23-11-1972 అవ్యక్త మురళి

* 23-11-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శక్తిదళం యొక్క విశేషతలు.

              (మధువన నివాసీయులతో బాప్ దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు....)

           మధువన నివాసీ శక్తిసేన తమను సదా శక్తి రూపములో అనుభవము చేసుకుంటూ నడుచుకుంటున్నారా? శక్తిదళము అని గాయనము కూడా ఉంది. శక్తిదళము కారణంగానే తండ్రి పేరు కూడా సర్వశక్తివంతుడు అని ఉంది. కావున ఇది సర్వశక్తివంతుని శక్తి దళము. శక్తిదళపు విశేషత సదా ఉంటుంది మరియు వారు అన్ని సమస్యలను ఎలా దాటివేస్తారంటే, ఏదైనా మంచిగా, నేరుగా ఉన్న దారిని ఎంత సహజంగా దాటివేస్తారో అలా దాటివేస్తారు. ఆలోచించరు, ఆగరు. ఈ విధంగా శక్తిదళపు విశేషత ఇదే, సమస్యలు వారి కొరకు ఎక్కే కళకు సహజ సాధనంగా అనుభవమౌతాయి. సమస్య సాధనం రూపంలోకి పరివర్తన అయిపోవాలి, కావున సాధనాన్ని అనుసరించటంలో కష్టమనిపించదు, ఎందుకంటే ఈ సాధనమే సిద్ధికి ఆధారము అని తెలిసిపోతుంది. శక్తిదళమునకు ఎల్లప్పుడూ ప్రతి సమస్య తెలిసున్నట్లుగానే అనుభవముంటుంది. వారు ఎప్పుడూ ఆశ్చర్యవంతులుగా అవ్వరు. ఆశ్చర్యమునకు బదులుగా వారు ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉంటారు. ఏదైనా సహజ సాధనము ఉన్నప్పుడు లేక సంబంధములో ఏవైనా విషయాలు వచ్చినా అవి తమకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ కారణంగా సంతుష్టంగా ఉన్నట్లయితే దానినేమీ సంతుష్టత అని అనరు. ఏవైతే తమ సంబంధములో లేక తమ స్థితి ప్రమాణంగా అనుకూలంగా లేనట్లు అనిపించినా కూడా అందులో కూడా సంతుష్టంగా ఉండాలి, అటువంటి స్థితి ఉండాలి. శక్తిదళము నోటి నుండి ఎప్పుడూ 'కారణము' అన్న మాట వెలువడదు. ఈ కారణము వలన ఇది అయింది.. అని అనరు. 'కారణము' అన్న మాట నివారణలోకి పరివర్తనమైపోతుంది. ఈ కారణము వలన ఇది అయ్యింది అన్నమాట అయితే అజ్ఞానులు కూడా అంటారు. మీకు ఇటువంటి స్థితి ఉండకూడదు. ఎదురుగా ఏ కారణము వచ్చినా కూడా అదే ఘడియలో దానిని నివారణరూపములోకి పరివర్తన చెయ్యాలి. అప్పుడిక ఈ భాష సమాప్తమైపోతుంది, సమయాన్ని పోగొట్టడము సమాప్తమైపోతుంది. 10-20 నిముషాలు పట్టినా లేక, 2 నిముషాలు పట్టినా, సమయమైతే పోయింది కదా! అదే సమయములో వెంటనే త్రికాలదర్శులుగా అయ్యి కల్పకల్పము ఈ కారణాన్ని నివారణ చేసాను, అన్న విషయము స్పష్టముగా సృతిలో రావటం ద్వారా కారణాన్ని నివారణలోకి బదిలీ చేసేస్తారు. దీనిని చెయ్యాలా, వద్దా అని ఆలోచించను కూడా ఆలోచించరు. ఇది సరిగ్గా అవుతుందా, కాదా? ఇది ఎలా అవుతుంది?.... ఇటువంటి భాష సమాప్తమైపోతుంది. ఇల్లు తయారయ్యే సమయంలో మొదట ఇంటి పైకప్పును వేసేందుకు ఆధారమును తయారుచేస్తారు, మొదట అటువంటి సమయము ఉండింది. ఇప్పుడైతే నిరాధారంగా అవ్వాలి. మొదట ఈ విషయాలు వినేటందుకు సమయమును ఇచ్చేవారు, ఎటువంటి సమస్యా లేదు కదా, సంపర్కములోని వారు ఎవరూ విఘ్నములనైతే వెయ్యటం లేదు కదా అని అడిగేవారు. ఇప్పుడు అలా అడిగే ఆవశ్యకత లేదు. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు. మరి అటువంటి స్టేజ్ వరకు చేరుకున్నారా లేక ఇప్పటివరకు కూడా ఇదైంది, అదైంది... లాంటి విషయాలు మాట్లాడుతుంటారా? ఇటువంటి విషయాలను రామాయణ కథలు అని అంటారు - ఇది జరిగింది, ఫలానావారు ఇలా చెప్పారు. రామాయణ కథలలో అయితే సమయాన్ని పోగొట్టుకోవడం లేదు కదా? ఇప్పటివరకు కూడా కథలను చెప్పేవారేనా? రామాయణ కథను కూడా కొందరు ఒక వారములో, కొందరు 10 రోజులలో పూర్తి చేస్తారు. అటువంటి కథలనైతే చెప్పరు కదా? పరస్పరము ఇతరులతో కలిసినప్పుడు స్మృతియాత్ర యుక్తులు లేక ప్రతిరోజూ ఏ గుహ్య-గుహ్య విషయాలను వింటూ ఉంటారో వాటిని ఇచ్చిపుచ్చుకోవటమును చేయ్యండి. ఇప్పుడు అటువంటి స్థితి తయారవ్వాలి, భక్తి మార్గమును వదిలేసారు కదా. ఒకవేళ భక్తిమార్గపు ఆచారాలు-పద్ధతులు ఇప్పటివరకు కూడా ఉన్నట్లయితే ఆశ్చర్యమనిపిస్తుంది కదా. అలాగే ఇటువంటి విషయాలను మాట్లాడటము లేక ఈ విషయాలలో సమయాన్ని పోగొట్టుకోవడము, వీటిని కూడా భక్తిమార్గపు ఆచారవ్యవహారాలని భావించాలి. ఎప్పుడైతే ఇటువంటి అనుభవము కలుగుతుందో అప్పుడు పరివర్తన కలిగిందని భావించండి. భక్తి మార్గము వెనుకటి జన్మకు చెందిన విషయమని అనుభవము చేస్తారు కదా, ఈ జన్మలో ఎప్పుడైనా గంటను  మ్రోగించటము లేక మాలను త్రిప్పటము చేసారా? జరిగిపోయిన జీవితముపై నవ్వు వస్తుంది. అలాగే ఇది కూడా ఏంటి? ఒకవేళ ఎవరి అవగుణమునైనా లేక అటువంటి నడవడికనైనా స్మరణ చేసారంటే అది కూడా భక్తి అయిపోయింది కదా! బాబా గుణగానమును చెయ్యటము, స్మరణ చెయ్యటము అది మాల తిప్పటమే కదా! ఒకవేళ ఎవరి అవగుణమైనా లేక ఏదో చూసిన విషయాలను స్మరణ చేసినట్లయితే అది కూడా భక్తిమార్గములో మాల త్రిప్పటము వంటిదే. మనసులో సంకల్పము చెయ్యటము. ఇది కూడా జపించటమైంది కదా. ఏవిధంగా వారు అజపాజపము చేస్తూ ఉంటారో, అలా సంకల్పము నడస్తూనే ఉంటుంది, ఆగదు. మరి ఇది కూడా జపమే. ఇతరులకు వినిపిస్తూ ఉంటారు, ఫలానావారు ఇది చేసారు, అది చేసారు అని ఈ గంటను మ్రోగిస్తూ ఉంటారు. కావున ఇది దుర్గతిని కలిగించే పద్ధతి.
                                                         
           మధువన నివాసులైతే జ్ఞాన స్వరూపులు కదా! దుర్గతిని కలిగించే ఎటువంటి పద్ధతులు అలవాట్లయినా అవి స్థూలమైనవైనా లేక సూక్ష్మమైనవైనా, వాటి నుండి వైరాగ్యము రావాలి. ఏవిధంగా జ్ఞాన ఆధారంతో భక్తి యొక్క స్థూల సాధనాల నుండి వైరాగ్యము వచ్చిందో అలా ఈ భక్తిమార్గపు పద్ధతి నుండి కూడా అటువంటి వైరాగ్యము రావాలి. ఈ వైరాగ్యము తరువాతనే స్మృతి స్పీడు తీవ్రమవ్వగలదు. లేనట్లయితే ఎంతన్నా పురుషార్థము చెయ్యండి, ఏవిధంగా భక్తులు భగవంతుని స్మృతిలో కూర్చునేందుకు ఎంత పురుషార్థము చేసినా, కూర్చోగలరా? తమను ఎంతగానో కొట్టుకుంటారు, కష్టపెట్టుకుంటారు. భిన్న రీతులలో సమయాన్ని ఇస్తారు, సంపదను వెచ్చిస్తారు, అయినప్పటికీ జరగగలదా? ఇక్కడ కూడా ఒకవేళ దుర్గతిమార్గపు పద్ధతులు, అలవాట్లు ఉన్నట్లయితే స్మృతియాత్ర స్పీడ్ ఎక్కువ కాజాలదు, నిరంతర స్మృతి ఉండజాలదు. గంటను మ్రోగించటము మొదలగునవి వదిలిపోయాయి కానీ స్థూలరూపములో వదిలి సూక్ష్మరూపములో తీసుకున్నారా? సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, ధనాన్ని వ్యర్థం చేస్తున్నారు అని భక్తిమార్గము వారితో అయితే బాగా ఛాలెంజ్ చేస్తారు. మేము ఎంతవరకు జ్ఞానీ ఆత్మలుగా అయ్యాము అని స్వయాన్ని పరిశీలించుకోండి. ప్రతి సంస్కారము, జ్ఞానీ ఆత్మకు అర్ధమే ప్రతి మాట జ్ఞాన సహితంగా ఉండటము. కర్మ కూడా జ్ఞానస్వరూపంగా ఉండాలి, అటువంటివారినే జ్ఞానీ ఆత్మలు అని అంటారు. ఆత్మలో ఏయే విధంగా సంస్కారాలు ఉంటాయో అవి ఆటోమేటిక్ గానే పని చేస్తాయి. జ్ఞానీ ఆత్మల సహజ కర్మలు, మాటలు స్వరూపమవుతాయి. కావున జ్ఞానీ ఆత్మలుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. దుర్గతిలోకి వెళ్ళేందుకు సంబంధించిన విషయాలు కాస్త కూడా ఉండకూడదు. ఎక్కడ జ్ఞానము ఉంటుందో అక్కడ భక్తి ఉండదు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ్ఞానము ఉండదు అని మీరు అంటుంటారు కదా. రాత్రి పగలు ఉదాహరణను ఇస్తూ చెప్తుంటారు కదా? కావున భక్తితనపు సంస్కారాలు స్థూలంగా కానీ సూక్ష్మరూపంలోగానీ ఉండకూడదు. జ్ఞాన సంస్కారము కూడా చాలా కాలము నుండి కావాలి కదా! చాలా కాలము నుండి ఇప్పుడు సంస్కారమును నింపుకోనట్లయితే చాలాకాలము రాజ్యము కూడా చెయ్యరు. అంతిమ సమయములో నింపుకునే పురుషార్థము చేసినట్లయితే రాజ్యభాగ్యము కూడా అంతిమములోనే పొందుతారు. ఇప్పటినుండే చేసినట్లయితే రాజ్యభాగ్యము కూడా ముందునుండే పొందుతారు. ఎంతచేస్తారో అంత పొందుతారు అన్న లెక్క పూర్తిగా ఉంది. మధువన నివాసులకయితే లిఫ్ట్ వుంది మరియు అదనపు గిఫ్ట్ వుంది ఎందుకంటే ఎదురుగా ఉదాహరణ ఉంది, అన్ని సహజ సాధనాలు ఉన్నాయి. కేవలము కారణమును నివారణలోకి పరివర్తన చేసినట్లయితే మధువననివాసులకు ఏదైతే కానుక ఉందో దాని ద్వారా స్వయమును చాలా పరివర్తన చేసుకోగలరు. మీ ఎదురుగా ఎల్లప్పుడూ నిమిత్తంగా అయి ఉన్న మూర్తులు ఉదాహరణగా ఉన్నారు. శక్తుల సంకల్పము కూడా శక్తి సంపన్నంగా ఉంటుంది, బలహీనంగా ఉండదు. ఏది అనుకుంటే అది చెయ్యాలి,  ఇటువంటివారినే శక్తిసేన అని అంటారు. ఇక్కడైతే చాలా సహజ సాధనాలు ఉన్నాయి. పని చేసారు మరియు తమ పురుషార్థములో మునిగిపోతారు. మధువన నివాసులతోనే మధువన శోభ ఉంది. అయినా కూడా చాలా అదృష్టవంతులు. మీ గురించి మీరు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా కూడా  మీరైతే అదృష్టవంతులు చాలా విషయాల నుండి రక్షింపబడ్డారు. స్థాన మహత్వమును, సాంగత్య మహత్వమును, వాయుమండల మహత్వమును కూడా తెలుసుకున్నట్లయితే ఒక్క క్షణములో గొప్పవారిగా  అయిపోతారు. అదేమంత పెద్ద విషయము కాదు. మాల ఫిక్స్ అవ్వలేదు, అందరికీ అవకాశము ఉంది. ప్రాక్టికల్ లో ఏ పరివర్తనను చూపిస్తారో ఇప్పుడు చూస్తాము. ఆశావాదులే కదా? అచ్ఛా!

Comments