05-12-1979 అవ్యక్త మురళి

05-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విజయ పతాకాన్ని ఎగురవేయుటకు అనుభూతి కోర్సును ప్రారంభించండి.

ఈ రోజు బాప్ దాదా తమ ఆత్మిక సైన్యాన్ని చూస్తున్నారు. సైన్యంలో అన్ని రకాల నంబరు వారిగా స్థితిని అనుసరించి మహారథులను, అశ్వారూఢులను, కాల్బలం వారిని చూశారు. మహారథుల మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయ జండా ఎగురుతూ ఉంటుంది. అశ్వారూఢులనగా రెండవ నంబరు వారి మస్తకంలో అనగా స్మృతిలో విజయ జండా అయితే ఉంది కాని సదా ఎగురుతూ లేదు. అప్పుడప్పుడు సంతోషపు మెరుపుతో మరియు నిశ్చయమనే నషాతో జండా ఎగురుతూ అప్పుడప్పుడు మెరుపు మరియు నషా అనే గాలి వాతావరణం తక్కువైనందున జండా ఎగురుటకు బదులు ఒకే స్థానంలో ఉండిపోతుంది. మూడవ వారు అనగా కాల్బలం వారు చాలా ప్రయత్నంతో నిశ్చయమనే తాడుతో, సంతోషపు మెరుపుతో జండాను ఎగురవేసే ప్రయత్నంలో బాగా నిమగ్నమై ఉన్నారు. కాని అక్కడక్కడ బలహీనత అనే ముడి ఉన్నందున చిక్కుకుపోతుంది, ఎగరడం లేదు. అయినా పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది పురుషార్థం చేసిన తర్వాత ఎగురుతుంది. అయితే కొంత సమయం తర్వాత, కొంత కష్టం చేసిన తర్వాత ఎగురుతుంది. కనుక ఆ నషా మరియు మెరుపు కనిపించుట లేదు. బాప్ దాదా పిల్లల కష్టాన్ని చూసి దూరం నుండి సకాశ్ కూడా ఇస్తూ ఉంటారు అనగా ఇలా చేయండి అని సూచన కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు సూచనను చూస్తూ సఫలం కూడా అవుతూ ఉన్నారు కాని కొంతమంది శ్రమ చేస్తూ ఎంత బిజీగా ఉన్నారంటే ఆ సూచనను గ్రహించే సమయం కూడా లేదు. ఇలా సైన్యములో మూడు రకాల యోధులను చూశారు. కష్టంతో గాని, సహజంగా గాని అందరి జండా బాగా ఎగిరినపుడే విజయ పుష్పాలు అనగా తండ్రి మరియు పిల్లల ప్రత్యక్షత పుష్ప వర్షము సమానంగా శోభిస్తుంది. ఏ పిల్లలు కష్టపడుతున్నారో వారికి బాప్ దాదా సహజ సాధనం వినిపిస్తున్నారు.


సమయానికి మరియు నిరంతరము విజయ జండా ఎందుకు ఎగరడం లేదు, అందుకు కారణమేమి? మీరు కూడా ఏదైనా ఫంక్షన్లో జండా ఎగురవేస్తారు. ఒక్కోసారి అది సమయానికి ఎగరదు. కారణమేమి? ముందు నుండి రిహార్సల్స్ చెయ్యడం లేదు. అలాగే విజయ జండాను ఎగుర వేసేందుకు అవసరమైన ముఖ్యమైన విషయం - అనుభూతి(రియలైజేషన్) లేదు. అమృతవేళ నుండే అనుభూతి కోర్సును మొదలుపెట్టండి. వర్ణన అయితే అందరూ చేస్తారు కాని వర్ణన చేయుటలో, అనుభూతి చేసుకోవడంలో చాలా తేడా ఉంటుంది. ఒకటి వినడం లేక తండ్రితో సర్వ సంబంధాలున్నాయని వినిపించడం. కాని ప్రతి సంబంధాన్ని అనుభూతి చేసుకొని ప్రాప్తిలో మగ్నమై ఉంటే పాత ప్రపంచములోని వాతావరణం నుండి సహజంగానే అతీతంగా ఉండగలరు. ప్రతి కార్యంలో సమయానుసారం భిన్న - భిన్న సంబంధాలను అనుభవం చేసుకోగలరు, అదే సంబంధాల సహాయోగంతో నిరంతర యోగాన్ని అనుభవం చేయగలరు. ప్రతి సమయంలో తండ్రి నుండి భిన్న భిన్న సంబంధాల సహయోగం తీసుకోవడం అనగా అనుభవం చెయ్యడమే యోగము. ఇలాంటి సహజయోగులుగా, నిరంతరయోగులుగా ఎందుకు అవ్వడం లేదు? తండ్రి ఎలాంటి సమయంలోనైనా సంబంధాన్ని నిభాయించడానికి బంధింపబడి ఉన్నారు. తండ్రి తమ తోడును ఇస్తున్నపుడు తీసుకునేవారు ఎందుకు తీసుకోవడం లేదు? సహయోగం తీసుకోవడమే యోగమెలా అవుతుందో అనుభవం చెయ్యండి. తల్లి సంబంధం ఏమిటి? తండ్రి సంబంధం ఏమిటి? స్నేహితుడు(సఖుడు) మరియు బంధువు సంబంధం ఏమిటి? సదా ప్రియుని సాంగత్యం యొక్క అనుభవం ఏమిటి? ఈ వేరు వేరు సంబంధాల రహస్యం అనుభవంలోకి వచ్చిందా? ఏ ఒక్క సంబంధమునైనా అనుభూతి చేయుట నుండి వంచితులుగా ఉండిపోతే మొత్తం కల్పమంతా వంచితులుగా ఉండిపోతారు. ఎందుకనగా కల్పంలో ఇప్పుడు మాత్రమే సర్వ అనుభవాల నిధి(ఖజానా) ప్రాప్తిస్తుంది. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. కావున ఇప్పటివరకు ఏ సంబంధాన్ని అనుభూతి చేసుకోలేక పోయారో మీకు మీరే చెక్ చేసుకోండి. అలాగే జ్ఞానము సబ్జక్టులో ఏ పాయింట్లను వర్ణన చేస్తున్నారో ఆ ప్రతి పాయింటును అనుభవం చేశారా? మేము స్వదర్శన చక్రధారులము అని వర్ణన చేస్తారు కాని స్వదర్శనం యొక్క అనుభవం ఏ ఆధారంతో చెప్తారు? దర్శనం అనగా తెలుసుకొనుట. తెలుసుకునేవారు ఆ తెలుసుకున్న అథారిటీలో ఉంటారు. ఈ రోజుల్లో శాస్త్రవాదులు కేవలం శాస్త్రాలు చదువుతారు, కంఠస్థం చేస్తారు. అయినా స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. మీరందరూ కంఠస్థం చేయరు కాని అందులో రమిస్తారు. రమణము చేయు వారనగా మననము ద్వారా స్వరూపంలోకి తెచ్చేవారు. అలాగే సదా అనుభవము చేసి జ్ఞానం యొక్క అథారిటీ అనగా సదా జ్ఞానములోని ప్రతి పాయింటును అనుభవం చేసి నషాలో ఉండేవారు. జ్ఞానములోని ప్రతి పాయింటు యొక్క అథారిటీగా అనగా అనుభవం యొక్క నషాలో ఉంటున్నారా? ఇదే విధంగా ధారణా సబ్జక్టులో రకరకాల గుణాలను వర్ణన చేస్తారు, ఆ ప్రతి గుణము యొక్క అనుభవానికి అథారిటీగా ఉన్నారా? ఉపన్యాసకులుగా ఉన్నారా? శ్రోతలుగా(వినేవారుగా) ఉన్నారా? లేక అథారిటీగా ఉన్నారా? ఇందులోనే నంబరు వస్తుంది.

మహారథులనగా ప్రతి శబ్దమును అనుభవము చేసి అథారిటీగా ఉండేవారు. అశ్వారూఢులు అనగా విని వినిపించుటలో ఎక్కువగా, అనుభవం యొక్క అథారిటీలో తక్కువగా ఉంటారు. కనుక సహజ సాధనం ఏమిటి? అనుభూతి లోపము అనగా అనుభవీ మూర్తులుగా అవ్వడంలో లోపం. భక్తికి, జ్ఞానానికి గల విశేషమైన తేడా ఇదే అది వర్ణన, ఇది అనుభవం. నిరంతర యోగిగా అయ్యేందుకు ఆధారము - సదా సర్వ సంబంధాల సహయోగం తీసుకోండి. అనుభవీలుగా కండి. అర్థమయిందా? అనుభవ నిధిని బాగా ప్రాప్తి చేసుకోండి. కొద్దిగా కాదు కాని సర్వ ప్రాప్తులూ పొందండి. రెండు-మూడు సంబంధాలు, రెండు-మూడు పాయింట్ల అనుభవం కాదు. అన్నింటిలో అనుభవీ మూర్తులుగా అవ్వండి. మాస్టర్ సర్వశక్తివంతుల అథారిటీగా అయినప్పుడు సదా విజయ జండా ఎగురుతూ ఉంటుంది. 

తండ్రికి అందరి పైన స్నేహం ఉంది. మహారాష్ట్ర వారితో కూడా స్నేహం ఉంది. మహారాష్ట్ర వారంతా అనుభవీ మూర్తులుగా అవ్వాలి. కనుక మహారాష్ట్ర విశేషత ఏమంటే అందరూ విజయులుగా అవ్వాలి, క్షత్రియులుగా కాదు. క్షత్రియులైతే సదా శ్రమ చెయ్యడంలో నిమగ్నమై ఉంటారు. కాని సదా విజయులుగా అవ్వాలి. ఇప్పుడు క్షత్రియులుగా ఉండే సమయం సమాప్తమైపోయింది. ఇప్పటి వరకూ క్షత్రియులుగానే ఉంటే చంద్ర వంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అనగా విజయులుగా అయ్యే సమయము. చాలాకాలపు విజయ సంస్కారము ఉండాలి. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. కనుక ఇప్పటి నుండే విజయీగా అయ్యే సంస్కారం నింపుకోకపోతే చంద్రవంశీయులుగా అయిపోతారు. అందువలన మీ భాగ్యరేఖను ఇప్పుడు కూడా పరివర్తన చేసుకోవచ్చు.

ఇలా సదా విజయులుగా, సర్వ సంబంధాల అనుభవాల అథారిటీగా, జ్ఞానములోని ప్రతి పాయింటు యొక్క అథారిటీగా, ప్రతి గుణపు అనుభవ అథారిటీగా, సేవా సబ్జక్టులో ఆల్‌రౌండర్ మరియు ఎవరెడీగా ఉండు విశేషత యొక్క అథారిటీ కల్గిన, తండ్రి సమానంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. 

మహారాష్ట్ర జోన్ పార్టీతో అవ్యక్త మిలనము -

1)నిశ్చయబుద్ధి కల్గినవారి మనసులోని సంతోషధ్వని - “పొందవలసినదంతా పొందాను" - సదా తమను అన్ని ఖజానాలతో సంపన్నులుగా భావిస్తున్నారా? ఎలాగైతే తండ్రి సదా సంపన్నంగా ఉంటారో అలా తండ్రి సమానంగా అన్ని ఖజానాలతో సంపన్నంగా ఉన్నారా? ఏ ఖజానాలోనూ లోపముండరాదు. అప్పుడు పొందవలసినదంతా పొందాను అని మనసు నుండి ధ్వని వస్తుంది. నోటి ధ్వని నిరంతరము ఉండదు కాని మనసు ధ్వని నిరతరం అవినాశిగా ఉంటుంది. 'పొందాము' అని మనసు నుండి ధ్వని వస్తున్నదా? లోపల నుండి వస్తున్నదా లేక ఇప్పుడు పొందాలి, పొందుతూ ఉన్నాము అని అనుకుంటున్నారా! స్థిరమైన నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యారా? పుత్రునిగా అవ్వడం అనగా అధికారిగా అవ్వటం. ఎప్పుడూ మీపై కూడా సంశయం ఉండరాదు. సంపూర్ణంగా అవుతారా, కారా? సూర్యవంశీయులుగా అవుతారా లేక చంద్ర వంశీయులుగా అవుతారా? సదా నిశ్చయబుద్ధి. ఎలాగైతే తండ్రిపై నిశ్చయం ఉందో, అలా స్వయంపై కూడా నిశ్చయం. స్వయంలో బలహీన సంకల్పం ఉత్పన్నమవుతూ ఉంటే బలహీన సంస్కారం తయారవుతుంది. ఎవరైనా శారీరికంగా ఒకసారి బలహీనమై త్వరగా ఆరోగ్యవంతులుగా కాలేకపోతే బలహీనపరచే బ్యాక్టీరియా దృఢంగా అయిపోతుంది. వ్యర్థ సంకల్పాలనే బలహీనపరచే బ్యాక్టీరియాను మీ లోపలికి ప్రవేశింపనీయకండి. లేకపోతే వాటిని సమాప్తం చెయ్యడం కష్టమైపోతుంది.

డ్రామాలో ఏ దృశ్యాన్ని చూస్తున్నా అలజడి కలిగించే దృశ్యం కావచ్చు లేక అచంచల దృశ్యం కావచ్చు రెండిటిలోనూ నిశ్చయం ఉండాలి. అలజడి దృశ్యంలో కూడా కళ్యాణముంది అని అనుభవం అవ్వాలి. ఇలాంటి నిశ్చయబుద్ధి గలవారిగా ఉండాలి. వాతావరణం కదిలించేదిగా ఉండినా, సమస్య భయంకరమైనదైనా వచ్చినా సదా నిశ్చయబుద్ధిగా ఉండాలి. వీరినే విజయులు అని అంటారు. నిశ్చయముంటే భయంకరమైన సమస్య కూడా శీతలంగా అయిపోతుంది. భిన్న భిన్న భాషలవారిగా ఉన్నా మీదంతా ఒకే మతం, ఒకే తండ్రి, ఒకే నిశ్చయం మరియు ఒకే గమ్యం. కేవలం సేవ కొరకు వేరు వేరు స్థానాలలో ఉంటున్నారు. అందరూ ఒకే స్థానంలో కూర్చుంటే నలువైపులా సేవ ఎలా జరుగుతుంది? సేవ సమాప్తమైనపుడు అందరూ మధువనానికి వచ్చేస్తారు. కాని వారిలో కూడా ఎవరు వస్తారు? ఎవరు నిర్మోహులుగా ఉంటారో, ఎవరి బుద్ధి లైను స్పష్టంగా ఉంటుందో వారు వస్తారు. ఆ సమయంలో టెలిఫోన్ లేక టెలిగ్రామ్ తో పిలవడం ఉండదు. కాని బుద్ధి లైన్ స్పష్టంగా ఉంటే పిలుపు చేరుకుంటుంది. ఎలాంటి పరిస్థితులుంటాయంటే ఏ రైలుతో మీరు చేరుకోవాలో అదే నడుస్తుంది. దాని తర్వాత నడవవు. లైను స్పష్టంగా ఉంటే సాధనాలు కూడా లభిస్తాయి. లేకపోతే ఎక్కడో ఒక చోట చిక్కుకుపోతారు. అందువలన చాలాకాలం నిరంతర యోగం కావాలి. యోగమే కవచం.

కవచం ఉన్నవారు సదా సురక్షితంగా ఉంటారు. “స్మృతి అను కవచమే" మీ రక్షణ డ్రస్సు. మాతలు తీవ్రపురుషార్థులుగా ఉన్నారు కదా? ఇప్పుడు ఇంటిలో కూర్చోకండి. గ్రూపు తయారుచేసుకొని నలువైపులా సేవ కోసం వ్యాపించండి. సెంటర్లు తెరవండి. ఎన్ని సెంటర్లు తెరుస్తారో తర్వాత సంవత్సరంలో చూస్తాను. సమస్యల కంటే ముందే అందరికీ సందేశమివ్వండి. అప్పుడు అందరూ తమను చాలా గుణగానం చేస్తారు. ఇప్పుడు సేవాకేంద్రాలను తెరుస్తూ వెళ్లండి. సందేశమిచ్చుటకు ఏదైనా సాధనాన్ని తమదిగా చేసుకోండి.

2)డ్రామా జ్ఞానంతో ఎందుకు, ఏమిటి అను ప్రశ్నలను సమాప్తం చేయువారే ప్రకృతిజీత్, మాయాజీతులుగా అవుతారు - అందరూ ప్రకృతీజీత్, మాయాజీతులుగా అయ్యారా? ఈ 5 తత్వాలు కూడా తమవైపు ఆకర్షించరాదు, 5 వికారాలు కూడా యుద్ధం చేయరాదు. ఇలాంటి ప్రకృతిజీత్ లు, మాయాజీత్ లు రెండు పేపర్లలో పాస్ అవ్వాలి. ప్రకృతి ద్వారా ఎలాంటి పేపర్ వచ్చినా పాసయ్యే శక్తిని ధారణ చేశారా? అలజడిలోకి రారు కదా? కొద్దిగా అలజడిలోకి వచ్చినా 5 అయినట్లే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వచ్చాయంటే ఫలితం ఎలా ఉంటుంది? కొద్దిగా ఏదైనా ప్రకృతి సమస్య యుద్ధం చేసేదిగా తయారైనా ఫెయిల్ అయిపోతారు. ఏమి జరిగినా లోపల నుండి 'వాహ్! మధురమైన డ్రామా!' అను ధ్వని రావాలి. డ్రామా జ్ఞానాన్ని ఇంత పక్కాగా చేసుకున్నారా? లేక మంచి వాటికి 'డ్రామా' అంటూ, అలజడి మాటలుంటే 'అయ్యో అయ్యో' అని అంటారా! అయ్యో ఏమయింది అని సంకల్పంలో కూడా రాకూడదు. ఇంత దృఢంగా ఉన్నారా? ఎందుకనగా ముందు ముందు ఇలాంటి సమస్యలు ప్రకృతి ద్వారా కూడా రాబోతున్నాయి. ప్రకృతి ఆపదలు రోజురోజుకు పెరగనే పెరుగుతాయి. ఏమి జరిగినా సంకల్పంలో కూడా అలజడి రాకుండే ఉండే స్థితి ఉండాలి. ఇలా అచంచలంగా, స్థిరంగా అయ్యారా? చాలా సమయం మాయాజీత్, ప్రకృతిజీత్ గా అయ్యే అభ్యాసం లేకుంటే ఫలితం ఏమవుతుంది? ఒక్క సెకండు కోసం పేపర్ వస్తుంది. ఆ సమయంలో ఏర్పాట్లు చేసుకోవడంలో లగ్నమైతే ఫలితం జారిపోతుంది. ఒక్క సెకండులో పాసయ్యే అభ్యాసం కావాలి. యోగం చెయ్యాలి, స్మృతిలో కూర్చోవాలి అని ఆలోచిస్తూ ఉండినా సెకండు గడిచిపోతుంది. యుద్ధంలోనే శరీరాన్ని వదిలేస్తారు. పురుషార్థ జీవితంలో యుద్ధం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలితే ఫలితం ఏమవుతుంది! చంద్ర వంశీయులుగా అవుతారు. అందువలన ప్రతి ఒక్కరు సదా 108 మాలలోకి వచ్చే లక్ష్యాన్ని ఉంచుకోండి. లక్ష్యం శ్రేష్ఠంగా ఉంటే లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. 16 వేలలోకి వచ్చే లక్ష్యాన్ని ఎప్పుడూ పెట్టుకోకండి. నంబరువన్ లోకి వచ్చే పురుషార్థం మరియు లక్ష్యం పెట్టుకోండి.

శక్తులు సదా శస్త్రధారులుగా శృంగారమూర్తులుగా ఉండి సంహారము చేయువారు - ఈ రెండు స్వరూపాలలో స్థితమై ఉంటున్నారా? ఎప్పుడూ ఏడ్చేవారిగా లేరు కదా? సదా హర్షితంగా ఉండేవారు. మనసుతో కూడా ఏడ్చేవారుగా కాదు. కొద్దిగా మాయతో ఓడిపోయినా మనసులో ఏడ్పు వచ్చేస్తుంది. మాతలు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. ఎందుకంటే నిరాశావాదుల నుండి ఆశావాదులుగా అయ్యారు. తండ్రి తలమానికంగా చేశారంటే ఎంత సంతోషంగా ఉండాలి! పాండవులు కూడా మాతలను చూసి సంతోషపడ్డారు. ఎందుకనగా శక్తులు పాండవులకు ఢాలు వంటివారు. ఢాలు దృఢంగా ఉంటే యుద్ధం జరగదు. అందువలన మాతలను ముందుంచడంలో పాండవులకు సంతోషముండాలి. స్వయం ముందుంటే దెబ్బలు తినాల్సి వస్తుంది. శక్తులును ముందుంచితే పాండవులకు కూడా మహిమ ఉంటుంది. ముందుంచడం కూడా ముందు ఉండడం అవుతుంది.

3)తమ విశేషతలను తెలుసుకొనువారే విశేష ఆత్మలుగా అవుతారు - ఎలాగైతే పిల్లలు తండ్రి స్నేహంలో నిమగ్నమై ఉంటారో అలా తండ్రి కూడా పిల్లల సేవలోనే సదా నిమగ్నమై ఉంటారు. పిల్లలకు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు అలాగే తండ్రికి పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు. ఎలాగైతే మీరు తండ్రి గుణాలను మహిమ చేస్తారో అలా తండ్రి కూడా ప్రతీ పుత్రుని గుణాలను మహిమ చేస్తారు. రోజూ ప్రతి పుత్రుని విశేషతలను, గుణాలను ఎదురుగా తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారు విశేష ఆత్మలుగానే ఉంటారు. విశేష ఆత్మల విశేషతలను తండ్రి కూడా మహిమ చేస్తారు. ఎలాగైతే రత్నాల వ్యాపారికి ప్రతి రత్నం విలువ గురించి తెలుసో, అలా తండ్రికి ప్రతి పుత్రుని శ్రేష్ఠతను గురించి తెలుసు. ప్రతి రత్నము మరొకదాని కంటే శ్రేష్ఠమైనది. ఇలా శ్రేష్ఠమని భావించి నడుస్తున్నారా? సాధారణమైన వారు కాదు. చివరి పూస కూడా సాధారణమైనది కాదు. తండ్రిని తెలుసుకునే విశేషత చిపరి పూసలో కూడా ఉంది. మీరు చివరి వారు కాదు, ఫస్ట్ వెళ్లేవారు. ఇప్పుడింకా ఏ నంబరూ ఫిక్స్ కాలేదు. అన్ని సీట్లూ ఖాళీగానే ఉన్నాయి. విజిల్ మ్రోగలేదు. విజిల్ మ్రోగితే సీట్లో కూర్చుంటారు. చివర్లో ఉన్నవారు కూడా తీవ్రగతితో వెళ్లి మొదటి సీటు తీసుకోగలరు. తల్లి-తండ్రి సీట్లు తప్ప మిగిలిన అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు భాగ్యం మీ చేతిలో ఉంది. భాగ్య విధాత తండ్రి భాగ్యాన్ని మీ చేతికిచ్చారు. ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ సంగమ యుగానికి ఏది కావాలంటే, ఎలా కావాలంటే, ఎంత కావాలంటే అంత చేసుకునే వరదానం లభించింది. ఇలాంటి గోల్డెన్ ఛాన్సును తమదిగా చేసుకున్నారా?

సేవ ఎంత విస్తారమైనా స్థితి సార రూపంలో ఉండాలి. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండులో మాస్టర్ బీజరూపులు కండి అని డైరక్షన్ లభిస్తూనే అలా అయిపోండి. సమయం పట్టకూడదు. ఇది సెకండు యొక్క ఆట. ఒక్క సెకండు ఆటతో మొత్తం కల్పానికి భాగ్యాన్ని తయారు చేసుకోగల్గుతారు. ఎంత కావాలంటే అంత తయారు చేసుకోండి.

Comments