రాప్తి చేసుకోండి.

ఈ సంవత్సరంలో విశేషంగా ఏ భక్తులైతే "శాంతిదేవా” అంటూ మీ మహిమను చేస్తున్నారో అదే స్వరూపాన్ని ప్రత్యక్షం(ఎమర్జ్) చేయండి ఆత్మనైన నా శాంతి స్వరూప తరంగాలు ఎంతవరకు పని చేస్తున్నాయి అని అభ్యాసము చేయండి. ఈ శాంతి తరంగాలు దగ్గరగా ఉన్న ఆత్మల వరకు చేరుతున్నాయా? లేక దూర దూరం వరకు కూడా వ్యాపిస్తున్నాయా? అశాంతి ఆత్మల వైపు తమ శాంతి తరంగాల ప్రభావాన్ని అనుభవం చేసి చూడండి. ఇప్పుడేం చేయాలో తెలిసిందా. మంచిది. ఇక ముందు కలుస్తూ ఉంటాము.

అందరూ ఎల్లప్పుడూ స్నేహంలో ఉండేవారు, ప్రతి కార్యములో సదా సహయోగులు, ప్రేమతో శ్రమను సమాప్తము చేసేవారు, ఎప్పుడూ అలసిపోనివారు, బాప్ దాదా ఛత్రఛాయలో ఉండేవారు, సదా విఘ్నవినాశకులు ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. 

1. ఒరిస్సా మరియు కర్ణాటక జోన్ సోదరీ సోదరులతో వ్యక్తిగత మిలనము - పిల్లలను కలవడానికి స్వయంగా తండ్రే వస్తారంటే మీది ఎంత శ్రేష్ఠ భాగ్యము! బాబా మా కొరకే వచ్చారు అన్న భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతరము సంతోషంగా ఉండండి. భగవంతుని నేనే తీసుకొచ్చాను. భగవంతుని తమ ప్రేమ బంధనంలో బంధించడం కంటే ఇంకేం కావాలి? అన్న నషాలో ఉండండి. అలా ఉంటే మాయ పారిపోతుంది. మాయకు అందరూ విడాకులు ఇచ్చేశారు కదా! విడాకులు ఇవ్వండి అనగా సంకల్పంలో కూడా రాకూడదు. మనసులో కూడా పూర్తిగా సమాప్తి చేయుటనే విడాకులివ్వడమని అంటారు. కనుక విడాకులిచ్చేశారు కదా. దూరదూరాల నుండి తండ్రి తన పిల్లల్ని వెతికి పట్టుకున్నారంటే మీరు అత్యంత అదృష్టవంతులు. కావున సదా మిమ్మల్ని మీరు అపురూప పిల్లలమని భావించండి. 

2. ఫరిస్తా స్థితిని తయారు చేసుకునేందుకు స్వయాన్నినేను తండ్రి ఛత్రఛాయలో ఉన్నానని భావించండి. స్వయాన్ని సదా తండ్రి స్మృతి అనే త్రఛాయ క్రింద ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా ? ఎంత స్మృతిలో ఉంటారో అంత అనుభవం చేస్తారు. నేను ఒంటరిగా లేను, బాప్ దాదా సదా నా జతలో ఉన్నారు. ఏ సమస్య ఎదురుగా వచ్చినా కంబైండ్ గా అనుభవం చేస్తారు కనుక భయపడరు. కంబైండ్ రూప స్మృతితో ఎలాంటి కష్టమైన పని అయినా సులభమైపోతుంది. ఎప్పుడైనా అలాంటి విషయము ఎదురైతే బాప్ దాదాను స్మృతి చేసి తమ బరువును తండ్రిపై పెట్టేయండి. మీరు తేలికైపోతారు. ఎందుకంటే తండ్రి పెద్దవారు, పిల్లలైన మీరు చిన్నవారు. పెద్దవారి పైనే బరువు మోపుతారు. బరువును తండ్రి మీద పెట్టేస్తే స్వయాన్ని సంతోషంగా అనుభవం చేస్తారు. ఫరిస్తాల వలె నాట్యం చేస్తూ ఉంటారు. పగలు,
రాత్రి 24 గంటలు మనసుతో నాట్యం చేస్తూ ఉంటారు. దేహాభిమానములోకి రావడం అనగా మానవులుగా అగుట. దేహీ అభిమానులుగా అవ్వడం అనగా ఫరిస్తాలుగా అగుట. ఉదయం నిద్ర లేవగానే సదా తమ ఫరిస్తా స్వరూప స్మృతిలో ఉండండి, సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటే ఎలాంటి విషయము ఎదురైనా దానిని సంతోషంగా దాటుకుంటారు. దేవీలు అసురులపై నాట్యం చేసినట్లుగా చూపిస్తారు కదా! కావున ఫరిస్తా స్వరూప స్థితిలో ఉంటే అసురీ విషయాలపై సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఫరిస్తాలై ఫరిస్తాల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఫరిస్తాల ప్రపంచం సదా స్మృతిలో ఉంటుంది.. 

3. పాప కర్మల నుండి ముక్తి పొందే సాధనం - లైట్ హౌస్ స్థితి. అందరూ స్వయాన్ని లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ గా భావిస్తున్నారా ? ప్రకాశం ఉన్న చోట ఏ పాప కర్మా జరగదు. సదా లైట్ హౌస్ గా ఉన్నందున మాయ ఏ పాప కర్మా చేయించలేదు. సదా పుణ్యాత్మలుగా అయిపోతారు. స్వయాన్ని అలాంటి పుణ్యాత్మనని భావిస్తున్నారా? పుణ్యాత్మలు సంకల్పంలో కూడా ఏ పాప కర్మలూ చేయరు. తండ్రి స్మృతి లేనిచోట పాపం జరుగుతుంది. ఎక్కడ బాప్ (తండ్రి) ఉంటారో అక్కడ పాపం ఉండదు. పాపం ఉంటే తండ్రి ఉండరు. కనుక
సదా ఎవరు ఉంటున్నారు? పాపం సమాప్తమైపోయింది కదా! పుణ్యాత్మలుగా అయ్యారంటే పాపం సమాప్తమై పోయింది. కావున ఈ రోజు నుండి “నేను పుణ్యాత్మను, పాపం నా ఎదురుగా రాలేదు" అని దృఢ సంకల్పం చేయండి. ఈ రోజు నుండి నేను స్వప్నంలో, సంకల్పంలో కూడా పాపాన్ని రానివ్వను అనేవారు చేతులెత్తండి. దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో 21 జన్మల కొరకు పాప కర్మలను సమాప్తము చేయండి. ఇలా దృఢ సంకల్పం చేసేవారికి బాప్ దాదా కూడా అభినందనలు తెలుపుతారు. స్వయంగా తండ్రి పిల్లలకు శుభాకాంక్షలు ఇవ్వడం కూడా ఎంత అదృష్టం కదా! ఈ స్మృతిలో సదా సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషపరచండి. 

4. స్వదర్శన చక్రధారులై స్వరాజ్యానికి, విశ్వ రాజ్యానికి అధికారులుగా కండి. బాప్ దాదా పిల్లలకు మొట్టమొదట “స్వదర్శన చక్రధారి" అన్న బిరుదును ఇస్తారు. బాప్ దాదా ద్వారా లభించిన బిరుదులు గుర్తున్నాయా? ఎంతెంత స్వదర్శన చక్రధారిగా అవుతారో అంతంత మాయాజీతులుగా అవుతారు. కనుక స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నారా? స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ ఒక్కొక్కసారి 'స్వ' కు బదులు పరదర్శన చక్రాన్ని తిప్పడం లేదు కదా! స్వదర్శన చక్రధారులుగా అయ్యేవారు స్వరాజ్యానికి, విశ్వ రాజ్యానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారా? ఎవరైతే ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అవుతారో వారే భవిష్య రాజ్య అధికారులుగా కాగలరు. రాజ్య అధికారులుగా అగుటకు నియంత్రణ శక్తి (కంట్రోలింగ్ పవర్) కావాలి. ఎప్పుడు ఏ కర్మేంద్రియము ద్వారా ఏ కర్మను చేయించాలనుకుంటే ఆ కర్మను చేయించగలగాలి. వారినే అధికారులని అంటారు. అలాంటి నియంత్రణ శక్తి ఉందా? కళ్లు, నోరు ఎప్పుడూ మోసగించుట లేదు కదా? నియంత్రణ శక్తి ఉన్నప్పుడు సంకల్పములో కూడా ఏ కర్మేంద్రియమూ మోసగించలేదు. 

5. సాక్షిస్థితి అనే సీటు గౌరవప్రదమైన సీటు. ఈ సీటుపై కూర్చొనువారు వ్యాకులత నుండి దూరమైపోతారు. డ్రామాలో ఏది జరిగినా అందులో కళ్యాణమే నిండి ఉంది అనే స్మృతిలో సదా ఉంటే సంపాదన జమ అవుతూ ఉంటుంది. తెలివైన పిల్లలు ఏమి జరిగినా అది కళ్యాణమే అని భావిస్తారు. ఎందుకు? ఏమి? అనే ప్రశ్నలు వివేకవంతులకు రావు. ఈ సంగమ యుగము కళ్యాణకారీ యుగము. తండ్రి కూడా కళ్యాణకారి అన్నది స్మృతిలో ఉంటే శ్రేష్ఠ స్థితి తయారవుతూ ఉంటుంది. బాహ్యంగా అది నష్టంగా కనిపించినా ఆ నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉందనే నిశ్చయము ఉండాలి. ఎప్పుడైతే బాబా జత, బాబా హస్తం ఉంటాయో అప్పుడు అకళ్యాణం జరగదు. ఇప్పుడు చాలా పరీక్షలు వస్తాయి. అందులో ఎందుకు? ఏమి? అన్న ప్రశ్నలు రానే రాకూడదు. ఏమి జరిగితే అది జరగనీయండి. తండ్రి నా వారు, నేను బాబా వాడిని అనే స్మృతిలో ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. వీరినే నిశ్చయ బుద్ది పిల్లలని అంటారు. నిశ్చయమంటే మాట మారినా మీరు మారకూడదు. ఎప్పుడూ మాయతో విసుగు, వ్యాకులత చెందడం లేదు కదా! అప్పుడప్పుడు వాతావరణంతో, అప్పుడప్పుడు ఇంటివారితో, అప్పుడప్పుడు బ్రాహ్మణులతో విసుగు చెందుతున్నారా? మీ శాన్ (గౌరవప్రదమైన) సీట్ పై ఉండండి. సాక్షీ స్థితి అనే సీటే గౌరవప్రదమైన సీటు. ఈ సీటు నుండి దిగకుండా ఉంటే చింత దూరమైపోతుంది. ఎప్పుడూ, ఏ మాటలోనూ నేను చింత చేయను, చింతను కల్గించను అని ప్రతిజ్ఞ చేయండి. మీరు జ్ఞానసాగరుని పిల్లలు త్రికాలదర్శులుగా అయ్యారు. మరి చింతాగ్రస్తులుగా ఎలా అవుతారు? సంకల్పంలో కూడా చింత ఉండరాదు. “ఎందుకు” అన్న మాటను సమాప్తి చేయండి. “ఎందుకు” అన్న మాట వెనుక చాలా పెద్ద క్యూ ఉంటుంది. 

వీడ్కోలు తీసుకునే సమయములో - మేళాను చూసి సంతోషం కలుగుతున్నది కదా! డ్రామాలో ఏం జరిగినా అది చాలా మంచిగానే అవుతుంది. ఇప్పుడు చాలా మంది వస్తారు. ఇది ఏమీ లేదు. ఏర్పాట్లు పెంచుతూ పోతారు, పెరిగేవారు పెరుగుతూ పోతారు. మధువనంలో గుంపు పెరిగినప్పుడు భక్తిలో స్మారక చిహ్నం తయారవుతుంది. ఎంత తయారు చేస్తూ ఉంటే అంతగా పెరుగుతూనే ఉంటారు. ఈ వరదానం కూడా లభించింది. సాగరం వరకు వెళ్లినా అది కూడా చిన్నదైపోయింది అని భక్తి మార్గంలోని కథల్లో చూపిస్తారు. ఆబూ రోడ్డు వరకు వ్యాపిస్తే అప్పుడు మహిమ జరుగుతుంది. ఆబూ రోడ్డు నుండి మౌంట్ ఆబూ వరకు కూర్చున్నప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది అని అందరూ ఆలోచిస్తారు. అందరి దృష్టి ఇటువైపు పడ్తుంది. బ్రహ్మకుమారీలు ఎంత వృద్ధి చెందారు! ఇప్పుడిది పిల్లల మేళా కాని పిల్లలు, భక్తులు ఇద్దరూ కలిసిపోయినప్పుడు ఏమి జరుగుతుంది? ఇప్పుడింకా అనేక ఏర్పాట్లు చేయాలి. తండ్రి వచ్చారంటే పిల్లలు కూడా పెరగాలి. వృద్ధి కాకపోతే సేవ చేసేది ఎందుకు? సేవకు అర్థమే వృద్ధి. 

Comments